AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధతపై తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం..
ఏపీ అసెంబ్లీలో రాజధాని అమరావతిపై ప్రత్యేక చర్చ ముగిసింది. రాజధానిగా అమరావతిని చట్టబద్ధం, శాశ్వతం చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో పేర్కొన్నారు.

అమరావతి: ఏపీకి శాశ్వత రాజధాని అమరావతి అని, అందుకే చట్టబద్ధత కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2028 ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతిలోని ఐకానిక్ టవర్స్ ప్రారంభోత్సవం జరుగుతుందని ప్రకటించారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే శాశ్వతంగా ఏ ఇబ్బంది ఉండదని కేంద్రానికి ప్రతిపాదన పంపగా.. అసెంబ్లీ తీర్మానం ఉండాలని సూచించింది. ఈ మేరకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై అమరావతిని శాశ్వత రాజధానిగా చేసేందుకు తీర్మానం చేశామన్నారు. రాజధానిగా అమరావతి చట్టబద్ధతపై తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు శనివారం ప్రకటించారు. ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. చివరగా పార్లమెంట్ ఆమోదం పొందిన తరువాత రాజధానిగా అమరావతి చట్టమవుతుంది.
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. క్రీ.పూ 2020లో శాతవాహనులు జైత్రయాత్ర చేశారు. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాలను పాలించారు. అమరావతి రాజధానిగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాలను పరిపాలించారు. లోహాలు, వజ్రాలు, వస్త్రాలు సహా మరిన్ని ఉత్పత్తులతో విదేశీ వ్యాపారం జరిగింది. బ్రిటీష్ మ్యూజియంలో అమరావతికి ప్రత్యేక గ్యాలరీ ఉంది. ఇక్కడున్న వారికి అంతగా తెలియకున్నా విదేశాల్లో మన ప్రాచీన వైభవం గుర్తింపు పొందింది.
కాకతీయులు వరంగల్ కేంద్రంగా పాలిస్తూ ఆలయాలు, ఆర్కిటెక్చర్ అద్భుతాలు చేశారు. విజయనగర సామ్రాజ్యం తెలుగు వారిని పాలించింది. తరువాత బ్రిటీష్ పాలన మొదలై మన చరిత్ర మనుగడ కోల్పోయింది. మదరాసీలు అని పిలిచేవారు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపనతో తెలుగువారి ఆత్మగౌరవం, విలువ మళ్లీ గుర్తించారు. అమరజీవి పొట్టిశ్రీరాములు తెలుగువారి కోసం రాష్ట్ర సాధనకు పోరాడారు. నెహ్రూ లాంటి వారు దిగొచ్చి తెలుగు వారికి రాష్ట్రాన్ని ప్రకటించారు. 1953 అక్టోబర్ 1న విజయవాడకు వచ్చి ఉంటే సెంటర్ గా ఉండే ప్రాంతం ఏ స్థాయిలో అభివృద్ధి చెందేదో మనం ఊహించలేం. తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కర్నూల్ రాజధానిగా చేసింది. పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో తెలుగు వారికి గుర్తింపు లభించింది.

తరువాత హైదరాబాద్ సీఎం బూర్గుల రామకృష్ణారావు రాజీనామా చేసి, ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటయ్యాక నీలం సంజీవరెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. రాజధాని కోల్పోయాం, విమర్శలు, అవమానాలు భరిస్తూ వచ్చాం. ఈ క్రమంలో 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది. 2014 జూన్ 2న రెండు రాష్ట్రాలుగా విడదీశారు. దాంతో ఏరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిపాలని చర్చకు వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చర్చించాక.. పొట్టిశ్రీరామలు డిసెంబర్ లో ఆత్మార్ఫణ చేశారు కనుక అదేరోజు అవతరణ దినోత్సవం జరుపుకుని ఎన్డీయే ప్రభుత్వం గుర్తింపు తీసుకొచ్చింది.
విభజన తర్వాత కార్యాలయాలు లేకపోయినా, 9 నెలల్లోనే సచివాలయం, అసెంబ్లీ భవనాలను పూర్తి చేశామని గుర్తుచేశారు. రాజధాని విషయంలో జగన్ ఊసరవెల్లి రాజకీయాలు చేశారని, అమరావతిపై విషం చిమ్మి రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టారని మండిపడ్డారు. రైతులు ఎంతో నమ్మకంతో 34 వేల ఎకరాల భూములు ఇస్తే, వైసీపీ ప్రభుత్వం వారిని హింసించి, ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాసిందని ధ్వజమెత్తారు.
వైసీపీ విధ్వంసకర పాలన వల్లే ఆ పార్టీ 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోయిందని ఎద్దేవా చేశారు. 2028 నాటికి అమరావతిలో మెజారిటీ పనులు పూర్తి చేస్తామని, ప్రస్తుతం రూ.56 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో ఇకపై రాజారెడ్డి రాజ్యాంగం నడవదని, అంబేడ్కర్ రాజ్యాంగమే ఉంటుందని స్పష్టం చేశారు. "ఏపీకి ఒకే ఒక్క రాజధాని.. అది అమరావతి మాత్రమే" అని అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటించారు.
ఇన్నేళ్లయినా రాజధాని కోసం పోరాటాలు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఏపీ అసెంబ్లీలో రాజధాని అమరావతిపై జరిగిన చర్చలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం చేశారు. విభజన సమయంలో కాంగ్రెస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని, సరైన కార్యాలయాలు లేకపోయినా చంద్రబాబు పట్టుదలతో పాలన సాగించారని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లయినా ఇప్పటికీ రాజధాని కోసం పోరాడాల్సి రావడం బాధాకరమన్నారు.

అమరావతి కోసం రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు ఇచ్చారని, కానీ గత వైసీపీ ప్రభుత్వం వారిపై కక్షగట్టి హింసించిందని మండిపడ్డారు. మూడు రాజధానుల పేరుతో సమస్యను మరింత క్లిష్టతరం చేశారని, ఇకపై వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ధీమా వ్యక్తం చేశారు. అమరావతి విషయంలో జనసేన తన మాటపై స్థిరంగా ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధి సమయంలో చంద్రబాబుపై విమర్శలు వచ్చినా ఆయన వెనకడుగు వేయలేదని గుర్తు చేస్తూ.. "సాధారణ రాజకీయ నాయకుడు ఎన్నికల గురించి ఆలోచిస్తే, దార్శనికుడు రాబోయే తరం గురించి ఆలోచిస్తాడు" అని పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే రాజకీయ స్థిరత్వం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
























