Andhra CCTV360: నేరగాళ్లను ఇట్టే పట్టిస్తున్న ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 వ్యవస్థ - ఏఐ కెమెరాలతో ఏపీ పోలీసుల పని సులువు
AI cameras CCTV 360: ఆధునిక సాంకేతికతతో నేరగాళ్లను ఇట్టే పట్టుకుంటున్నారు ఏపీ పోలీసులు. సీసీటీవీ 360 అనే వ్యవస్థ కేవలం నేరాన్ని రికార్డ్ చేయడం కాదు.. నేరగాళ్లు ఎక్కడ తిరిగినా అలర్ట్స్ పంపుతోంది.

RTGS CCTV 360 system catching criminals : ఆధునిక సాంకేతికత తోడైతే నేరగాళ్ల ఆటలు సాగవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరూపిస్తోంది. నేరాలు చేసి తప్పించుకోవచ్చని భావించే కేటుగాళ్లకు, ప్రమాదాలు చేసి పారిపోయే నిందితులకు ఇప్పుడు ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 వ్యవస్థ ఒక పీడకలలా మారింది. కేవలం కెమెరా కళ్లు చూస్తుండటమే కాదు, అవి చూసిన విషయాన్ని క్షణాల్లో విశ్లేషించి పోలీసులను ఉరుకులు పెట్టించడం ఈ వ్యవస్థ ప్రత్యేకత.
చోరీ చేసిన దొంగను ఇట్టే పట్టించిన సీసీటీవీ 360 వ్యవస్థ
ఇటీవల తిరువూరులో జరిగిన ఓ చోరీ కేసు ఈ సాంకేతికతకు అద్దం పడుతోంది. ఇంటి తాళాలు పగులగొట్టి బుల్లెట్ బైకుతో ఉడాయించిన దొంగ, తాను ఎక్కడా దొరకనని భావించాడు. కానీ, ఆర్టీజీఎస్ లోని ఏఎన్పీఆర్ ANPR - ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ అనలిటిక్స్ ఆ బైకు నంబరును లక్ష్యంగా చేసుకుంది. ఆ నిందితుడు ఉమ్మడి కృష్ణా, గోదావరి జిల్లాల్లోని ఎనిమిది ప్రాంతాల్లో తిరిగిన ప్రతిసారీ కెమెరాలు పోలీసులకు రియల్ టైమ్ అలర్ట్స్ పంపాయి. ఫలితంగా, ఆ బైకు ఎక్కడుందో ఖచ్చితంగా తెలుసుకున్న పోలీసులు నిందితుడిని వెంటాడి పట్టుకున్నారు.
నేరం చేసి ఎక్కడకు పోయినా పోలీసులకు అలర్ట్స్
కేవలం దొంగతనాలే కాదు, ప్రాణాలు తీసి పారిపోయే హిట్ అండ్ రన్ కేసుల్లోనూ ఈ కెమెరాలు కీలకంగా మారుతున్నాయి. కందుకూరులో ఒక పాదచారిని ఢీకొట్టి పారిపోయిన బైకర్ కోసం పోలీసులు వెతుకుతుండగా, ఒంగోలు బస్టాండ్ వద్ద ఉన్న కెమెరా ఆ వాహనాన్ని గుర్తుపట్టింది. నిందితుడు ఎటు వెళ్తున్నాడో మ్యాప్ పాయింటింగ్తో సహా సమాచారం అందడంతో, పోలీసులు అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగలిగారు. నేరం జరిగిన రోజుల తర్వాత కూడా నిందితుడు రోడ్డుపైకి వస్తే చాలు, ఈ వ్యవస్థ నిద్రపోకుండా కనిపెడుతూనే ఉంటుంది.
ఏఐ కెమెరాలోత నిఘా అనుసంధానం
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 14,700 అత్యాధునిక ఏఐ (AI) కెమెరాలు ఇప్పుడు ఒకే గొడుగు కింద అనుసంధానించారు. గతంలో కెమెరా రికార్డింగ్లను గంటల తరబడి చూడాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడటం వల్ల మానవ ప్రమేయం లేకుండానే వాహనాల నంబర్లు, రంగులు, మోడళ్లను కెమెరాలు గుర్తిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు రూపొందించిన ఈ స్మార్ట్ సర్వైలెన్స్ వ్యవస్థ, నేరాల దర్యాప్తులో పారదర్శకతను పెంచడమే కాకుండా పోలీసుల పనిభారాన్ని కూడా తగ్గిస్తోంది.
నేరగాళ్లకు దొరికిపోవడమే మార్గం
ఈ ఏఐ ఆధారిత కెమెరాలు కేవలం నేరగాళ్లను పట్టుకోవడానికే పరిమితం కాలేదు. ట్రాఫిక్ ఉల్లంఘనలు, ర్యాష్ డ్రైవింగ్ వంటి అంశాలను గుర్తించడంతో పాటు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రభుత్వానికి కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. తద్వారా సహాయక చర్యలు వేగంగా చేపట్టేందుకు అవకాశం కలుగుతోంది. ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 వ్యవస్థతో ఆంధ్రప్రదేశ్లో నేరగాళ్లకు ఇక ఎగ్జిట్ రూట్ లేదనే చెప్పాలి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















