TDP MLA Thomas: మేము బానిసలుగా ఉండాలా? - సొంత పార్టీ నేతలపై టీడీపీ ఎమ్మెల్యే థామస్ నిప్పులు
TDP MLA Thomas: గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ సొంత పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. గెలిపించే ఎస్సీలు కావాలి.. కానీ అధికారంలో వాటా ఇవ్వమంటే మాత్రం తొక్కేయాలా? ఇదేం న్యాయం? అని ప్రశ్నించారు

TDP MLA Thomas allegations against own party leaders: గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ తన నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ ఎమ్మెల్యేలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని, కొందరిలో దళితులంటే చులకన భావం ఉందని ఆయన బహిరంగంగానే నిలదీశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమంలో మాట్లాడారు. ఎన్నికలప్పుడు ఖర్చు పెట్టే ఎస్సీలు కావాలి, గెలిపించే ఎస్సీలు కావాలి.. కానీ అధికారంలో వాటా ఇవ్వమంటే మాత్రం తొక్కేయాలా ఇదెక్కడి న్యాయం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎస్సీలు ఎప్పటికీ బానిసలుగానే ఉండాలనే భావన కరెక్ట్ కాదని ఆయన హెచ్చరించారు.
నియోజకవర్గంలో ఆధిపత్య పోరు
ఎమ్మెల్యే థామస్ ఇంత ఘాటుగా స్పందించడానికి గంగాధర నెల్లూరులో నెలకొన్న రాజకీయ పరిస్థితులే ప్రధాన కారణమని తెలుస్తోంది. నియోజకవర్గంలో టీడీపీలోని ఒక వర్గం ఎమ్మెల్యేకు సహకరించకుండా, సమాంతరంగా పాలన సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పనుల కేటాయింపు, అధికారుల బదిలీలు మరియు స్థానిక నిర్ణయాల్లో తనను కాదని ఇతర సామాజిక వర్గాలకు చెందిన నేతలు పెత్తనం చేస్తున్నారని ఆయన భావిస్తున్నారు.
టార్గెట్ చేస్తున్నది ఎవరు?
మరే ఇతర కులాల్లో ఎమ్మెల్యేలు తప్పులు చేయడం లేదా? కేవలం ఎస్సీ ఎమ్మెల్యేలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అని థామస్ ప్రశ్నించారు. గంగాధర నెల్లూరులో గత కొంతకాలంగా ద్వితీయ శ్రేణి నాయకత్వానికి, ఎమ్మెల్యేకు మధ్య గ్యాప్ పెరిగిందని సమాచారం. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని, కొందరు ఆధిపత్య సామాజిక వర్గాల నేతలు తన అధికారాలకు అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే మేము కేవలం ఓట్లు వేయడానికేనా? అధికారంలో ఉండకూడదా? అన్న ప్రశ్నను ఆయన సంధించారు.
టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వాఖ్యలు...
— DIGITAL_JANKAY (@Digital_Jankay) April 24, 2026
ఎస్సీ ఎమ్మెల్యేలపై వివక్షత.. గెలిపించేటప్పుడు కావాలి కానీ.. అధికారంలో ఉండకూడదా?
మేము బానిసలుగా ఉండాలా? ఇదెక్కడి న్యాయం అంటూ నిలదీత
SCలు కాళ్లు పట్టాలి, వారు బానిసలుగా ఉండాలి అన్న భావన కరెక్ట్ కాదు #breakingnews #livenews @ap #politics… pic.twitter.com/943gL0B67g
కూటమికి తలనొప్పిగా మారిన వ్యాఖ్యలు
ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కోనేటి ఆదిమూలం కుమారుడు ఇలా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మరో అధికార పార్టీ ఎమ్మెల్యే ఇలా వివక్షపై గళమెత్తడం టీడీపీ అధిష్టానానికి ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే ఈ వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. థామస్ వ్యాఖ్యల వెనుక ఉన్న అంతర్గత పోరును చక్కదిద్దకపోతే, అది ఇతర ఎస్సీ నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















