TDP 48 MLAs: టీడీపీలో సంచలనం- 48 మంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్- నోటీసులు జారీ
Chandrababu Naidu: టీడీపీ 48 ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయడం లేదనిచంద్రబాబు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూడా వీరు పంపిణీ చేయడం లేదు.

Chandrababu Naidu orders notices to be issued to 48 TDP MLAs : టీడీపీ ఎమ్మెల్యేల్లో 48 మంది పూర్తిగా దారి తప్పారని చంద్రబాబునాయుడు గుర్తించారు. ఎన్నిసార్లు చెప్పిన వికపోవడంతో నోటీసులు జారీ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, ప్రవర్తనలో లోపాలు ఉన్న 48 మంది ఎమ్మెల్యేలకు వెంటనే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. తీరు మారకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశమైన సీఎం, పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత వంటి కార్యక్రమాలపై సమీక్షించారు.
పేదలకు సాయంగా ఇచ్చే చెక్కులూ పంపిణీ చేయని ఎమ్మెల్యేలు
ప్రజల సమస్యలను పరిష్కారానికి ఎమ్మెల్యేలు ఎంత మంది అందుబాటులో ఉంటున్నారో తెలుసుకున్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాల పరిమితి తీరిపోయే వరకూ పంపిణీ చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసే కార్యక్రమాల్లో 48 మంది ఎమ్మెల్యేలు పాల్గొనకపోవడం సీఎం దృష్టికి వచ్చింది. బ్యాక్ ఆఫీసు, ప్రోగ్రాం కమిటీకి ఆదేశాలు జారీ చేస్తూ, ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని సూచించారు. వివరణ సంతృప్తికరంగా లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పెన్షన్ల పంపిణీకీ దూరం
పేదల సేవలో భాగంగా పెన్షన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పకుండా పాల్గొనాలని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని, కార్యకర్తలు, ప్రజలతో మాట్లాడాలని సూచించారు. టీడీపీ కార్యకర్తలకు ఇన్సురెన్స్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో కూడా ఎమ్మెల్యేలు తప్పకుండా పాల్గొనాలి. పనిచేసిన వారందర్నీ కలుపుకుని వెళ్లాలన్నారు. ప్రతి శుక్రవారం నియోజకవర్గ టీడీపీ కార్యాలయాల్లో జరిగే ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలి. పాల్గొనకపోతే పార్టీ కేంద్ర కార్యాలయం వివరణ తీసుకోవాలి ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు గతంలో కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
పనితీరు మారకపోతే పక్కన పెట్టాలని చంద్రబాబు నిర్ణయం
పేదలకు ఎన్నోకష్టాల్లో ఉంటే సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకుంటారు. వారికి మంజూరు అయిన డబ్బులు కూడా ఇవ్వడానికి ఎమ్మెల్యేలకు తీరిక లేకపోతే ఇక వారికి ప్రజా సేవ చేయడానికి అర్హత ఏముంటుందన్న ప్రశ్నలు వస్తున్నాయి. సీఎం ఆర్ఎఫ్ చెక్కులకు మూడు నెలల పరిమితి ఉంటుంది. ఇష్యూ చేసిన తేదీ నుంచి మూడు నెలల పాటు చెక్కులు పంపిణీ చేయకపోవడం వల్ల అవి తిరిగి వస్తున్నాయి . కొత్తగా చెక్కులు జారీ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఇది సీఎంను అసహనానికి గురి చేసింది. ఇప్పటి వరకూ చూశామని ఇక పనితీరు మార్చుకోకపోతే పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.





















