YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Sharmila accuses Jagan : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ అధినేత జగన్ పై మునుపెన్నడూ లేనంత ఘాటుగా విరుచుకుపడ్డారు ఆస్తుల గొడవను తెరపైకి తెచ్చి డైవర్షన్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు.

Sharmila accuses Jagan of engaging in diversionary politics: నేను వివేకా హత్య గురించి నిలదీస్తుంటే, వైసీపీ కావాలనే ఆస్తుల అంశాన్ని ముందుకు తెస్తోందని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె జగన్తో ఆస్తుల వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మాట్లాడింది వివేకా హత్యపైనే తప్ప ఆస్తుల గురించి కాదని ఆమె స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఒకే అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజం చేయాలని వైసీపీ ప్రయత్నిస్తోందని, కానీ పైన దేవుడు ఉన్నాడని ఆమె హెచ్చరించారు. వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించింది అవినాష్ రెడ్డేనని, ఆ నిజాన్ని ప్రశ్నించినందుకే తనపై అపనిందలు వేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
ఆస్తుల కోసం కోర్టుకు వెళ్లింది జగనే
తనకు ఆస్తులే ముఖ్యం అయితే తెలంగాణలో పార్టీ పెట్టేదాన్ని కాదని, ఆస్తుల కోసం కోర్టుకు వెళ్ళింది కూడా తాను కాదని షర్మిల గుర్తు చేశారు. జగన్ లాగా నాకు స్వార్థ రాజకీయాలు తెలియవు. వేరే వాళ్ల ఆస్తులు అనుభవించాల్సిన దుస్థితి నాకు పట్టలేదు అని ఆమె ఎద్దేవా చేశారు. తన పోరాటంలో ఆస్తుల అంశం అసలు ఎజెండానే కాదని, తాను కేవలం వైఎస్సార్ ఆశయాల కోసం నడుస్తున్న వ్యక్తిని మాత్రమేనని ఆమె కుండబద్దలు కొట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో తాను చేతులు కలిపానని వస్తున్న ఆరోపణలను కూడా ఆమె తీవ్రంగా ఖండించారు.
విజయమ్మ లేఖపై సమాధానం చెప్పే దమ్ము ఉందా?
ముఖ్యంగా తన తల్లి వైఎస్ విజయమ్మ రాసిన లేఖపై జరుగుతున్న వివాదంపై షర్మిల అత్యంత కఠినంగా స్పందించారు. విజయమ్మ కేవలం వైఎస్సార్ భార్య మాత్రమే కాదు, ఆయనలో సగం. ఆ తల్లి తన ఆవేదనను లేఖ ద్వారా వ్యక్తం చేస్తూ, మనుమలందరికీ ఆస్తి పంపిణీ సమానంగా జరగాలని కోరారు. ఇది వైఎస్సార్ ఆదేశం కూడా అని ఆమె తెలిపారు. ఈ లేఖపై సమాధానం చెప్పే దమ్ము జగన్కు లేక, వైసీపీ నేతలతో తనపై విమర్శలు చేయిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ లేఖను విమర్శిస్తున్న వారిని సైతాన్లు , మొరిగే కుక్కలు అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
విజయమ్మపై తప్పుడు ప్రచారం
విజయమ్మ లేఖ అబద్ధమైతే, జగన్ తన సాక్షి రిపోర్టర్ను పంపి అమ్మ బైట్ తీసుకోవచ్చు కదా? లేదా నేరుగా ఆమేను అడగొచ్చు కదా అని షర్మిల సవాల్ విసిరారు. అలా చేయకపోవడమే ఆ లేఖ నిజమనడానికి నిదర్శనమన్నారు. లేఖలో సంతకం లేదని చేస్తున్న ప్రచారం తప్పని, లేఖ నిజం కాకపోతే విజయమ్మ ఎప్పుడో ఖండించేవారని ఆమె స్పష్టం చేశారు. జగన్ తన విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారని, అధికార పత్రిక సాక్షిలో అబద్ధాలను ప్రచారం చేస్తూ సత్యాన్ని పాతిపెట్టాలని చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
వివేకా హత్యను గుండెపోటుగా ఎందుకు ప్రచారం చేశారు?
వివేకా హత్య వెనుక ఉన్న నిజాలను బయటపెట్టడంలో జగన్ , భారతి ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె నిలదీశారు. ఉదయం 7 గంటల నుంచే సాక్షిలో వివేకాది గుండెపోటు అని ఎందుకు ప్రచారం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయం కోసం ఎవరికీ దత్తపుత్రులుగా మారాల్సిన అవసరం తనకు లేదని, బాధితుల పక్షాన తన పోరాటం కొనసాగుతుందని షర్మిల స్పష్టం చేశారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















