![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
TDP Leaders: దొంగ ఓట్ల కోసమే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ - ఎన్నికల అధికారికి టీడీపీ ఫిర్యాదు
TDP Leaders: దొంగ ఓట్ల కోసమే జగన్ రెడ్డి ప్రభుత్వం వలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు కనిపిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
![TDP Leaders: దొంగ ఓట్ల కోసమే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ - ఎన్నికల అధికారికి టీడీపీ ఫిర్యాదు TDP Delegation Complaint To Chief Electoral Officer About Fake Votes Enroll TDP Leaders: దొంగ ఓట్ల కోసమే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ - ఎన్నికల అధికారికి టీడీపీ ఫిర్యాదు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/08/8500d3053c2e56e370d7bab34e18fa4c1699461797252798_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telugu Desam Party: దొంగ ఓట్ల కోసమే జగన్ రెడ్డి ప్రభుత్వం వలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు కనిపిస్తోందని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలతో కలిసి, రాష్ట్ర సచివాలయంలో బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena)ను కలిసి దొంగ ఓట్లపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఓటర్ల జాబితాలో అవకతవకలకు తెరలేపిందని విమర్శించారు. దొంగఓట్లు సృష్టించడం, అర్హుల ఓట్లు తొలగించడం అనే తంతుని నిరంతరం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఈ మాట తాము అనడం లేదని.. అన్ని పార్టీలు.. ప్రజలే అంటున్నారని చెప్పారు
ఎమ్మెల్యే అనిల్కు మూడు చోట్ల ఓట్లు
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక చెట్టుకు ఓటు హక్కు కల్పించారని, ఒక్కో వ్యక్తికి మూడు, నాలుగు చోట్ల దొంగ ఓట్లు నమోదు చేయించారని విమర్శించారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Poluboina)కు మూడుప్రాంతాల్లో ఓట్లున్నాయని, ఆయన ఎవరో ఈ ప్రభుత్వానికి, అధికారులకు తెలియదా? అంటూ ప్రశ్నించారు. కేవలం దొంగ ఓట్లతోనే వచ్చేఎన్నికల్లో గెలవాలని జగన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియలో జరిగే తప్పులు.. ఓటర్ల జాబితాకు సంబంధించిన తప్పులను ఆధారాలతో అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా వారు స్పందించడం లేదని ఆరోపించారు
చర్యలు తీసుకోవడం లేదు
ఓట్ల సమస్యలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల దరఖాస్తులు పెండింగ్లోఉంటే.. వాటిని పరిష్కరించకుండా మరలా కొత్తగా ఫామ్-6, ఫామ్-7, ఫామ్-8 ఇతర వివరాలు అడగడం సరికాదన్నారు. 5.58 లక్షల ఫామ్ -7ల దరఖాస్తులు, 7.16 లక్షల ఫామ్-8 దరఖాస్తులు అందించినా అధికారులు పట్టించుకోలేదని వెల్లడించారు. నియోజకవర్గాల వారీగా పోలైన దొంగఓట్లు, అర్హుల ఓట్ల తొలగింపు వివరాలను కూడా ఎన్నికల కమిషన్ ముందు ఉంచామని, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
త్వరలోకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
18 నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు సరిగా లేవని, స్థానిక ఎమ్మెల్యేల ప్రోద్బలంతోనే పోలింగ్ కేంద్రాలు మార్చడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ ఒక్కరోజే 13 లేఖలు అందించినట్లు చెప్పారు. ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలు.. దొంగఓట్ల వ్యవహారం.. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఇతర అంశాలపై త్వరలోనే టీడీపీ ఎంపీలతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు సజావుగా జరగాలన్నదే టీడీపీ అభిమతమని అచ్చెన్న అన్నారు. వైసీపీలోని పెద్ద నాయకులే సిగ్గులేకుండా దొంగఓట్లు చేర్పిస్తున్నారని ఆరోపించారు.
అధికారుల ప్రమేయం లేకుండా ఎలా సాధ్యం?
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు(Bonda Umamaheswara Rao) మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ డ్రైవ్ రాష్ట్రంలో అపహాస్యంగా మారిందని అన్నారు. ఆర్వోలు, కలెక్టర్లు చుట్టూ తిరగడమే ప్రతిపక్షాల పని అయ్యిందని విమర్శించారు. ఫామ్-7 దరఖాస్తుల విషయంలో టీడీపీ ఓట్లు తొలగించే విషయంలో అధికారులు పోటీలు పడి పనిచేస్తున్నారని, వారికి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహకరిస్తున్నారని ఆరోపించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక వైసీపీ నాయకుడి తల్లిపేరుతో మూడు ఓట్లు నమోదు చేశారని, అధికారుల ప్రమేయం లేకుండా మూడు ఓట్లు ఎలా నమోదవుతాయని ప్రశ్నించారు.
వారికి నచ్చితే చెప్పులకు కూడా ఓటు
అధికార పార్టీకి నచ్చితే చెట్టుకు, పుట్టకు, ఆఖరికి చెప్పులకు కూడా ఓట్లు పుట్టిస్తారని బోండా ఉమా విమర్శించారు. టీడీపీ వాళ్లు దొంగఓట్లు తీసేయమంటే నిబంధనలు అంటున్న అధికారులకు ఇలాంటి వింతలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో తాను 25 ఓట్లతో ఓడిపోయానని, ఇప్పుడు తన నియోజకవర్గంలో 12,000 దొంగఓట్లు చేర్చారని ఆరోపించారు. వాటిపై చర్యలు తీసుకోవాలని కోరితే వెటకారంగా సమాధానమిస్తున్నారని అన్నారు. ఓటమి భయంతోనే జగన్ రెడ్డి అధికారుల్ని అడ్డుపెట్టుకొని ఓటర్ల జాబితాలో ఇలాంటి అవక తవకలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)