Chandrababu : టీడీపీ మేనిఫెస్టోతో ప్రజలకు భరోసా - గెలుపు ఖాయమయిందని చంద్రబాబు ధీమా !
Chandrababu About TDP Manifesto : కాకినాడలో టీడీపీ జోన్ స్థాయి సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజలకు టీడీపీ భరోసా ఇస్తుందని ప్రకటించారు.
Chandrababu About TDP Manifesto : టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల ఇన్చార్జిలు, క్లస్టర్లతో కాకినాడ జోన్ -2 సమావేశం నిర్వహించారు. టీడీపీ చేపట్టిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంతోనే వైసీపీ పతనం ఆరంభమైందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంతో టీడీపీ బలంగా పుంజుకొందని చెప్పారు. భవిష్యత్తుకు భరోసా అనే కార్యక్రమంతో జనానికి మంచి భరోసా ఇస్తున్నామని తెలిపారు. దీంతో జనంలో టీడీపీకి మంచి క్రేజ్ వచ్చిందని చంద్రబాబు చెప్పారు. రాజకీయాల్లో 45 సంవత్సరాలు నుంచి ఉంటున్నానని, ఇంత అరాచకమైన పాలన ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు మండిపడ్డారు.
రాష్ట్రంలో విధ్వంసాలు సృష్ఠిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ధరలతో ప్రజలు అల్లాడి పోతుంటే సైకో ముఖ్యమంత్రి అసలు పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. రహదారులు లేక రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతుంటుంటే సైకో ముఖ్యమంత్రి వాటిని చూసి పైశాసిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ఇటువంటి ముఖ్యమంత్రిని మళ్లీ చూడలేమని ఎద్దేవా చేశారు. గత శాసన మండలి ఎన్నికల నాటి నుంచి నేటి సర్పంచి ఎన్నికల దాకా టీడీపీ అభ్యర్దులే విజయకేతనం ఎగురవేస్తున్నారంటే భవిష్యత్తులో టీడీపీ ఏ రేంజ్లో ఉంటుందో అర్దం చేసుకోవచ్చని చంద్రబాబు తెలిపారు.
తనకు ఐటీ నోటీసులు ఇచ్చారంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై చంద్రబాబు పరోక్షంగా స్పందించారు. ముఫ్పై ఏళ్లుగా తనపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు కూడా తనపై అదే చేస్తున్నారని అన్నారు.
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో టీడీపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధినాయకత్వం దృష్టి పెట్టింది. ప్రధానంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య విభేదాలను తొలగించడానికి పార్టీ అధినేత చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. నేతలు కలసికట్టుగా ఉంటేనే వైసీపీని ఎదుర్కోగలమని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో, కాకినాడలో నేడు టీడీపీ జోన్-2 సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చంద్రబాబు హాజరయ్యారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ 45 రోజుల కార్యక్రమంపై చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఎంత బలంగా తీసుకెళితే అంతగా ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు. నేతల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయడంపై దృష్టి సారించాలని సూచించారు.