MLA Thomas: నేను తల్చుకుంటే డ్రాయర్పై పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిస్తా - మాజీ డిప్యూటీ సీఎంకు ఎమ్మెల్యే వార్నింగ్
GD Nellore TDP: ఉమ్మడి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు రాజకీయం రసవత్తరంగా మారింది. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై ఎమ్మెల్యే థామస్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Chittoor District Politics: ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గం వేదికగా సాగుతున్న అంతర్గత పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం. థామస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కె. నారాయణస్వామిల మధ్య నడుస్తున్న ఈ మాటల యుద్ధం స్థానికంగా పెను సంచలనంగా మారింది. ఇటీవల నియోజకవర్గ పరిధిలో జరిగిన బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో ఎమ్మెల్యే థామస్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో వేడిని పెంచాయి.
పదవులు అమ్ముకుని విల్లా కొన్న నారాయణ స్వామి
ఎమ్మెల్యే థామస్ తన విమర్శల్లో మాజీ డిప్యూటీ సీఎం అవినీతిని టార్గెట్ చేశారు. నారాయణస్వామి గత ప్రభుత్వ హయాంలో ఎంపీపీ పదవిని ఏకంగా రూ. 1.50 కోట్లకు అమ్ముకున్నారని, ఆ సెటిల్మెంట్ డబ్బులతోనే తిరుపతిలో విలాసవంతమైన విల్లా కొనుగోలు చేశారని బహిరంగంగా ఆరోపించారు. తాము చదువుకున్న వాళ్లం కాబట్టే పద్ధతిగా వెళ్తున్నామని, అవినీతి అక్రమాలకు పాల్పడిన చరిత్ర తమకు లేదని థామస్ స్పష్టం చేశారు. గతంలో నియోజకవర్గంలో నాడు విపక్ష నేతగా ఉన్న నారా లోకేష్పై అక్రమ కేసులు పెట్టించిన ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. లోకేష్పై కేసులు పెట్టేంత మగాడివా నువ్వు? అంటూ ఘాటుగా నిలదీశారు.
అండర్వేర్పై కూర్చోబెడతానని తీవ్ర హెచ్చరిక
రాజకీయ విమర్శల పరిధి దాటి, వ్యక్తిగత హెచ్చరికల స్థాయికి ఈ వివాదం చేరింది. "నన్ను గెలకవద్దు.. నన్ను గెలికితే నీకు రాత్రి పూట నిద్ర కూడా పట్టదు.. ఏ అర్ధరాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి చస్తావ్" అంటూ థామస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము గనుక తలుచుకుంటే రాత్రికి రాత్రే కట్ డ్రాయర్ పై పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టగలమని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇలాంటి కక్షసాధింపు చర్యలు నచ్చవు కాబట్టే తాము సంయమనం పాటిస్తున్నామని హెచ్చరించారు. ఒకవేళ తాను నోరు తెరిచి నిజాలు మాట్లాడితే అవతలి వారికి ముక్కు, చెవుల నుంచి రక్తం వస్తుందంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు.
మతిస్థిమితం లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇంతటితో ఆగకుండా నారాయణస్వామి మానసిక స్థితిపై కూడా థామస్ సెటైర్లు వేశారు. ఆయనకు మతిస్థిమితం తప్పిందని, బయట ఎక్కడా మంచి ఆసుపత్రి దొరకనట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఒకవేళ నారాయణస్వామి తన ఆసుపత్రికి వస్తే, మూడు సార్లు కరెంట్ షాక్ ఇస్తే అంతా సెట్ అయిపోతుందని ఒక వైద్యుడిగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. గతంలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబును ఏ విధంగా దూషించారో అందరికీ తెలుసని, తాను ఒక్క పిలుపు ఇస్తే నారాయణస్వామి ఇల్లు దాటి బయటకు కూడా రాలేడని పేర్కొన్నారు.
నియోజకవర్గ ఆధిపత్య పోరు
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నారాయణస్వామి గతంలో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా చక్రం తిప్పారు. అయితే, గత శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగిన డాక్టర్ థామస్.. నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మిపై 26 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇటీవల ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు నారాయణస్వామి ఇంటికి వెళ్లి విచారించడం, ఆయన ఫోన్ స్వాధీనం చేసుకోవడం వంటి పరిణామాల తో ఎమ్మెల్యే థామస్ మరింత దూకుడుగా దాడి పెంచినట్లు భావిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















