Balakrishna : డిప్యూటీ సీఎం పవన్ తో బాలకృష్ణ సమావేశం - హిందూపురం అభివృద్ధి పనులపై చర్చ
Pawan Kalyan: అమరావతిలోని ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఛాంబర్ వద్ద ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పవన్ తో బాలకృష్ణ సమావేశం అయ్యారు.

Balakrishna meets Pawan Kalyan in the Assembly: బడ్జెట్ సమావేశాల సందర్భంగా పవన్ కల్యాణ్ను ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు కీలక నేతలు కలిశారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రెండో రోజున హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఛాంబర్కు వెళ్లారు. వీరిద్దరి మధ్య దాదాపు అరగంటకు పైగా ఏకాంత చర్చలు జరిగాయి. గతంలో అన్స్టాపబుల్ షో వేదికగా మెరిసిన వీరిద్దరూ, ఇప్పుడు శాసనసభ వేదికగా ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
డిప్యూటీ సీఎం పవన్ తో ప్రధానంగా హిందూపురం నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలు, మున్సిపల్ వ్యవహారాలపై పవన్కు బాలకృష్ణ వివరించినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వంలో రెండు పార్టీల మధ్య ఉన్న సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంపై వారు చర్చించారు. నియోజకవర్గ స్థాయిలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించిన నిధుల విడుదలపై బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.
శాసన సభలోని ఉప ముఖ్యమంత్రివర్యులు పేషీలో శ్రీ పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయి చర్చించిన ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు గారు, ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారు. pic.twitter.com/YF0W9CmEi2
— L.VENUGOPAL🌞 (@venupro) February 12, 2026
బాలకృష్ణతో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ , ఎమ్మెల్సీ నాగబాబు కూడా పవన్ కల్యాణ్ను ప్రత్యేకంగా కలిశారు. అసెంబ్లీ లాబీల్లోనూ, పవన్ ఛాంబర్లోనూ ఈ భేటీలు జరిగాయి. పవన్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు శాసనమండలిలో అనుసరించాల్సిన వ్యూహాలు, జనసేన తరఫున లేవనెత్తాల్సిన ప్రజా సమస్యల గురించి పవన్తో చర్చించారు. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్సీలు కూడా పవన్ను కలిసి తమ నియోజకవర్గాల్లోని రోడ్లు, తాగునీటి సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు.























