Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
National News: జమిలి ఎన్నికలకు సంబంధించి మరో కీలక ముందడుగు పడింది. జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెట్టనుంది.

Central Cabinet Approves Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు (Jamili Election Bill) కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' బిల్లుకు ఆమోదముద్ర వేసింది. దీంతో త్వరలోనే పార్లమెంట్లో (Parliament) ఈ బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో తప్పనిసరిగా సభకు హాజరు కావాలని తమ ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్లు విప్ జారీ చేశాయి.
కాగా, జమిలి ఎన్నికలకు సంబంధించి గతంలో కోవింద్ కమిటీ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొనసాగుతోన్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కేంద్రం జమిలికే మొగ్గు చూపుతుండడంతో దీని కోసం ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకునేందుకు సమాయత్తం అవుతోంది. మొత్తం 2 దశల్లో ఎన్నికలు జరగనుండగా.. తొలి దశలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు.. అవి పూర్తైన 100 రోజుల్లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. దీని కోసం దేశవ్యాప్తంగా ఒకే ఓటరు జాబితా ఉపయోగించనున్నారు.
జమిలి ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్న వేళ.. దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి ఈ బిల్లుకు సిఫార్సు చేయాలని సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్లతోనూ సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అన్ని భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
సెప్టెంబర్లోనే గ్రీన్ సిగ్నల్
కాగా, పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకూ అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించడంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో రూపొందించిన నివేదికను భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఈ ఏడాది మార్చిలో అందించారు. అనంతరం కోవింద్ కమిటీ ఇచ్చిన సిఫార్సులకు కేంద్ర మంత్రివర్గం ఈ సెప్టెంబరులోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజా పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టాలని భావిస్తోన్న ప్రభుత్వం.. తాజాగా కేంద్ర కేబినెట్లో ఆమోద ముద్ర వేసింది.
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల ప్రతిపాదనలను 30కి పైగా పార్టీలు సమర్థించగా.. కాంగ్రెస్ సహా 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే, ఈ ప్రతిపాదన ఆచరణాత్మకమైనది కాదని కాంగ్రెస్ పేర్కొంటోంది. తమ పార్టీ జమిలి ఎన్నికలకు మద్దతివ్వడం లేదని, ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎన్నికలు నిర్వహించాలని వాదిస్తోంది.
Before You Go
ADR Report l Criminals in TVK: విజయ్ పార్టీలోనూ నేరస్తులే - రాజకీయం మారలేదు
ట్రెండింగ్ వార్తలు























