కృష్ణలంక పోలీస్ స్టేషన్కు సంబంధించిన ఏడాదికి పైగా కీలకమైన సీసీటీవీ ఫుటేజీలు మాయమవడమే ఈ కేసులో కీలక మలుపు. సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదని ఆరోపణలున్నాయి.
Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీ ఫుటేజీలు మాయం - వీడియో రికవరీ సాధ్యమేనా?
కృష్ణలంక పోలీస్ స్టేషన్ బయటా, లోపల సాయికృష్ణను తీసుకొచ్చినప్పటి నుంచి రికార్డు అయిన ఫుటేజీ డిలీట్ అయినట్లు సిట్ టీమ్ గుర్తించింది. ఆ హార్డ్ డిస్క్ నుంచి వీడియో రికవరీకి ప్రయత్నిస్తున్నారు.

- రౌడీషీటర్ సాయికృష్ణ కేసులో పోలీస్ స్టేషన్ సీసీటీవీ మాయం.
- సుప్రీం నిబంధనల ఉల్లంఘన, ఫుటేజ్ ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు అనుమానం.
- ఏపీ ప్రభుత్వం సీరియస్, కేసుపై సిట్ విచారణ చేపట్టింది.
- సాయికృష్ణ తల్లి లాకప్ డెత్ ఆరోపణ, కోర్టు ఆదేశాలిచ్చింది.
Vijayawada Sai Krishna Missing Case | విజయవాడ: విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన రౌడీషీటర్ సాయికృష్ణ అదృశ్యం కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్కు సంబంధించిన దాదాపు ఏడాదికి పైగా రికార్డులు, కీలకమైన సీసీటీవీ ఫుటేజీలు మాయమైనట్లు సమాచారం. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పోలీస్ స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజీలను కనీసం 18 నెలల పాటు భద్రపరచాల్సి ఉన్నా, ఇక్కడ ఆ నిబంధనలు అమలు కాలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఒక స్థానిక టెక్నీషియన్ సహాయంతో ఉద్దేశపూర్వకంగా సీసీటీవీ ఫుటేజీలను డిలీట్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సిట్ అధికారులు కృష్ణలంక పోలీస్ స్టేషన్కు సంబంధించిన సీసీటీవీ హార్డ్డిస్క్, డీవీఆర్ (DVR), ఎన్వీఆర్ (NVR)లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అయితే కేవలం రెండు రోజుల ఫుటేజీ మాత్రమే లభ్యం కావడంతో, మిగతాది డిలీట్ చేసినట్లు తేలడంతో అది రికవరీ చేయడానికి సిట్ టీమ్ హార్డ్ డిస్క్లను ల్యాబ్కు పంపింది. ఫోరెన్సిక్ నిపుణులు ఆ ఫుటేజీని రికవరీ చేయడంపై కేసు తదుపరి విచారణ ఆధారపడి ఉంటుంది. కేసులో బాధ్యుల్ని గుర్తించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది.
Also Read: CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు ఇంటికి టాస్క్ఫోర్స్ పోలీసులు.. అరెస్టుకు రంగం సిద్ధం?
సాయికృష్ణ కుటుంబసభ్యులను విచారించిన సిట్
సిట్ అధికారులు సోమవారం నాడు బాధితుడు సాయికృష్ణ కుటుంబసభ్యులను 6 గంటలపాటు విచారించి వారి స్టేట్మెంట్ రికార్డు చేశారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, మేనమామలు ముళ్లపూడి నాగేశ్వరరావు, నవరంగ్, పిన్ని కనకదుర్గ(లాయర్)ల స్టేట్మెంట్ నమోదు చేశారు. మరోవైపు సీఐ నాగరాజును, కేసు సంబంధిత పోలీసులను సైతం కొన్ని గంటలపాటు విచారించిన సిట్ వారి నుంచి పలు వివరాలు రాబట్టింది. కృష్ణలంకలోని స్వర్గపురికి వెళ్లిన సిట్ టీమ్ అక్కడి కంప్యూటర్లో ఆయా తేదీల్లో దహనం చేసిన మృతదేహాల వివరాలు చెక్ చేశారు. ఎలక్ట్రిక్ దహన వాటిక ఆపరేటర్ బాషాతో పాటు కాటికాపరిగా ఉన్న శివను పిలిచి విచారించారు. ఆ మార్గంలో సీసీటీవీ ఫుటేజీలు సేకరించడంపై ఫోకస్ చేశారు.
సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడ తీసుకొచ్చిన ముగ్గురు టాస్క్ఫోర్స్ సిబ్బందిని, ఒక కృష్ణలంక కానిస్టేబుల్ను కూడా సిట్ విచారించి వివరాలు సేకరించనుంది. సాయికృష్ణను ఎప్పుడు తీసుకొచ్చారు, ఎవరికి అప్పగించారనే విషయాలతో పాటు ఎక్కడ, ఎన్ని రోజులు ఉంచారు అనే కోణంలో వీరిని ప్రశ్నించనున్నారు. సాయికృష్ణను కృష్ణలంక పోలీసులకే అప్పగించామని టాస్క్ఫోర్స్ సిబ్బంది ప్రాథమిక విచారణాధికారికి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపినట్లు సమాచారం.
దర్యాప్తు చేపట్టిన సిట్..
మొదట విచారణాధికారిని నియమించినా.. విమర్శలు తీవ్రతరం కావడంతో దర్యాప్తు చేయడానికి సిట్ ఏర్పాటు చేసింది. గాదె సాయికృష్ణ అదృశ్యం, కస్టడీలో మృతి ఆరోపణల కేసును నిష్పక్షపాతంగా విచారించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లేని సీనియర్ ఐపీఎస్ అధికారులతో ఏర్పాటు చేసిన సిట్ ఈ బృందానికి ఐజీ (లా అండ్ ఆర్డర్) ఎం. రవిప్రకాష్ నేతృత్వం వహిస్తున్నారు. ఆయనతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మీ, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్, బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ ఎల్. సుధాకర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ సిట్ ఏర్పాటుకు ముందు ప్రాథమిక విచారణాధికారిగా వ్యవహరించిన ఏసీపీ దైవప్రసాద్ ఈ కేసు పూర్తి వివరాలను, సేకరించిన ఆధారాలను ఈ నలుగురు సభ్యుల బృందానికి అందజేశారు.
ఏపీ ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సాయికృష్ణపై దారుణంగా వ్యవహరించారని ఆరోపణలు రావడంతో ఆయనను మొదట సస్పెండ్ చేశారు. ఆపై సాయికృష్ణ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
లాకప్ డెత్ జరిగిందంటూ తల్లి ఆరోపణ..
సాయికృష్ణను మార్కాపురం నుండి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారని, అక్కడ లాకప్లో పెట్టి తీవ్రంగా చిత్రహింసలు పెట్టడం వల్లే అతను చనిపోయి ఉంటాడని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఆమె కోర్టును ఆశ్రయించగా, మే 1 నుండి జూన్ 1 వరకు ఉన్న సీసీటీవీ దృశ్యాలను భద్రపరచాలని కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే అధికారులు తనిఖీ చేయగా కేవలం రెండు రోజులకు సంబంధించిన ఫుటేజీ మాత్రమే లభ్యమవ్వడం, మిగతా ఫుటేజీ మాయమవ్వడం ఈ కేసులో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
Frequently Asked Questions
రౌడీషీటర్ సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక మలుపు ఏమిటి?
కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజీ ఎందుకు మాయమైంది?
సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం కనీసం 18 నెలలు భద్రపరచాల్సిన ఫుటేజీ కనిపించకుండా పోయింది. ఒక టెక్నీషియన్ సహాయంతో ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేశారని అనుమానిస్తున్నారు.
ఈ కేసు విచారణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది?
ఏపీ ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. సీఐ నాగరాజును సస్పెండ్ చేసి, కేసు నమోదు చేసింది.
సాయికృష్ణ తల్లి ప్రధాన ఆరోపణ ఏమిటి?
సాయికృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి, లాకప్లో చిత్రహింసలు పెట్టడం వల్లే చనిపోయాడని ఆమె ఆరోపించారు. ఈ విషయమై కోర్టును ఆశ్రయించారు.
ట్రెండింగ్ వార్తలు























