Most Wanted Criminal: ఎట్టకేలకు ఏపీ పోలీసుల కస్టడీకి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎద్దుల అనిల్ కుమార్ రెడ్డి
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎద్దుల అనిల్ కుమార్ రెడ్డిని యూఏఈ నుంచి ఇంటర్పోల్ మార్గాల ద్వారా భారత్కు తిరిగి తీసుకురావడంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) సక్సెస్ అయింది.

అమరావతి: విదేశాలకు పారిపోయినా చట్టం నుంచి తప్పించుకోలేరు. కొంచెం ఆలస్యమైనాసరే తప్పు చేసిన వారు ఏదో ఓ రోజు పోలీసుల చేతికి చిక్కక తప్పదని మరోసారి నిరూపితమైంది. ఆంధ్రప్రదేశ్లో నమోదైన పలు కీలక కేసుల్లో ప్రధాన నిందితుడు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎద్దుల అనిల్ కుమార్ రెడ్డిని సీబీఐ ఎట్టకేలకు భారత్కు తీసుకువచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో సాగిన ఈ ఆపరేషన్లో ఇంటర్నేషనల్ పోలీస్ కో ఆపరేషన్ యూనిట్ (IPCU), విదేశీ వ్యవహారాల శాఖ, అబుధాబి నేషనల్ సెంట్రల్ బ్యూరో (NCB-Abu Dhabi) సమన్వయంతో ఈ తరలింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది.
దుబాయ్ పోలీసులు అనిల్ కుమార్ రెడ్డిని ప్రత్యేక భద్రత మధ్య హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) తీసుకువచ్చారు. అక్కడ సీబీఐ అధికారులకు అప్పగించగా, ప్రాథమిక విచారణ అనంతరం నిందితుడిని ఏపీ పోలీసుల కస్టడీకి అప్పగించారు. మోసం, నేరపూరిత విశ్వాస ఘాతుకం, బెదిరింపులు వంటి తీవ్రమైన ఆరోపణలు అనిల్ కుమార్ రెడ్డిపై ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై పలు కేసులు నమోదు కావడంతో, చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోవడానికి 2022లో ఆయన విదేశాలకు పరారయ్యారు.
రెడ్ కార్నర్ నోటీసులు జారీ..
అనిల్ కుమార్ రెడ్డిని పట్టుకునేందుకు ఏపీ పోలీసుల అభ్యర్థన మేరకు సీబీఐ రంగంలోకి దిగింది. 2022 సెప్టెంబరు 5న ఆయనపై ఇంటర్పోల్ ద్వారా 'రెడ్ కార్నర్' నోటీసు జారీ చేయించారు. అప్పటి నుంచి నిరంతర నిఘా ఉంచిన దర్యాప్తు సంస్థలు, చివరకు అబుధాబి అధికారుల సహకారంతో ఆయనను పట్టుకుని భారత్ తీసుకువచ్చాయి. ఈ అరెస్టుతో ఏపీలోని పలు పెండింగ్ కేసుల్లో కీలక పురోగతి లభించే అవకాశం ఉంది.
























