AP Liquor Scam: లిక్కర్ స్కామ్కు అసలు ఆర్కిటెక్ట్ రాజ్ కేసిరెడ్డే - బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court : ఏపీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డికి సుప్రీంకోర్టులో బెయిల్ రాలేదు. ఆయన లాయర్లు పిటిషన్ ఉపసంహరించుకున్నారు.

Raj KeSiReddy No bail: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసీరెడ్డి కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గురువారం జరిగిన విచారణలో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను విచారించిన ధర్మాసనం, బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా నిందితుడిపై అత్యంత కఠినమైన వ్యాఖ్యలు చేసింది.
లిక్కర్ స్కామ్కు అసలు ఆర్కిటెక్ట్
బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్ కేసీరెడ్డిని ఈ మొత్తం మద్యం కుంభకోణానికి అసలు ఆర్కిటెక్ట్ అని అభివర్ణించింది. ప్రభుత్వ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన తీరును కోర్టు తప్పుబట్టింది. ఈ కుంభకోణంలో ఆయన పాత్ర అత్యంత కీలకమని, అందుకే ఇప్పుడు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. రాజ్ కేసీరెడ్డి తరపు లాయర్ వాదనలు వినిపిస్తూ, తన క్లయింట్ ఇప్పటికే 10 నెలలుగా జైల్లో ఉన్నారని, కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీనిపై ధర్మాసనం ఘాటుగా స్పందించింది. పర్లేదు.. కొన్నాళ్లు జైల్లోనే ఉండనీయండి అని సంచలన వ్యాఖ్యలు చేసింది. జరిగిన కుంభకోణం తీవ్రత దృష్ట్యా మరికొంత కాలం ఆయన జైలులోనే ఉండాలని కోర్టు అభిప్రాయపడింది.
పిటిషన్ ఉపసంహరణ
ధర్మాసనం బెయిల్ ఇచ్చేందుకు సముఖంగా లేకపోవడంతో పాటు, పిటిషన్ను డిస్మిస్ చేస్తామని సంకేతాలు ఇవ్వడంతో రాజ్ కేసీరెడ్డి తరపు న్యాయవాదులు వెనక్కి తగ్గారు. కోర్టు పిటిషన్ను కొట్టివేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో, వారు తమ బెయిల్ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు . గత ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ పేరుతో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఏపీ సీఐడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. రాజ్ కేసీరెడ్డి ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొట్టారని అభియోగాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలతో ఈ కేసులో విచారణ మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది.
కొనసాగుతున్న ఈడీ విచారణ
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ 16 మందిని అరెస్టు చేయగా, మొత్తం 48 మందిపై కేసులు నమోదు చేసింది. వీరిలో ప్రధాన నిందితుడు రాజ్ కేసీరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి వంటి ప్రముఖులు ఉన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి వంటి వారికి బెయిల్ వచ్చింది. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తును ముమ్మరం చేసిన ఈడీ, ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించింది. జనవరి 2026లో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది. హవాలా మార్గంలో మళ్లించిన నిధులు, షెల్ కంపెనీల ఏర్పాటుపై ఈడీ ప్రస్తుతం లోతుగా ఆరా తీస్తోంది.























