Chief Minister Chandrababu Naidu: బ్లాక్ చైన్ టెక్నాలజీతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు - హార్టికల్చర్ హబ్ సీమ - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Chandrababu Dhone Tour: గత ప్రభుత్వం ఇచ్చిన 19.93 లక్షల తప్పుడు పుస్తకాలను పక్కనబెట్టి, పక్కాగా క్యూఆర్ కోడ్ , బ్లాక్ చైన్ టెక్నాలజీతో ట్యాంపర్ ప్రూఫ్ పట్టాలను అందజేస్తున్నామని సీఎం ప్రకటించారు.

Chief Minister Chandrababu Naidu participated in the distribution of Pattadar passbooks: నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని కొత్త బురుజులో నిర్వహించిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. రైతుల భూములను ఇష్టానుసారంగా 22ఏ జాబితాలో పెట్టి వేధించారని, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా ప్రైవేట్ భూములపై పెత్తనం చలాయించాలని చూశారని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేసి, భూ రికార్డుల్లోని తప్పులను సరిదిద్దుతున్నామని స్పష్టం చేశారు.
గత పాలకులు పాసుపుస్తకాలు, సర్వే రాళ్లపై ఫోటోలు ముద్రించుకుని ప్రజల జీవితాలతో ఆడుకున్నారని, ఇందుకోసం ఏకంగా రూ.750 కోట్లు వృథా చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ఇచ్చిన 19.93 లక్షల తప్పుడు పుస్తకాలను పక్కనబెట్టి, ఇప్పుడు పక్కాగా క్యూఆర్ కోడ్ , బ్లాక్ చైన్ టెక్నాలజీతో కూడిన ట్యాంపర్ ప్రూఫ్ పట్టాలను అందజేస్తున్నామని తెలిపారు. ఒక్క రూపాయి అవినీతి లేకుండా, ప్రభుత్వమే ఉచితంగా రైతులకు కొత్త పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేస్తోందని, ఎవరైనా రికార్డులు తారుమారు చేస్తే ఈ సాంకేతికత ద్వారా వెంటనే తెలిసిపోతుందని ఆయన వివరించారు.
రాయలసీమ అభివృద్ధిపై స్పందిస్తూ.. సీమను హార్టికల్చర్ హబ్ గా మారుస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. హంద్రీనీవా, గాలేరు నగరి వంటి ప్రాజెక్టులను ఎన్టీఆర్ ప్రారంభిస్తే, వాటిని పూర్తి చేసే అదృష్టం తనకు దక్కిందని చెప్పారు. డోన్ నియోజకవర్గంలో 30 చెరువులకు నీటిని అందించామని, భగీరథుని స్పూర్తితో ప్రతి ఎకరాకు నీళ్లివ్వడమే తన సంకల్పమని పేర్కొన్నారు. మామిడి రైతులకు కేజీకి రూ.4 సబ్సిడీ ఇవ్వడంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్లో మెరుగైన ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
రాష్ట్రంలోని శాంతిభద్రతల గురించి మాట్లాడుతూ.. సీమలో ఒకప్పుడు ఉన్న ముఠా తగాదాలను తుదముట్టించామని, గ్రామాల్లో ప్రశాంతతే ముద్దని తాము నమ్ముతున్నామని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం సిండికేట్లు, కల్తీ మద్యం వల్ల 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంపై సిబిఐ నివేదికను తప్పుగా ప్రచారం చేస్తున్నారని, స్వామివారి పవిత్రతను దెబ్బతీస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని కరాఖండీగా చెప్పారు. నేరాలు చేసి ఎదురుదాడి చేయడం వారి నైజమని విమర్శించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ.. 'తల్లికి వందనం' కింద ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ద్వారా ఇప్పటికే 50 కోట్ల ప్రయాణాలు పూర్తయ్యాయని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, తమ ప్రభుత్వ హయాంలో కరెంట్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని ప్రజలకు భరోసా ఇచ్చారు. అలాగే రోడ్లపై గుంతలు పూడ్చేందుకు రూ.4 వేల కోట్లు కేటాయించామని, వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు పొందే నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.
వైసీపీ నేత బుగ్గన చేసిన కబ్జాపై పోరాడి పోరాడి విసుగుపోయిన రైతు.
— Telugu Desam Party (@JaiTDP) March 9, 2026
బుగ్గన చేసిన కబ్జాపై గత కొన్నేళ్లుగా పోరాడుతూనే ఉన్నాడు రైతు. తన కష్టార్జితమైన 4.5 ఎకరాలను బుగ్గన కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలని కోరిన రైతు.
స్పాట్లో రెవెన్యూ అధికారులను గ్రామ ప్రజల ముందే పిలిచి న్యాయం చేయాలని… pic.twitter.com/SR0WVEduER
రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరుగుతోందని, కర్నూలులో డ్రోన్ సిటీ , అనంతపురంలో ఎయిరో స్పేస్ సిటీ ఏర్పాటు చేయబోతున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటికే లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామని, భవిష్యత్తులో మరో 5 లక్షల మందిని ఎంఎస్ఎంఈల ద్వారా ప్రోత్సహిస్తామని చెప్పారు. అభివృద్ధి కేవలం వైకుంఠపాళిలా ఉండకూడదని, పేదల సంక్షేమమే లక్ష్యంగా 'పీ4' విధానం ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు .
ట్రెండింగ్ వార్తలు



















