Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిర్మించుకున్న ఇళ్ల కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆ ప్రాంతంలోని సుమారు 650 ఇళ్లను రెవెన్యూ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీసం ఇంట్లోని సామాన్లు సర్దుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా జేసీబీలతో గూడును నేలమట్టం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీ పనులు చేసుకుంటూ, అప్పులు చేసి కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఒక్కో ఇటుక పేర్చుకుని నిర్మించుకున్న ఇళ్లు కళ్లముందే ధ్వంసమవుతుంటే మహిళలు, వృద్ధులు అడ్డంగా పడుతూ రోదించిన తీరు అక్కడి వారిని కలిచివేసింది. ఈ భూములు భూదాన్ బోర్డుకు చెందినవని, ఇవి ప్రభుత్వ పరిధిలోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఎనిమిది నెలలుగా పేదలు ఈ భూమిలో గుడిసెలు వేసుకుని, క్రమంగా రేకుల ఇళ్లు, పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. సుమారు 17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. గతంలోనే అధికారులు ఇక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ, ఇళ్ల నిర్మాణాలు ఆగకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు ఈ తొలగింపు చర్యలు చేపట్టినట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అయితే నిర్వాసితుల ఆందోళనలతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల పోలీసులకు, నిర్వాసితులకు మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగాయి.























