Customs in Medaram Jatara | మేడారంలో ఈ వింత ఆచారాలు మీకు తెలుసా? | ABP Desam
ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఎన్నో అద్భుతాలకు నిలయం. ఈ జాతరలో పాటించే ఆచారాలు మిగిలిన హిందూ పండుగలకు పూర్తి భిన్నంగా ఉంటాయి. విగ్రహాలు లేకపోవడం, బెల్లాన్ని బంగారం అనడం వంటి అనేక వింతలు ఇక్కడ కనిపిస్తాయి. అసలు ఈ ఆచారాల వెనుక ఉన్న అసలు అర్థం ఏంటో తెలుసుకుందాం.
సాధారణంగా ఏ గుడికి వెళ్లినా దేవుడి విగ్రహాలు కనిపిస్తాయి. కానీ మేడారంలో విగ్రహాలు ఉండవు. దేవతలను 'గద్దెల' రూపంలో పూజిస్తారు. గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రకృతిని, ప్రాణత్యాగం చేసిన వీరులను ఆరాధిస్తారు. సమ్మక్క-సారలమ్మలు అడవి బిడ్డలుగా, పోరాట వీరులు. అందుకే వారిని విగ్రహ రూపంలో కాకుండా, ప్రకృతిలో భాగమైన వెదురు కర్రలు, కుంకుమ భరణుల రూపంలో గద్దెలపై ప్రతిష్ఠిస్తారు.
పూర్వం గిరిజనులకు బెల్లం అత్యంత పవిత్రమైనది. అడవిలో దొరికే స్వచ్ఛమైన పదార్ధంగా దీనిని భావించేవారు. బంగారం ఎంత విలువైనదో, భక్తితో సమర్పించే ఈ బెల్లం కూడా అంతే విలువైనదని అర్థం. అందుకే అమ్మవార్లకు బంగారం గా బెల్లాన్ని సమర్పిస్తారు.
సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుండి గద్దెకు వచ్చే సమయంలో భక్తులు తమ కోళ్లను, గొర్రెలను గాలిలోకి ఎగురవేస్తారు. దీనిని 'ఎదురుకోళ్లు' అంటారు. ఇది దేవతకు స్వాగతం పలికే ఒక గిరిజన పద్ధతి. సమ్మక్కను విగ్రహంగా కాకుండా ఒక కుంకుమ భరణి రూపంలో చిలకలగుట్ట నుండి తెస్తారు. ఆ సమయంలో అడవిలో పులి కనిపిస్తుందని, కానీ ఎవరికీ హాని చేయదని ఒక నమ్మకం ఉంది. మేడారం జాతరలో ఇలా అనేక ఆచారాలు ఉన్నాయి. అవన్నీ కూడా గిరిజనులందరు భక్తితో పాటిస్తూ.. వన దేవతలను పూజిస్తారు.























