Chandrababu Amaravati Review: అమరావతి ఇన్ ఫ్రా పనులు వేగంగా జరగాల్సిందే - అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం
Amaravati : అమరావతి నిర్మాణ పనులపై చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే కీలకమైన పునాది పనులు పూర్తి చేయాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించారు.

Chandrababu reviews Amaravati works: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తన క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుతం అమరావతిలో రూ. 57,821 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో ఉన్నాయని, వీటిని యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించడంలో ఎదురైన సవాళ్లను అధిగమించి, టెండర్ల ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు.
రాజధానిలో అత్యంత కీలకమైన అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాల నిర్మాణంతో పాటు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ లేఅవుట్ల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కేవలం భవనాలే కాకుండా భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా రోడ్ల నెట్వర్క్, హౌసింగ్ ప్రాజెక్టులు వేగంగా సాగాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సుమారు 20 వేల మంది కార్మికులు , నిపుణులు పనిచేస్తున్నారని, వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే కీలకమైన పునాది పనులు పూర్తి చేయాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించారు.
ఈ సమీక్షలో ముఖ్యమంత్రి నిర్మాణ సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతూ.. అమరావతి నిర్మాణం అనేది కేవలం ఒక కాంట్రాక్ట్ పని కాదు, ఇది ఒక చారిత్రక బాధ్యత . ఈ అద్భుత నగరాన్ని నిర్మించే ప్రతి ఒక్కరూ చరిత్రలో భాగస్వాములు అవుతున్నారు అని ఉద్ఘాటించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, గ్రీన్ ఎనర్జీ ,అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి అమరావతిని ప్రపంచస్థాయి ఫ్యూచర్ సిటీ గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి వారం, నెలవారీ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
రాజధాని అమరావతి నిర్మాణ పనులపై క్యాంప్ కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ పీ నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో… pic.twitter.com/UazQMpzXJR
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) April 4, 2026
ఇటీవలే పార్లమెంటులో అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ చట్టబద్ధత కల్పించడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు పూర్తి మద్దతు ఇస్తున్న తరుణంలో, 2027 నాటికి ప్రధాన పరిపాలనా భవనాలన్నీ సిద్ధం కావాలని అధికారులకు సూచించారు. అమరావతిని హైదరాబాద్ ప్లస్ నగరంగా, ఆర్థిక, పర్యాటక కేంద్రంగా మార్చడమే తమ ప్రభుత్వ సంకల్పమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.























