శుక్రవారం, శనివారాల్లో కొన్ని జిల్లాల్లో వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు వీచే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించనున్నాయి.
Rains in Andhra Pradesh and Telangana: ఏపీ, తెలంగాణ వెదర్ అప్డేట్.. ఒకవైపు వడగాలులు.. మరోవైపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు!
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించారు.

- తెలంగాణలో వర్షాలతో పాటు కొన్ని జిల్లాల్లో వడగాల్పుల హెచ్చరిక.
- నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండగా, ఖమ్మంలో అధిక వర్షపాతం నమోదు.
- ఏపీలో రుతుపవన విస్తరణతో పిడుగులతో కూడిన భారీ వర్ష హెచ్చరిక.
- ఉరుములు, మెరుపుల సమయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు.
హైదరాబాద్: తెలంగాణలో రాగల రెండు రోజుల వాతావరణానికి సంబంధించి హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం, శనివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మరికొన్ని జిల్లాల్లో మాత్రం అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీచనున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని, రాబోయే రెండు రోజుల్లో ఇవి రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయని తెలిసిందే. ఇందులో అత్యధికంగా ఖమ్మం జిల్లా కల్లూరులో 11.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. చాలా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకావం ఉందని అంచనా వేశారు.
🌧️రాష్ట్రంలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు- ఇవాళ రాత్రికి ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు⚡
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) June 11, 2026
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో, ఇవాళ రాత్రికి ఈదురుగాలులతో కూడిన చెదురుమదురు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.#APWeather #Monsoon2026 pic.twitter.com/8vvRHS8xJ0
మరోవైపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత ఇంకా కొనసాగుతోంది. గురువారం మంచిర్యాల జిల్లా దండేపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 42.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో వడగాలులు వీచాయి. రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 42.2 నుండి 42.8 డిగ్రీల మధ్య, మరో నాలుగు జిల్లాల్లో 41 నుండి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. శుక్రవారం, శనివారం, ఆదివారాల్లో ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది.
ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరించాయి. రుతుపవనాలతో పాటు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాత్రికి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన చెదురుమదురు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది. విజయవాడలో గురువారం కురిసన భారీ వర్షంతో నగరవాసులు ఇబ్బందిపడ్డారు.
అలాగే, శుక్రవారం నాడు పోలవరం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాల సమయంలో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు.
ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ జాగ్రత్తలు
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వచ్చే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద నిల్చోరాదు. విద్యుత్ స్తంభాలు, వైర్లు, పెద్ద పెద్ద హోర్డింగ్స్ కింద ఆశ్రయం పొందవద్దని అధికారులు హెచ్చరించారు.
Frequently Asked Questions
తెలంగాణలో రాబోయే రెండు రోజులకు వాతావరణ అంచనా ఏమిటి?
తెలంగాణలో వడగాలుల హెచ్చరిక ఉన్న జిల్లాలు ఏవి?
ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో శుక్ర, శని, ఆదివారాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలకు వర్షాలు, పిడుగుల హెచ్చరిక జారీ చేయబడింది?
కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వచ్చే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, వైర్లు, పెద్ద హోర్డింగ్స్ కింద నిల్చోరాదు. సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























