Amaravati: ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంగా రైతుల త్యాగాలను నేతలు గుర్తు చేసుకున్నారు.

Amaravati: ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. ఏపీకి అమరావతే రాజధాని అని శనివారం అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టింది. ఈ తీర్మానంపై మాట్లాడిన నేతలు రైతుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. వైసీపీ హయాంలో జరిగిన పరిణామాలపై విమర్శలు చేశారు.
అసెంబ్లీలో ఏం జరిగింది?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం శనివారం ఉదయం ప్రారంభమైంది. సరిగ్గా ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి తీర్మానాన్ని సభలో ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానంపై సుమారు నాలుగు గంటల పాటు చర్చ జరగనుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా 20 మందిపైగా సభ్యలు చర్చలో పాల్గొంటున్నారు.
ముందుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ... ఈ సమావేశం ఐదున్నర కోట్ల ఆంధ్రుల ఆకాంక్షకు ప్రతి రూపమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రగతికి ఎదురయ్యే సవాళ్లను శాశ్వతంగా తొలగించే పవిత్ర యజ్ఞం ఈ సమావేశంలో మొదలైందని ఆయన కామెంట్ చేశారు. ఈ చారిత్రాత్మక సమావేశానికి 11 మంది వైసీపీ సభ్యులు వస్తారని ఆశించామని కానీ చేసిన తప్పును ఒప్పుకునే ధైర్యం లేక వారు రాలేదని స్పీకర్ విమర్శించారు.
రాజధాని నిర్మాణం కోసం 29 వేల మంది రైతులు తమ ప్రాణప్రదమైన 34, 400 ఎకరాల భూములను స్వచ్ఛందంగా విరాళంగా ఇచ్చారని మంత్రి నారాయణ గుర్తు చేశారు. 2015 జనవరి 1న ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇవ్వగా, ఫిబ్రవరి నాటికే రైతులు భూములను అప్పగించారని ఆయన తెలిపారు. వైసీపీ నాయకుల ఎన్ని దుష్ప్రచారాలు చేసినా రైతులు ఎక్కడా తలొగ్గలేదని కొనియాడారు.
చట్టబద్ధమైన రక్షణ ఎందుకు?
వైసీపీ పాలనాకాలంలో రాజధాని అమరావతి విషయంలో జరిగిన రాజకీయ పరిణామాలతో అప్రమత్తమైన కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతిని పూర్తిగా విస్మరించింది. ఐదేళ్లపాటు అమరావతిని గాయపరిచింది. అందుకే భవిష్యత్లో మరెవరూ అధికారంలోకి వచ్చినా రాజధానిని కదిలించకుండా ఉండాలంటే దీనికి చట్టబద్ధమైన రక్షణ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5లో ఏపీ రాజధాని అమరావతి అని స్పష్టంగా చేర్చడం ద్వారా దీనికి తెరుగులేని చట్టబద్ధత లభిస్తుంది. ఈ దిశగా పార్లమెంట్లో చట్టసవరణ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని తెలుస్తోంది. అందుకే దిద్దుబాటు చర్యల కోసమే అసెంబ్లీ శనివారం అత్యవసరంగా సమావేశమైంది.
ట్రెండింగ్ వార్తలు






















