Food Poison: రాగి జావ తాగిన విద్యార్థులకు అస్వస్థత.. కోనసీమ జిల్లాలో ఘటన..
Andhra Pradesh News | రాగిజావ తాగిన 14 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం జగ్గరాజుపేట ఎంపీపీ స్కూల్లో జరిగింది.

Food Poison in Konaseema District | ఉప్పలగుప్తం: పాఠశాలలో రాగి జావ తాగిన 14 మంది విద్యార్ధులకు అస్వస్థతకు గురయ్యారు.. వారిని హుటాహుటీన ఆసుప్రతికి తరలించి చికిత్స చేస్తున్నారు.. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం జగ్గరాజు పేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 26 మంది విద్యార్థిని విద్యార్థులు రాగిజావ త్రాగి అస్వస్థతకు గురవడం స్థానికంగా కలకలం రేగింది. దీంతో విద్యార్థుల తల్లితండ్రులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.. అత్యవసర చికిత్స నిమిత్తం అమలాపురంలోని ఏరియా ఆసుప్రతికి తరలించి వైద్యసేవలందించారు.
అసలేం జరిగిందంటే...
స్కూల్ కుక్ కమ్ హెల్పర్ ఇంట్లో శుభకార్యం ఉండడం వల్ల మంగళవారం ఉదయమే రాగిజావను ఇంటి వద్ద తయారుచేసి పాఠశా లలకు తీసుకువచ్చిందని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఈ రాగి జావను ఉదయం 10:30 సమయంలో విద్యార్థులకు పెట్టడం జరిగిందని, అయితే రాగిజావ తాగిన విద్యార్థులు కాసేపటికి వాంతులు చేసుకున్నట్లు చెప్పారు. కడుపులో వికారంగా ఉందని అందరు విద్యార్థులు చెప్పడంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు వెంటనే ఎన్.యానాం పీహెచ్సీకు సమాచారం అందించి హుటాహుటీన ఆసుప్రతికి తరలించారు. అప్పటికే రాగిజావ తాగిన 14 మంది అస్వస్థతకు గురికాగా వారికి అత్యవసర చికిత్స అందించారు.
మెరుగైన చికిత్స కోసం ఏరియా ఆసుప్రతికి..
ఎస్ యానం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రాథమిక చికిత్స నిమిత్తం తరలించి తదుపరి మెరుగైన వైద్య సేవలు అందించు నిమిత్తం ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు అమ లాపురం ఏరియా ఆసుపత్రికి 108 అంబులెన్స్ల్లో తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఏడుగురు పరిస్థితి బాగానే ఉందని, మరో ఏడుగురు పరిస్థితి కూడా మంగళ వారం సాయంత్రానికి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారని జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం భాష తెలిపారు. విద్యార్థలు ఆరోగ్య పరిస్థతి బాగానే ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు..
కుక్ కం హెల్పర్ ను విధుల నుంచి తొలగింపు
ప్రభుత్వ పాఠశాలలో రాగి జావ ఫుడ్ పాయిజన్ అయ్యి ఉంటుందని భావిస్తున్నట్లు డీఈఓ తెలిపారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వారి దృష్టికి తీసుకుని వెళ్ళగా వెంటనే కుక్ కం హెల్పర్ ను విధుల నుండి తొలగించాలని డీఈవో ని ఆదేశించడం జరిగిందన్నారు. ఈ మేరకు కుక్ కం హెల్పర్ ను విధుల నుండి తొలగించడం జరిగిందని డీఈఓ ఆ ప్రకటనలో తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను అమలాపురం ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు, అమలాపురం ఆర్డీవో కె.మాధవి తదితర అధికారులు పరామర్శించి విద్యార్థలు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశించారు..





















