Sri Sathya Sai District Politics: సెగలు రేపుతున్న సత్యసాయి జిల్లా పాలిటిక్స్ - అవినీతిపై ముఖాముఖి చర్చకు కదిరి టీడీపీ, వైసీపీ నేతల సవాళ్లు
Kadiri Wakf Board Lands Issue: సత్యసాయి జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఆరోపణలు, పరస్పర సవాళ్లతో రాజకీయం వేడెక్కుతోంది. కదిరిలో ఓపెన్ డిబేట్కు.. ఎమ్మెల్యేకు.. వైసీపీ నేత సవాల్ చేశారు.

Kadiri Politics AP 2026: సత్యసాయి జిల్లాలో టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి మధ్య నడుస్తున్న వ్యక్తిగత ఆరోపణలు, సవాళ్లు కదిరి రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ఇరు పార్టీల నేతలు అవినీతి, కబ్జాలు, కుటుంబ సభ్యులపై ఆరోపణలతో బహిరంగ చర్చలకు సై అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు.
జగన్ సతీమణిని అవమానించడంపై ఆగ్రహం
కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాయి వేరు.. ఆయన తండ్రి వైఎస్సార్ కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాంటి నాయకుడి భార్యను అకారణంగా రాజకీయాల్లోకి లాగి అవమానిస్తావా అంటూ ప్రవీణ్ రెడ్డి ఎమ్మెల్యేను నిలదీశారు. నీతి, నిజాయితీల గురించి మాట్లాడే ముందు ఎమ్మెల్యే తన గతం, చరిత్ర గురించి ఆలోచించుకోవాలని, మహిళల గురించి మాట్లాడే ముందు కొంత సంస్కారం నేర్చుకోవాలని హితవు పలికారు.
మద్యం షాపుల దందా – కబ్జాలపై సంచలన ఆరోపణలు
ఎమ్మెల్యే ప్రసాద్ అవినీతి గురించి మాట్లాడితే కదిరి ప్రజలు నవ్వుకుంటున్నారని ప్రవీణ్ రెడ్డి ఎద్దేవా చేశారు. కదిరి నియోజకవర్గంలో బ్రాందీ షాపులు, పల్లెల్లో బెల్ట్ షాపులు పెట్టించి.. మద్యం బాటిల్పై రూ. 20 నుండి రూ. 40 వరకు అధికంగా అమ్మించి కమిషన్లు దండుకుంటోంది ఎమ్మెల్యే కాదా? అని ప్రశ్నించారు. ఆ అక్రమంగా వసూలు చేసిన డబ్బులు మీ ఇంట్లో వాళ్లు ఇస్తున్నారా అని మేము అడిగితే అది తప్పు అవుతుందా? అని ఘాటుగా నిలదీశారు. అంతేకాకుండా, కదిరిలో ఎమ్మెల్యే తన ఇంటి ముందున్న దేవుడి మాన్యం స్థలాన్ని 15 ఏళ్లుగా కబ్జా చేసి సొంత పార్కింగ్గా వాడుకోవడం నిజం కాదా అంటూ దేవాదాయ శాఖ భూముల కబ్జాపై సంచలన ఆరోపణలు చేశారు.
మైనార్టీల ఆస్తులపై కన్ను – షాదీ మహల్ మూసివేత
గడిచిన రెండున్నరేళ్ల కాలంలో కదిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి శూన్యమని ప్రవీణ్ రెడ్డి విమర్శించారు. ముఖ్యంగా కదిరిలో మైనార్టీ ముస్లింలపై ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పేద ముస్లింలు పెళ్లిళ్లు చేసుకునే ప్రభుత్వ షాదీ మహల్కు రెండున్నరేళ్లుగా ఎందుకు తాళాలు వేశారు? వారు చేసిన పాపం ఏంటి? అని ప్రశ్నించారు. ఇది చాలదన్నట్లు, కదిరి కాలేజీ సర్కిల్లో కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ బోర్డు స్థలంలో ముస్లింల సమాధులను సైతం తొలగించి, ఆ స్థలాన్ని కబ్జా చేసి ప్లాట్లుగా వేసి అమ్ముకోవాలని ఎమ్మెల్యే ప్రయత్నించడం వాస్తవం కాదా అంటూ నిలదీశారు.
అనుచరులను బలిచేయొద్దు – డైరెక్ట్ డిబేట్కు సై
కదిరిలో తాను అడిగిన సూటి ప్రశ్నలకు ఎమ్మెల్యే ప్రసాద్ నేరుగా సమాధానం చెప్పాలని, తన అనుచరులను ప్రయోగించి పారిపోవద్దని ప్రవీణ్ రెడ్డి సవాల్ విసిరారు. వారిని బలి చేయవద్దు. రేపు ప్రభుత్వం మారితే నీకంటే ముందు వాళ్లే కేసుల్లో ఇరుక్కుంటారు, అప్పుడు వారి పరిస్థితి ఏమిటో ఆలోచించు అని హెచ్చరించారు. మనం ఇద్దరం నేరుగా కూర్చుని కదిరి అభివృద్ధిపై, కబ్జాలపై మాట్లాడుకుందాం. ఏ చర్చకైనా నేను సిద్ధం అంటూ బహిరంగ చర్చకు సవాల్ విసిరారు.
ప్రస్తుతం కదిరిలో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. భూకబ్జాలు, మద్యం మాఫియా, వక్ఫ్ ఆస్తుల ఆక్రమణల వంటి కీలకమైన ఆరోపణలు తెరపైకి రావడంతో స్థానిక రాజకీయాలు వేడెక్కాయి. ప్రవీణ్ రెడ్డి విసిరిన ఈ సవాళ్లపై ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ , టీడీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయో, ఈ బహిరంగ చర్చ సవాల్ ఎక్కడి వరకు దారితీస్తుందో అని కదిరి ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















