IPS Sunil Nayak: ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్టులో చట్టపరమైన చిక్కుముడి - నాన్ బెయిలబుల్ వారెంట్తో చెక్ పెట్టవచ్చా?
Sunil Naik: బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్టు వ్యవహారం న్యాయపరంగా క్లిష్టంగా మారుతోంది. పట్నా కోర్టు ట్రాన్సిట్ వారెంట్ను తిరస్కరించినా ఏపీలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.

Bihar cadre IPS officer Sunil Naik: ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు పట్నాలో చేసిన ప్రయత్నం తొలి విడతలో విఫలమైంది. నిబంధనల ప్రకారం స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం, సరైన అరెస్టు వారెంట్, అప్డేటెడ్ కేస్ డైరీని సమర్పించకపోవడంతో పట్నా సివిల్ కోర్టు ట్రాన్సిట్ వారెంట్ దరఖాస్తును తిరస్కరించింది. అంతేకాకుండా, తదుపరి 30 రోజుల పాటు ఆయనపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించడం పోలీసులకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. వెంటనే సునీల్ నాయక్ అజ్ఞాతంలోకి వెళ్లడం, ఆయన కోసం ఎస్పీ దామోదర్ బృందం పట్నాలోనే వేచి ఉండటం ఉత్కంఠను రేపుతోంది.
అరెస్టు చేయడానికి అవకాశాలు
చట్టపరంగా చూస్తే ఒకసారి ట్రాన్సిట్ వారెంట్ను కోర్టు తిరస్కరించినంత మాత్రాన అరెస్టు చేసే అవకాశం పూర్తిగా పోయిందని భావించలేమని న్యాయవర్గాలు చెబుతున్నాయి. అయితే, పట్నా కోర్టు ఎత్తిచూపిన ప్రొసీజరల్ ల్యాప్సెస్ను సవరించుకోవడం పోలీసులకు అత్యవసరం. ఇప్పుడు ఏపీలో కొత్తగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. దీనిని అమలు చేయడానికి పోలీసులు పట్నా మళ్ళీ కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే, పట్నా కోర్టు ఇప్పటికే ఇచ్చిన 30 రోజుల రక్షణ ఉత్తర్వు అమల్లో ఉన్నంత వరకు, ఆ గడువు ముగియకముందే అరెస్టు చేయడం చట్టపరంగా సవాలుతో కూడుకున్న పని అని భావిస్తున్నారు.
అక్కడి కోర్టు అనుమతి తప్పనిసరి
సునీల్ నాయక్ ప్రస్తుతం ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. పట్నా కోర్టు ఇచ్చిన రక్షణ కేవలం తాత్కాలికమే కాబట్టి, హైకోర్టులో ఆయనకు ఊరట లభించకపోతే అరెస్టు చేసే మార్గం సుగమం అవుతుంది. ఒకవేళ ఆయన ఆజ్ఞాతంలో ఉండి విచారణకు సహకరించకపోతే, పోలీసులు ఆయనను పరారీలో ఉన్న నిందితుడి గా ప్రకటించి, సెక్షన్ 82 కింద ఠిన చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. ఈ లోపు పట్నా కోర్టు తీర్పుపై ఏపీ పోలీసులు పైకోర్టులో అప్పీల్ చేసే అవకాశం కూడా ఉంది.
పట్నాలోనే ఎస్పీ దామోదర్ బృందం
ప్రస్తుతానికి ఎస్పీ దామోదర్ బృందం పట్నాలో సునీల్ నాయక్ కదలికలపై నిఘా ఉంచింది. లీగల్ గా ట్రాన్సిట్ వారెంట్ తిరస్కరణకు గురైనందున, కేవలం కొత్త వారెంట్ ఉన్నంత మాత్రాన నేరుగా అరెస్టు చేసి తీసుకురావడం సాధ్యం కాదు. నిందితుడిని స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, అక్కడి నుండి మరో రాష్ట్రానికి తీసుకెళ్లేందుకు అనుమతి తీసుకోవడం భారత శిక్షాస్మృతి ప్రకారం తప్పనిసరి. కాబట్టి, ఏపీ పోలీసులు హైకోర్టు ఆదేశాల కోసం లేదా పట్నా కోర్టు ఇచ్చిన గడువు ముగిసే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.























