Chiranjeevi Letter Mystery: ఇదేం ట్విస్ట్ - ఆ లేఖ చిరంజీవి రాసింది కాదా ?
Balakrishna Issue:చిరంజీవి పేరుతో రిలీజైన లేఖపై తాజాగా సందేహాలు నెలకొన్నాయి. ఆ లేఖను చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేయకపోవడంతో పాటు వీడియో ద్వారా కూడా స్పందించలేదు.

Doubts over the letter released in Chiranjeevi name: అసెంబ్లీలో కామినేని, బాలకృష్ణల మాటల్లో చిరంజీవి ప్రస్తావన రావడం, దానిపై చిరంజీవి స్పందన అంటూ ఓ లెటర్ వైరల్ కావడం జరిగిపోయింది. అయితే ఆ లెటర్ మెగా కాంపౌండ్లోని ఏ అధికారిక మీడియా, సోషల్ మీడియాల నుంచి సర్క్యూరేట్ కాలేదు. కనీసం చిరంజీవి లెటర్ ప్యాడ్ మీద కూడా రాలేదు. అది చిరంజీవి రిలీజ్ చేయలేదు. ఆయన టీం అధికారికంగా రిలీజ్ చేసినట్లుగా కూడా చెప్పడం లేదు. చిరంజీవి సోషల్ మీడియా ఖాతాల్లో లేదా మరో చోట ఎక్కడా కనిపించడం లేదు. అందుకే ఇప్పుడు ఆ లెటర్ చిరంజీవి రాయలేదన్న ప్రచారం ఊపందుకుంటోంది.
అధికారికంగా ధృవీకరించని చిరంజీవి టీం
బాలకృష్ణను విమర్శిస్తూ.. జగన్ అవమానించలేదని చెప్పేలా ఉన్న లెటర్ ను చిరంజీవి అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేయలేదు. ఓ వీడియో కూడా రిలీజ్ చేయలేదు. తాను విదేశాల్లో ఉన్నందున ఈ లేఖ విడుదల చేస్తున్నానని ఆయన అదే లేఖలో వివరణ ఇచ్చారు. ఇదంతా కాస్త ఎబ్బెట్టుగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ చిరంజీవే రాసి ఉంటారని అనుకున్నారు. కానీ ఆయన స్పందించలేదు. అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేయలేదు.
లెటర్ నిజం కాకపోతే ఖండించేవాళ్లేగా !
మరో వైపు చిరంజీవి పేరుతో లెటర్ వచ్చిన వెంటనే మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ లేఖకు చిరంజీవికి సంబంధం లేకపోతే వెంటనే చిరంజీవి ఎలాంటి వివరణ ఇవ్వలేదని ఆయన పీఆర్ టీం ఖండించేవారు. కానీ అలాంటి ఖండనలు రాలేదు. అలాగని ఆయనే రాశారని కానీ స్పష్టత రాలేదు. ఇప్పటికీ ఆ సందేహం అలాగే ఉంది. ఇది కూడా ఓ వ్యూహం అనుకోవాలేమో కానీ.. ఇప్పటికైతే .. బాలకృష్ణ,కామినేని వ్యాఖ్యల్ని తాము ఖండించామని ఎలాంటి సమాచారం లేదు.అదే సమయంలో ఆ లేఖ చిరురాశారని కూడా కన్ఫర్మ్ చేయడం లేదు.
జగన్ అవమానించలేదని చెప్పడం దేనికి సంకేతం ?
లేఖలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండించడమే కాదు.. జగన్ మోహన్ రెడ్డి అవమానించలేదని చెప్పడం చాలా మందికి అనుమానాలు రేకెత్తిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి ..మెగాస్టార్ ను అవమానించారనేది అందరికీ తెలిసిన విషయమని .. పవన్ కల్యాణ్ కూడా చాలా సార్లు అదే విషయం చెప్పారని గుర్తు చేస్తున్నారు. రోలను తీసుకుని చిరంజీవి వచ్చినప్పుడు గేటు బయట కార్లు ఆపి ఇంట్లోకి నడిపించారు. సమావేశానికి చాలా సేపు రాలేదు. చిరంజీవితో బతిమాలించుకుని ఆ వీడియో విడుదల చేశారు. అదంతా వైరల్ అయింది. కానీ తనను గౌరవంగా చూశారని..తాను అందరితోనూ అలాగే ఉంటానని ఆ లేఖలో ఉండటం మాత్రం చాలా అనుమానాస్పదంగా ఉంది. అందుకే ఎక్కువ మంది ఆ లేఖ చిరంజీవి నుంచే వచ్చిందా అని ఆరా తీయడం ప్రారంభించారు.
అయితే అసెంబ్లీలో జరిగిన వివాదంతో చిరంజీవి పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి దానిపై స్పందిస్తే ఎక్కువ ప్రచారం జరుగుతుందని.. ఇలా ప్రత్యేక వ్యూహం ద్వారా ఖండన ప్రకటన ఇస్తే సరిపోతుందని భావించినట్లుగా తెలుస్తోంది. అందుకే ఇలా ఈ లేఖపై చర్చలు అలా కొనసాగనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.





















