Annadata Sukhibhava Status Check Online: ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Annadata Sukhibhava Status Online | కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం కలిసి పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశాయి. ఏపీ రైతుల ఖాతాల్లో రూ.7 వేల రూపాయలు జమ చేశారు.

PM Kisan Annadata Sukhibhava Funds | పల్నాడు: ఏపీలోని కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేసింది. పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ పథకం కింద 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో తొలి విడతగా రూ.7వేల చొప్పున జమ చేసింది. పశ్చిమ బెంగాల్ లో ప్రధాని మోదీ పీఎం కిసాన్ నిధులు విడుదల చేయగా ఇక్కడ రైతులతో కలిసి సీఎం చంద్రబాబు వర్చువల్గా కార్యక్రమాన్ని వీక్షించారు. రైతులకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, అందర్నీ కష్టాల్లోకి నెట్టడం తప్ప ఆ గొడ్డలి పార్టీకి మరేమీ తెలియదని ఎద్దేవా చేశారు. రైతు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో శనివారం నాడు ఏర్పాటు చేసిన ‘పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ’ నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని నిధులు విడుదల చేసి, అనంతరం ప్రసంగించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవంతో పాటు, స్వచ్ఛాంధ్ర, అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ లాంటి 3 అద్భుతమైన కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తామని ప్రజలకు మాటిచ్చాం. రైతుల కష్టాలు తీరుస్తామన్న మా నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోంది. ఇక్కడ బటన్ నొక్కగానే 99.8 శాతం మంది అర్హులైన రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధులు జమయ్యాయి. తొలి విడత 7 వేల చొప్పున మొత్తం రూ.3,125 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశాం.
లింగంగుట్లలో పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. 2026 ఖరీఫ్ సీజన్ కు గానూ 46.85 లక్షల మంది రైతుల ఖాతాలకు నిధుల విడుదల చేసిన ముఖ్యమంత్రి. మొదటి విడతగా ఒక్కో రైతుకూ రూ.7 వేల చొప్పున రూ.3,125 కోట్ల ఆర్ధిక సాయం జమ.#AnnadathaSukhibhava… pic.twitter.com/B7pmEtKDpj
— Telugu Desam Party (@JaiTDP) June 20, 2026
గత ప్రభుత్వం ధాన్యం విక్రయిస్తే ఆరు నెలలైనా డబ్బులు రైతులకు అందేవి కావు. కానీ కూటమి ప్రభుత్వం కేవలం 48 గంటల్లోనే రైతుల సొమ్మును వారి ఖాతాల్లో జమ చేస్తుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే వరి సాగుకు, తెలంగాణ మెట్ట పొలాలకు కేరాఫ్ అడ్రస్గా ఉండేవి. ఇప్పుడు ఏపీ కంటే తెలంగాణలోనే వరి ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది. రసాయన ఎరువుల నుంచి ప్రకృతి సేద్యం వైపు మళ్లాల్సిన అవసరం వచ్చింది.

రసాయనాలు ఎక్కువగా వాడితే భవిష్యత్తులో ఇతర దేశాలు మన ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం తగ్గిస్తాయి. లాభాలు అందించే పామాయిల్ తోటల సాగును రాష్ట్రంలో ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటికే రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మార్చామని’ చంద్రబాబు పేర్కొన్నారు. లింగంగుంట్లలోని ప్రజావేదిక సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ స్టాళ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు.. జాతీయ నూనెగింజలు, ఆయిల్ పామ్ మిషన్ ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షించారు.
అన్నదాత సుఖీభవ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే..
- రైతులు అధికారిక వెబ్సైట్ annadathasukhibhava.ap.gov.in ను సందర్శించాలి.
- హోం పేజీలో కనిపించే Know Your Status మీద క్లిక్ చేయాలి. వేరే పేజీకి రీ డైరెక్ట్ అవుతుంది.
- ఆ పేజీలో ఆర్థిక సంవత్సరం, ఆధార్ నెంబర్, ఈ క్యాప్చా ఎంటర్ చేయాలి
- ఆ తరువాత సెర్చ్ (Search) మీద క్లిక్ చేయాలి.
- మీ అన్నదాత సుఖీభవ నిధుల సమాచారం మీ స్క్రీన్పై వస్తుంది.
- సక్సెస్ అని వస్తే డబ్బులు జమ అవుతాయి. పెండింగ్ లేదా రిజెక్ట్ అని వస్తే డబ్బులు ఇంకా జమ కాలేదని అర్థం.
వాట్సాప్ ద్వారా స్టేటస్ తెలుసుకోండి
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పలు స్కీముల వివరాలతో పాటు అన్నదాత సుఖీభవ స్టేటస్ సైతం చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్లో 95523 00009 నెంబర్కు హాయ్ అని మెస్సేజ్ చేయాలి. అనంతరం మీకు సేవలు (Services) ఎంచుకోండి అని వస్తుంది. అందులో అన్నదాత సుఖీభవ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ పేరు, ఆధార్ నెంబర్, వివరాలు ఎంటర్ చేస్తే మీ నగదు స్టేటస్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























