Sanjeev Goenka Behavior with LSG Captains | సంజీవ్ గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ | ABP Desam
ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోవడం కంటే ఈ టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకా ప్రవర్తన చర్చనీయాంశంగా మారుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్ తర్వాత రిషభ్ పంత్ను గోయెంకా అందరి ముందే మందలించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే, గోయెంకా ఇలా ప్రవర్తించడం ఇది మొదటిసారి కాదు. గతంలో ధోనీ, కెఎల్ రాహుల్ విషయంలోనూ ఆయన ఇలాగే వ్యవహరించిన ఫోటోలు బయటకు వస్తున్నాయి.
గతంలో రైజింగ్ పూణే సూపర్జెయింట్స్ జట్టుకు యజమానిగా ఉన్నప్పుడు, ఎంఎస్ ధోనీని కెప్టెన్సీ నుండి తప్పించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత లక్నో కెప్టెన్గా ఉన్న కెఎల్ రాహుల్ను గ్రౌండ్లోనే అందరి ముందు తిడుతున్న వీడియో పెను సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే తరహాలో రిషభ్ పంత్ మరియు కోచ్ జస్టిన్ లాంగర్పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తుంటే, గోయెంకా తన పాత అలవాటును మార్చుకోలేదని అభిమానులు మండిపడుతున్నారు.
గోయెంకా ప్రవర్తనపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఘాటుగా స్పందించారు. "సంజీవ్ గోయెంకా ఒక మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నారు. వెంటనే ఆయనపై నిషేధం విధించి, ఫ్రాంచైజీని వెనక్కి తీసుకోవాలి" అని బీసీసీఐని కోరారు. మరికొంతమంది మాజీ ప్లేయర్స్ కూడా ఇదే తరహాలో స్పందించారు
అయితే, లక్నో టీమ్ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఎడిట్ చేసినవని, గోయెంకా పంత్తో కేవలం మ్యాచ్ గురించి చర్చిస్తున్నారని క్లారిటీ ఇస్తూ వీడియోను విడుదల చేసింది. కానీ ఫ్యాన్స్ మాత్రం ఆ వీడియోను నమ్మట్లేదు. సినిమాల్లొలాగా మళ్ళి సీన్ రీ క్రియేట్ చేసి పోస్ట్ చేసారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ అవగానే కెప్టెన్ ను ఓనర్ తిట్టారు. అప్పుడు స్టేడియంలో ఫ్యాన్స్ ఉన్నారు. కానీ LSG రిలీజ్ చేసిన క్లారిఫికేషన్ వీడియోలో మాత్రం వెనక ఎవరు లేరు అంటూ మండిపడుతున్నారు.























