Vidadala Rajani: వైసీపీకి షాక్ ఇచ్చే యోచనలో విడదల రజనీ - రేపోమాపో గుడ్ బై - కారణం జగనే!
YSRCP : వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయాలని విడుదల రజనీ భావిస్తున్నారు. తన నియోజకవర్గాన్ని మళ్లీ రేపల్లెకు మార్చాలని జగన్ అనుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Vidadala Rajani is considering saying goodbye to YSRCP : చిలుకలూరిపేట వైసీపీ ఇంచార్జ్, మాజీ మంత్రి విడదల రజనీ వైసీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన చేస్తారని అంటున్నారు. అయితే ఆమె ఏ పార్టీలో చేరుతారన్నదానిపై క్లారిటీ లేదు. గతంలో హడావుడి చేసే ఆమె ఇటీవల రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.
రేపల్లెకు ఇంచార్జ్ గా వెళ్లాలని సూచించిన జగన్
విడదల రజనీ గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి యాభై వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అక్కడ అయితే గెలవడం కష్టమని 2019లో తాను పోటీ చేసి గెలిచిన చిలుకలూరిపేట నియోజకవర్గానికే మళ్లీ వచ్చారు. అక్కడ ఏడాదిగా పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ ఇటీవల పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి .. గుంటూరు జిల్లాలో ఇంచార్జులను మార్చాని నిర్ణయించుకున్నారు. రేపల్లెలో పార్టీ నేతలు ఎవరూ బలంగా లేకపోవడం, సామాజిక సమీకరణాలతో విడదల రజనీని అక్కడ పని చేసుకోవాలని సూచించారు.
పార్టీ అయినా మారుతాను కానీ చిలుకలూరిపేట వీడేది లేదని రజనీ పట్టు
విడుదల రజనీ భర్త కాపు సామాజికవర్గం, ఆమె ముదిరాజ్ వర్గానికి చెందిన వారు. ఈ కారణంగా రేపల్లెలో అయితే సామాజికపరంగా కలసి వస్తుందని అక్కడకు వెళ్లి పని చేసుకోవాలని సూచించారు. రేపల్లె వైసీపీ నేత మోపిదేవి వెంకటరమణారావు టీడీపీలో చేరిపోయారు. రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. ఆయన మళ్లీ వైసీపీలోకి వచ్చే అవకాశం లేదు. అలాగే గత ఎన్నికల్లో వైసీపీ త రపున పోటీ చేసిన మాజీ మంత్రి ఈపూరి సీతారావమ్మ కుమారుడు ఈపూరి గణేష్ సమర్థంగా పని చేయడం లేదని ఆయన వల్ల కాదని వైసీపీ అధినాయకత్వం క్లారిటీకి వచ్చింది. అందుకే మార్చాలని నిర్ణయించుకుంది.
బీజేపీ , జనసేనతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం
కానీ టీడీపీకి కంచుకోట లాంటి రేపల్లే నియోజవకర్గానికి వెళ్లి తాను మరోసారి రాజకీయంగా బలవడానికి సిద్ధంగా లేనని విడదల రజనీ చెబుతున్నట్లుగా తెలుస్తోంది. చిలుకలూరిపేట నియోజవకర్గంలోనే ఇంచార్జ్ గా కొనసాగిస్తే తాను పార్టీలో ఉంటానని మరోసారి మార్చాలని అనుకుంటే తాను పార్టీ మారిపోతానని ఆమె పార్టీ ముఖ్యులకు సంకేతాలు పంపారు. అయితే పార్టీ నుంచి ఆమెకు ఇంకా సానుకూల స్పందన లేదు. అందుకే ఆమె పార్టీ మారిపోతారన్న లీకులు వస్తున్నాయని చెబుతున్నారు. ఒక వేళ జగన్.. మనసు మార్చుకుని చిలుకలూరిపేట ఇంచార్జ్ గానే కొనసాగాలని ఆఫర్ ఇస్తే.. విడదల రజనీ పార్టీ మారే అవకాశాలు లేవని చెబుతున్నారు. జనసేన, బీజేపీతో .. విడదల రజనీ వర్గీయులు ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది.





















