Kakani Govardhan Reddy : కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం సెర్చింగ్ - హైదరాబాద్ ఇంట్లోనూ పోలీసుల నోటీసులు
Kakani: కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఏపీ పోలీసులు హైదరాబాద్లో మరోసారి నోటీసులు జారీ చేశారు. మంగళవారం విచారణకు రావాలని ఆదేశించారు.

AP Police issues notices to Kakani: మాజీ మంత్రి, నెల్లూరు వైసీపీ నేత కాకాణి గోవర్దన్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరు కాలేదు. నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్ అక్రమ తవ్వకం, అమ్మకాల కేసులో ఆయన ఏ4 నిందితుడిగా ఉన్నారు. ఆయనను విచారణకు రావాలని నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు నెల్లూరులోని ఆయన ఇంటికి వెళ్లారు. కానీ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆదివారం ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. సోమవారం ఉదయం పదకొండు గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఆయన హాజరు కాలేదు.
మరో వైపు ఆయన కోసం నెల్లూరు పోలీసులు హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్ లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లినా అక్కడ కూడా ఆయన లేరు. దీంతో మంగళవారం విచారణకు హాజరు కావాలని ఆ ఇంట్లో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి బంధువుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాకాణి గోవర్థన్ రెడ్డి అరెస్టు భయంతో ఆజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆయన కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ మంగళవారం జరిగే అవకాశం ఉంది. ఈ లోపు పోలీసులకు కనిపిస్తే అరెస్టు చేస్తారని.. అందుకే ముందస్తు బెయిల్ వచ్చే వరకూ ఆజ్ఞాతంలో ఉండాలని ఆయన అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
కాకాణిపై నమోదు అయిన కేసు ఏమిటంటే ?
నెల్లూరు జిల్లాలో లీజు ముగిసినా క్వార్జ్ తరలించారని.. రూ.250 కోట్ల విలువైన క్వార్జ్ తరలించారని మైన్స్ అధికారులు గుర్తించారు. పోలీసులకు ఫి ర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మాజీ మంత్రి కాకాణి పేరును ఏ4గా ఎఫ్ఐఆర్లో చేర్చాడు. క్వార్ట్జ్ అక్రమాల వ్యవహారంలో ఏ4గా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై 120బీ, 129, 220, 447, 427, 379, 506తో పాటు ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన శ్యాంప్రసాద్ రెడ్డి ఏ1 కాగా, ఏ2, ఏ3లుగా పార్టీ నేతలు వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. ఏ6, ఏ8గా ఉన్న మరో ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి గూడూరు కోర్టులో హాజరు పరిచగా.. కోర్టు వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
వైసీపీ హయాంలోనే టీడీపీ నేత సోమిరెడ్డి కేంద్ర మైనింగ్ శాఖకు విచారణకు ఆదేశించాలని ఫిర్యాదు చేశారు. రూ.250 కోట్లకు పైగా క్వార్ట్జ్ దోచుకుపోయారని ఫిర్యాదు చేశారు. ఆపై రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో కేసులో పురోగతి కనిపిస్తోంది. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన మైనింగ్ శాఖ అధికారులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఏ4గా కాకాణి పేరు చేర్చారు. శ్యాంప్రసాద్రెడ్డి, వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులు రెడ్డిలపై గతంలో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.





















