YS Jagan: మరో 30 ఏళ్లు రాజకీయాలు చేస్తా - పార్టీ నేతలకు జగన్ భరోసా
YSRCP : మరో 30 ఏళ్లు రాజకీయాలు చేస్తానని పార్టీ నేతలకు జగన్ చెప్పారు. అసెంబ్లీకి వెళ్లకపోయినా ప్రజాసమస్యల కోసం పోరాడాలన్నారు.

30 years Politician Jagan: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే వాకౌట్ చేసి వెళ్లిపోయారు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. తర్వాత వైసీపీ కార్యాలయంలో వారితో మాట్లాడారు. అసెంబ్లీకి వెళ్లకపోయినా తాను మరో 30 ఏళ్ల రాజకీయాల్లో ఉంటానన్నారు.వైసీపీ లేకుండానే టీడీపీ అసెంబ్లీని నిర్వహించాలని అనుకుంటోందని అందుకే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదని జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే ప్రజాక్షేత్రంలో అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. మనం యుద్ధరంగంలో ఉన్నామని .. ప్రజాసమస్యల విషయంలో రాజీలేని పోరాటం చేయాలన్నారు. చిత్తశుద్ధితో ప్రజల తరపున పోరాటం చేస్తే గెలుపు సాధించినట్లేనన్నారు.
ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదన్న జగన్
ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జగన్ సూచించారు. ప్రతి ఒక్కరికీ తాను అండగా ఉంటానన్నారు. ప్రతిపక్షంగా మన సమర్థతను నిరూపించుకోవడానికి ఇది మంచి అవకాశమన్నారు. కళ్లు మూసుకుని తెరిచేలోపు ఏడాది గచిపోయిందని.. అప్పుడే ఎన్నికలు అంటున్నారని జగన్ నేతల్ని ఉత్సాహరిచే ప్రయత్నం చేశారు. జమిలీ ఎన్నికలు అంటున్నారని అదే జరిగితే ఎన్నికలు మరింతముందుగా వస్తాయని అన్నారు. 2028 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగవచ్చని జగన్ సూచించారు. రాజకీయాల్లో మనం విలువలు విశ్వసనీయత పాటిస్తున్నాం కాబట్టి ఎన్నో క్లిష్ట పరిస్థితుల్ని అధిగమించామన్నారు.
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే గెలిచినట్లే !
ప్రతిపక్ష హోదా విషయంపై అధికార పార్టీ వైఖరిని తేటతెల్లం చేసేందుకే అసెంబ్లీకి వెళ్లామని .. ప్రతి పక్ష హోదా హక్కుగా మనకు ఇవ్వాల్సి వస్తుందని జగన్ ఎమ్మెల్యేలకు చెప్పారు. సభా నాయకుడితో దాదాపుగా సమాన సమయం ఇవ్వాలి. అందుకే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదన్నారు. తాను ఏ అంశంపై మాట్లాడినా నిందలు, దూషణలకు దూరమని .. అన్నీ ఆధారాలు, రుజువులతోమే మాట్లాడతానన్నారు. కౌన్సిల్ లో మెజార్టీ ఉంది కాబట్టి ఉపయోగించుకోవాలని జగన్ బొత్స సత్యనారాయణకు సూచించారు.
మొదట పులివెందుల ఆ తర్వాత బెంగళూరు వెళ్లనున్న జగన్
జగన్ మంగళవారం పులివెందుల వెళ్తారు. అక్కడ ఓ రోజు ప్రజాదర్భార్ నర్వహించి .. గురువారం కొన్ని ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొని ఆ తర్వాత బెంగళూరు వెళ్లిపోతారు. పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎవరి నియోజకవర్గాలుకు వారువెళ్లిపోతారు. అయితే ఎమ్మెల్సీలు మాత్రం శాసనమండలికి హాజరు కానున్నారు. ఒక్క రోజు అసెంబ్లీకి హాజరు కావడం ద్వారా.. అనర్హతా వేటు నుంచి ప్రస్తుతానికి జగన్ తప్పించుకున్నట్లు అవుతుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

