రాజోలు నియోజకవర్గం జనసేనకు మొట్టమొదటి ఎమ్మెల్యేను అందించింది. పవన్ కళ్యాణ్ కూడా దీనిని ఒక చిరుదివ్వెగా అభివర్ణించారు.
Jana Sena vs TDP: రంజుగా రాజోలు రాజకీయం: జనసేన-టీడీపీ మధ్య కోల్డ్ వార్! ఎమ్మెల్యేపై సొంత పార్టీలోనే అసంతృప్తి!
Jana Sena vs TDP:రాజోలు నియోజకవర్గంలో జనసేన, టీడీపీ ఇంచార్జ్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ తలపోటే సరిపోదన్నట్ల రెండు పార్టీల్లోనూ అంతర్గత పోరు తారాస్థాయికి చేరిందట.

Jana Sena vs TDP:అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రాజోలు అనగానే ఓ ప్రత్యేకత ఉంటుంది. జనసేన పార్టీ నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచిన నియోజకవర్గం అది. అదికూడా జనసేన పార్టీకి మొట్టమొదటి ఎమ్మెల్యేను గెలిపించి శుభారంభం ఇచ్చిన నియోజకవర్గం. ఈ నియోజకవర్గం అందుకే అంత ప్రత్యేకం. ఇదే విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. రాజోలు ఒక చిరుదివ్వె లాంటిదని కూడా ఆయన ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఈ నియోజకవర్గంలో మాత్రం జనసేన ఎమ్మెల్యే పనితీరుపై ఆ పార్టీలోనే అసంతృప్తి జ్వాలలు రేగుతోన్నాయా అన్న ప్రశ్నకు అవుననే సమాధానం ఆపార్టీ నాయకుల నుంచే వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇదే నియోజకవర్గంలో టీడీపీ తన ఉనికిని కాపాడుకునేందుకు కూడా భారీ స్థాయిలో ప్రయత్నిస్తోంది. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కుమార్తె గొల్లపల్లి అమూల్యను టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్గా నియమించింది. దీంతో రాజోలులో టీడీపీలో కొత్త జోష్ నెలకొంది.
కనీస సమాచారం ఇవ్వడం లేదా...
కూటమి ప్రభుత్వంలో ఏ కార్యక్రమానికైనా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు సమాచారం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే రాజోలు నియోజకవర్గంలో మాత్రం టీడీపీ ఇంచార్జ్గా ఉన్న అమూల్యకు చాలా ప్రభుత్వ కార్యక్రమాలకు అసలు సమాచారం ఇవ్వడం లేదన్నది ఆమె తన అనుచరుల వద్ద వాపోతున్నారట. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి కూడా తెలిపినట్లు తెలుస్తోంది. నియోకవర్గాల్లో పలు నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ కూడా కనీస సమాచారం ఇవ్వకుండా తనకు నచ్చిన వారినే నియమించుకుంటున్నారని, వారి పార్టీ వరకు పరవాలేదు కానీ టీడీపీ నుంచి నియమించిన వారి విషయంలో కూడా తన వ్యతిరేకులకు కట్టబెట్టి తనకు వ్యతిరేక వర్గాన్ని పెంచి పోషిస్తున్నారని అమూల్య వాదనగా తెలుస్తోంది. ఉదాహరణకు ఇటీవలే ఇచ్చిన అంతర్వేది ఆలయ కమిటీ ఛైర్మన్ విషయంలోనూ ఇదే జరిగిందన్నది అమూల్య వర్గీయుల వాదనగా వినిపిస్తోంది. అంతర్వేది లక్ష్మి నరసింహస్వామి ఆలయ కమిటీ ఛైర్మన్ పదవిని టీడీపీ నేతకే ఇచ్చామని ఎమ్మెల్యే దేవవరప్రసాదరావు చెబుతున్నా ఈ సమాచారం తనకు చెప్పలేదని, తాను ప్రతిపాదించిన పేరు వేరే నాయకుడిది కాగా వారికి అనుకూలమైన వారికే పదవి కట్టబెట్టారన్నది అమూల్య మాటగా చెబుతున్నారు ఆమె అనుచరులు. ఇదే కాకుండా నియోజకవర్గంలో నియమించిన పలు నామినేటెడ్ పోస్టుల్లో టీడీపీకి ఇవ్వాల్సిన పదవుల్లో కూడా తన జోక్యం లేకుండా చేస్తున్నారని, నియోజకవర్గంలో అసలు ఒక ఇంచార్జ్ ఉన్నారన్న విషయాన్ని కూడా ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని అమూల్య బాధపడుతున్నట్టు తెలుస్తోంది.
అధిష్టానం కూడా లైట్ తీసుకుంటుందా...
ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లో టీడీపీ అధిష్టానం కూడా జోక్యం చేసుకుంటున్న సందర్భాలు చాలా తక్కవనే చెబుతున్నారు విశ్లేషకులు. ఇదే విషయం రాజోలు నియోజకవర్గంలో కూడా వర్తిస్తుందంటున్నారు. అందులోనూ జనసేన అధినేతకు రాజోలు నియోజకవర్గం అంటే మరింత ప్రత్యేకం కాగా ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తోన్న దేవ వరప్రసాదరావు మాజీ ఐఏఎస్ అధికారి కావడం, ఆయనకు అధినేతతో అత్యంత సాన్నిహిత్యం ఉండడం ఆయన మాటే వేదం అవుతుందంటున్నారు. ఈ పరిస్థితుల్లో అంతర్గతంగా జనసేన, టీడీపీ నేతల మధ్య అసంతృప్తి పరిస్థితులున్నా కూడా అవేమీ ఇరు పార్టీ నాయకత్వాలు పట్టించుకునే పరిస్థితి ఉండదని, లైట్ తీసుకుంటున్నాయంటున్నారు.
సొంత పార్టీలో అసంతృప్తి మాటేంటి..?
ఇదిలా ఉంటే జనసేన పార్టీలోనే ఎమ్మెల్యేపై అసంతృప్తి జ్వాలలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఇప్పటికే రెండు వర్గాలుగా అంతర్గత యుద్ధాలే జరుగుతున్నాయి.. అవి ఎంతలా అంటే సోషల్ మీడియా వేదికగా కూడా ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకునేంత స్థాయిలో అంతర్గత విభేధాలు భగ్గుమంటుండగా కొందరైతే బాహాటంగా ఎమ్మెల్యే పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి తోడు ఇటీవల కాలంలో వైసీపీకకు చెందిన కొందరు జనసేన పార్టీలో దూరి ఎమ్మెల్యే అనుచరులుగా చక్రం తిప్పడం ముందు నుంచి పార్టీ జెండా మోసిన నాయకులు, కార్యకర్తలకు అసలు మింగుడు పడని అంశంగా మారింది. దీంతో ఎమ్మెల్యే తీరుపై కూడా కొందరు అధిష్టానానికి ఇప్పటికే ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. జనసేన పార్టీలో అంతర్గత పోరు విషయం ఇలా ఉంటే ఇక టీడీపీలో కూడా రెండు వర్గాలుగా మాటల యుద్ధం సాగుతోంది. ఇంచార్జ్ అమూల్యపై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు ఆ పార్టీలోనే కొందరు నేతలు. అమూల్య ఒంటెద్దు పోకడలతో కొందరిని మాత్రమే వెంటేసుకుని వెళ్తున్నారని ఆరోపిస్తున్నారు. మొత్తం మీద రాజోలు నియోజకవర్గంలో అటు జనసేన, ఇటు టీడీపీలో అంతర్గత కోల్డ్ వార్ అయితే జరుగుతోందంటున్నారు.
Frequently Asked Questions
రాజోలు నియోజకవర్గం జనసేనకు ఎందుకు ప్రత్యేకం?
రాజోలులో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్గా ఎవరు నియమితులయ్యారు?
మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కుమార్తె గొల్లపల్లి అమూల్యను టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్గా నియమించింది. దీంతో టీడీపీలో కొత్త జోష్ నెలకొంది.
అమూల్యకు ప్రభుత్వ కార్యక్రమాల్లో సమాచారం అందడం లేదా?
అవును, అమూల్యకు చాలా ప్రభుత్వ కార్యక్రమాలకు సమాచారం అందడం లేదని ఆమె తన అనుచరుల వద్ద వాపోతున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానానికి కూడా తెలిపినట్లు తెలుస్తోంది.
రాజోలులో జనసేన పార్టీలో అంతర్గత అసంతృప్తి ఉందా?
అవును, నియోజకవర్గంలో జనసేన పార్టీలోనే ఎమ్మెల్యేపై అసంతృప్తి జ్వాలలు కనిపిస్తున్నాయి. అంతర్గత విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి.
టీడీపీలో కూడా అంతర్గత కోల్డ్ వార్ జరుగుతోందా?
అవును, రాజోలులో టీడీపీలో కూడా అంతర్గత కోల్డ్ వార్ జరుగుతోంది. ఇంచార్జ్ అమూల్యపై కొందరు నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు.



















