IPS PV Sunil Kumar: ఐపీఎస్ పి.వి. సునీల్ కుమార్ సస్పెన్షన్ పొడిగింపు.. అప్పటివరకూ అంతే!
PV Sunil Kumar: ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ పై విధించిన సస్పెన్షన్ మరోసారి పొడిగించింది ఏపీ ప్రభుత్వం. నమోదైన క్రిమినల్ కేసుల విచారణ పూర్తి, లేక రిటైర్మెంట్ ఏది ముందుగా వస్తే అప్పటివరకూ కొనసాగుతుంది.

IPS PV Sunil Kumar Suspension | అమరావతి: రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పి.వి. సునీల్ కుమార్ (1993 బ్యాచ్) సస్పెన్షన్ను పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్ ఇండియా సర్వీసెస్ (డిసిప్లిన్ & అప్పీల్) రూల్స్, 1969లోని రూల్ 3(3) ప్రకారం ఈ సస్పెన్షన్ పొడిగింపు వర్తిస్తుందని అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయనపై ఉన్న క్రిమినల్ కేసు విచారణ పూర్తయ్యే వరకు లేదా ఆయన పదవీ విరమణ తేదీ అయిన 30 జూన్ 2026 వరకు.. ఈ రెండింటిలో ఏది ముందుగా వస్తే ఆ గడువు వరకు సునీల్ కుమార్ సస్పెన్షన్ కొనసాగుతుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
అసలేం జరిగింది..
గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నం. 187/2024 కేసు దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది. గత వైసిపి ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్గా పనిచేసిన సమయంలో, అప్పటి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుపై జరిగిన కస్టోడియల్ టార్చర్ (పోలీసు కస్టడీలో వేధింపులు) ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనపై తీవ్రమైన క్రిమినల్ సెక్షన్లు ఉన్నాయి. దర్యాప్తు జరుగుతున్న ఈ కేసు ఆయన సర్వీస్ హోదాతో నేరుగా సంబంధం కలిగి ఉన్నందున, పీవీ సునిల్ కుమార్ను సర్వీసులోకి తీసుకుంటే సాక్ష్యాధారాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సునీల్ కుమార్ గతంలో సీఐడీ అడిషనల్ డీజీగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆయనపై వచ్చిన ఫిర్యాదులు, ముఖ్యంగా కస్టోడియల్ హింసకు సంబంధించిన ఆరోపణలు ఆయన కెరీర్లో పెద్ద మలుపుగా మారాయి. ప్రస్తుతం ఈ కేసు ఏసీబీ కోర్టు పరిధిలో విచారణలో ఉంది. దర్యాప్తు పారదర్శకంగా సాగేందుకు వీలుగా ఆయన సస్పెన్షన్ను పొడిగించడం పరిపాలనాపరంగా అనివార్యమని ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది.
పలు కేసుల్లో నిందితుడిగా సునీల్ కుమార్
సునీల్ కుమార్ అనుమతి లేకుండా 2020 నుంచి 2024 మధ్య విదేశాలకు వెళ్లారని ఆరోపణలు వచ్చాయి. సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఏపీ ప్రభుత్వం గతంలో చర్యలు చేపట్టింది. వైసీపీ హయాంలో సీఐడీ డీజీగా పనిచేసిన సమయంలో రఘురామ కృష్ణంరాజును అరెస్టు చేసి విచారణ పేరిట అధికారులు తనను కొట్టారని, హత్యాయత్నం చేశారని రఘురామ ఫిర్యాదు చేశారు. గుంటూరు నగరపాలెం పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. అగ్రి గోల్డ్ నిధులు దుర్వినియోగం ఆరోపణలపై ఏసీబీ విచారణ కొనసాగుతోంది.
























