![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ganta Srinivasa Rao: చిరంజీవి నిజాలే మాట్లాడారు, ఏపీలో పరిస్థితి అలా ఉంది: ఏపీ మంత్రులకు గంటా చురకలు
Ganta Srinivasa Rao supports Chiranjeevi: చిరంజీవి చెప్పిన దానిలో తప్పేముంది, నిజాలే మాట్లాడారని.. ఏపీ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు అంటూ వైసీపీ నేతలపై గంటా శ్రీనివాసరావు సెటైర్లు వేశారు.
![Ganta Srinivasa Rao: చిరంజీవి నిజాలే మాట్లాడారు, ఏపీలో పరిస్థితి అలా ఉంది: ఏపీ మంత్రులకు గంటా చురకలు Former Minister Ganta Srinivasa Rao supports Chiranjeevi over his ramarks against AP Government Ganta Srinivasa Rao: చిరంజీవి నిజాలే మాట్లాడారు, ఏపీలో పరిస్థితి అలా ఉంది: ఏపీ మంత్రులకు గంటా చురకలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/09/25058d1c2c868a98d00ee6b1f127d6921691520810595233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ganta Srinivasa Rao supports Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ నేతలు విరుచుకు పడుతుంటే.. మరోవైపు అదే స్థాయిలో టీడీపీ, బీజేపీ నేతలు ఆయనకు మద్దతు పలుకుతున్నారు. తాజాగా ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. చిరంజీవి వ్యాఖ్యలను సమర్థించారు. చిరంజీవి చెప్పిన దానిలో తప్పేముంది, నిజాలే మాట్లాడారని.. ఏపీ ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చారు అంతే కదా అంటూ వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు. విమర్శలకు, వివాదాలకు దూరంగా ఉండే అందరివాడు చిరంజీవి అని, ఆయనకు కూడా ఇబ్బంది కలిగి అలా మాట్లాడారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు.
ఏపీ ప్రభుత్వం, వైసీపీ నేతలు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం గురించి, ప్రాజెక్టుల గురించి గానీ.. పేదవాడి కడుపు నింపే ఉద్యోగ ఉపాధి కల్పన గురించి ఆలోచించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని సూచించారు. అలా కాదని పిచ్చుక పై బ్రహ్మాస్త్రం లాగా ఇండస్ట్రీ మీద పడతారేంటని ప్రశ్నించారు. ఏపీ ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ప్రభుత్వాలను వాళ్లు గుండెల్లో పెట్టుకుంటారు అన్నారు. చిరంజీవి చెప్పిన వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి వైపు దృష్టి సారించాల్సింది పోయి మెగాస్టార్ పై విమర్శలు చేయడంలో అర్థం లేదని అభిప్రాయపడ్డారు.
పట్టుమని పది నిముషాలు తమ శాఖలు గురించి మాట్లాడలేని మంత్రులందరూ మీడియా ముందుకు వచ్చి అదేదో బ్రహ్మాండం బద్దలైనట్టు చిరంజీవి గురించి మాట్లాడటం సరికాదని హితవు పలికారు. వైసీపీ ప్రభుత్వం సినిమా పరిశ్రమపై కాకుండా ఉద్యోగాలు, పేదలపై దృష్టి సారించాలన్న చిరంజీవి వ్యాఖ్యలను తెలుగు ప్రజలందరూ సమర్థిస్తున్నారు అని తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేశారు. శాఖల నుంచి పట్టుమని పది నిమిషాలు మాట్లాడలేరని ఏపీ మంత్రులపై ప్రతిపక్షాలు తరచుగా విమర్శిస్తున్నాయి.
గత నాలుగు సంవత్సరాలుగా ఏపీలో ఎక్కడా అభివృద్ధి లేదని, కొత్త కంపెనీలు రావడం లేదని సోషల్ మీడియాలో మరోసారి విమర్శలు మొదలయ్యాయి. కొత్త కంపెనీలు రావడం కాదు కదా , ఉన్న కంపెనీలను కూడా తరిమేస్తున్నారు.. అంతా నియంతృత్వ మేనని, మధ్య తరగతిప్రజలు ఇప్పటికే మోయలేనంత భారం మోస్తున్నారంటూ ఏపీ నెటిజన్స్ సైతం మండిపడుతున్నారు. తమకు ఎక్కువ ఎంపీ సీట్లు ఇస్తే, కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా సాధిస్తామని గత ఎన్నికలకు ముందు జగన్ చెప్పారు. కానీ రాష్ట్రంలో ఘన విజయం సాధించడంతో పాటు భారీగా ఎంపీ సీట్లు 22 సీట్లు నెగ్గారు. కేంద్రంలో బీజేపీకి సొంతంగా అధికారం ఏర్పాటుచేసే మెజార్టీ వచ్చిందని, మనం ఏమీ చేయలేమని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా అడుగుతూనే ఉందామని మాట మార్చారంటూ టీడీపీ నేతలు సందర్భం దొరికినప్పుడల్లా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
Also Read: ఆయన మాటల్లో తప్పేముంది - చిరంజీవికి ఏపీ బీజేపీ సపోర్ట్ !
ఇంతకీ చిరు ఏమన్నారు, ఏం జరిగిందంటే..
'వాల్తేరు వీరయ్య' 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మూవీ టీం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు. సినిమాలపై పడకుండా అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సూచించారు. ‘‘మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం గురించి, ప్రాజెక్టులు, పేదవారికి కడుపు నిండే విషయంగానీ, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం.. వాటి గురించి ఆలోచించాలి. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి?" అని చిరంజీవి అన్నారు. ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చిరంజీవి వ్యాఖ్యానించడం వివాదాలకు దారితీసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)