Kurnool Pawan Kalyan Speech: ప్రధాని మోదీ కర్మయోగి - కూటమి 15 ఏళ్లు బలంగా ఉండాలి -కర్నూలు సభలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Kurnool: కర్నూలు సభలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని దేశాన్ని మాత్రమే కాదు, రెండు తరాలను నడుపుతున్నారని ప్రశంసించారు.

Kurnool meeting Pawan Kalyan Speech: సూపర్ జీఎస్టీ -సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ప్రసంగించిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దేశ సేవే పరమావధిగా ప్రజలకు సేవ చేస్తున్న ప్రధాని మోదీ ఓ నిజమైన కర్మయోగి అని వ్యాఖ్యానించారు. ఆయన కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే కాదు రెండు మూడు తరాల ప్రజలకు దిశా నిర్దేశం చేస్తున్నారని గుర్తుచేసుకున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా ప్రపంచ పటంలో దేశాన్ని నిలబెడుతున్నారన్నారు. గూగుల్ లాంటి అతిపెద్ద ప్రాజెక్టులు దేశానికి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయి. జీఎస్టీ 2.0 సంస్కరణలతో పేదలు, సామాన్యులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతోందన్నారు. జీవిత, ఆరోగ్య భీమా సహా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గటం వల్ల ప్రజలు ఆదా చేసుకోగలుగుతారన్నారు. పెట్టుబడులు పరిశ్రమల నమ్మకాన్ని సడలించకుండా అంతా కలిసే ఉండి స్థిరమైన ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని.. కూటమి 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలని పవన్ ఆకాంక్షించారు.
ఒక తరం కోసం ఆలోచించే నాయకుడు సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీని కర్మయోగి పదంతో పిలుస్తాం..ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా పనిచేస్తున్నారు.. ప్రధాని దేశాన్ని మాత్రమే కాదు, రెండు తరాలను నడుపుతున్నారన్నారు. దేశం తలెత్తి చూసే విధంగా ఆత్మనిర్భర్ భారత్ తీసుకువచ్చారు దేశ జెండా ఎంత పొగరుగా ఉంటుందో అలాగే దేశ పటాన్ని ప్రపంచపటంలో నిలబెట్టారన్నారు. ప్రతి కుటుంబానికి పన్నుల భారాన్ని తగ్గించారని తెలిపారు.






















