CM Mamata Banerjee SIR Supreme Court | SIR పై పోరాడేందుకు సుప్రీంలో గళం విప్పిన మమత | ABP Desam
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR ద్వారా తమ రాష్ట్రం పశ్చిమ బెంగాల్ లో లక్షలాది ఓట్లు అన్యాయంగా తొలగిస్తున్నారంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. SIR పై అత్యున్నత న్యాయస్థానంలో సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో స్వయంగా పాల్గొన్నారు మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ న్యాయవాదులతో పాటు తను కూడా తన వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లిన మమతా బెనర్జీ...తను లా చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. లాయర్ గా నల్ల గౌను వేయకపోయినా మెడలో నల్లటి స్కార్ఫ్ కట్టుకుని న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరైన మమతా బెనర్జీ...ముందుగా ధర్మాసనంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ బాగ్చీ, జస్టిస్ పంచోలికి నమస్కరిస్తూ తన వాదనలు కూడా వినాలని విన్నవించుకున్నారు. ప్రభుత్వ తరపున న్యాయవాదులు వినిపిచాల్సిన కేసులో ముఖ్యమంత్రి నేరుగా కలుగ చేసుకోలేరని ఎన్నికల సంఘం తరపున న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేయగా...తను ఆ రాష్ట్రానికి చెందిన సామాన్య మహిళా ఓటరుగా తనకు ఆ అర్హత ఉందని చెప్పారు మమతా బెనర్జీ. సీఎం మమతను మాట్లాడేందుకు ధర్మాసనం అవకాశం ఇచ్చింది. చాలా నెలలుగా SIR పై పోరాటం చేస్తున్నా న్యాయం తలుపుల వెనుకాలే ఉండిపోతుందన్న మమతా బెనర్జీ...ఇప్పటికే ఇదే అంశంపై తను కేంద్ర ఎన్నికల సంఘానికి ఆరు లెటర్లు రాశానని...కానీ జవాబే రాలేదంటూ ఆవేదనను వ్యక్తం చేశారు. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చి ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన తనకే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు సామాన్యులకు న్యాయం ఎలా అందుతుందని మమత ప్రశ్నించారు. ఇష్యూ డైవర్ట్ కాకుండా ఉండేలా ప్రభుత్వం తరపున న్యాయవాదులను మాట్లాడాలని ధర్మాసనం కోరగా...మమతా తనకు కనీసం ఐదు నిమిషాలు అవకాశం ఇవ్వాలని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం 15 నిమిషాల సమయం ఇస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పాలనకున్న విషయాన్ని చెప్పొచ్చని ధర్మాసనం అనుమతినిచ్చింది. SIR అనేది ఓట్లు తీసేయటానికి తప్ప..చేర్చటానికి ఉన్నట్లు లేదని తన అభిప్రాయం చెప్పిన మమతా కేంద్ర ఎన్నికల సంఘం వాట్సప్ కమిషన్ గా మారిపోయిందన్నారు. పెళ్లైన మహిళలు ఇంటి పేరు మారితే ఓటర్ కార్డులు తీసేస్తున్నారని ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. బెంగాల్ లో ఆధార్ కార్డ్ మాత్రమే ఐడీ ప్రూఫ్ గా చూపించాలని అడుగుతున్నారని మిగిలిన ఏ రాష్ట్రంలోనూ ఆధార్ మాత్రమే చూపించాలని అడగటం లేదని మమత తెలిపారు. బెంగాల్ ను మాత్రమే టార్గెట్ చేసి కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు పని చేస్తోందని మమత ప్రశ్నించగా....ఆధార్ మీద ఇప్పుడు ఈ కేసులో కామెంట్స్ చేయలేమని ధర్మాసం పేర్కొంది. ప్రతీ సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది..ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించే విధంగా ధర్మాసనానికి సమయం ఇవ్వాలని కోరిన సీజేఐ...అర్హుడైన ఏ ఓటరుకు, అమయాకులైన ప్రజలకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇవ్వటంతో మమతా బెనర్జీ ధర్మాసనానికి నమస్కరించి వెనుదిరిగారు.






















