Chetla tandra Lakshmi Narasimha Temple | అరటిగెలల మహోత్సవం చూడాలనుకుంటున్నారా.? | ABP Desam
ఇక్కడ వరుసగా పందిరికి వేలాడుతున్న అరటిగెలలు చూశారా. ఏంటి ఇదేదో డెకరేషన్ అనుకునేరా...పోనీ అమ్మకానికి పెట్టారు అనుకుంటున్నారా రెండూ కాదు...వందల సంఖ్యలో పందిరికి వేలాడుతున్న ఈ అరటి గెలలన్నీ ఇక్కడి దేవుడికి భక్తులు చెల్లించుకునే మొక్కు.
అవును అరటిపళ్ల గెలలే మొక్కులుగా దేవుడికి సమర్పించే ఆచారం ప్రత్యేకంగా ఉన్న ఈ ఆలయం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర గ్రామంలో కనిపిస్తుంది. ఇక్కడ కొలువైన లక్ష్మీ నరసింహస్వామికి ఏటా భీష్మఏకాదశి రోజు ఇలా అరటిగెలల మహోత్సవం నిర్వహిస్తారు భక్తులు
చెట్ల తాండ్ర గ్రామంలో వెలసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎదురుగా ఓరావి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు పక్కన వేసిన పందిర్లకు ఇలా అరటిగెలలను నైవేద్యంగా పెట్టి భక్తులు కోరికలు కోరుకుంటారు. రెండువందల ఏళ్ల క్రితం ఈ గ్రామంలో ఓ స్వామీజీ ఉండే వారంట . ఆయన గ్రామంలో ఉంటూ అక్కడ గ్రామస్థులకు వైద్యం చేసేవాడు . అలా డైబ్బై ఏళ్ల పాటు గ్రామంలో వైద్యం చేసిన స్వామీజీ కొన్నాళ్ల తర్వాత పరమపదించారు . ఐతే స్వామీజీ పరమపదించిన తర్వాత గ్రామంలో ఓ రావిచెట్టు వెలిసింది . అప్పటి నుండి ఇక్కడ గ్రామస్థులు రావి చెట్టును స్వామీజీ స్వరూపంగా భావించి పూజించడం ప్రారంభించారు . ఇలా రావిచెట్టును పూజించి మనసులోని కోరుకున్న కోర్కెలు తీర్చేస్తుండటంతో ఆ రావి చెట్టుకు అరటి గెలలు పెట్టి పూజిస్తున్నారు ఇక్కడ గ్రామస్తులు . స్వామీజీ బతికి ఉన్నంత కాలం అరటి పళ్లను మాత్రమే తినేవారట . అందుకే ఆయనకు అందరూ అరటిపళ్లను ప్రసాదంగా పెడుతున్నారమంటున్నారు గ్రామస్తులు .
భీష్మ ఏకాదశి నాడు అరటి గెలలు రావి చెట్టు వద్ద పెట్టి ఏదైనా కోరుకుంటే,ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుందని భక్తుల నమ్మకం . అయితే ప్రతి ఏడాది రావి చెట్టు చుట్టూ అరటి గెలలు కట్టేస్తుండడంతో అక్కడ స్థలాభావ సమస్య తలెత్తడంతో గ్రామస్తులు రావి చెట్టుకు ఆనుకుని పెద్ద పందిర్లను ఆలయ అధికారులు ఏర్పాటు చేయటం ప్రారంభించారు. భక్తులు వారు తీసుకువచ్చిన అరటిగెలలను ఓ క్రమ పద్దతిలో పందిర్లకి కట్టి కోర్కెలు కోరుకోవడం కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది . కొందరు ముందే లక్ష్మీనరసింహ స్వామిని మొక్కుకుని గెలలు కడితే మరికొందరు కోరిన కోర్కెలు నెరవేరిన తర్వాత గెలలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు.ఇలా కట్టిన గెలలకు ఆలయ కమిటీ ప్రతినిధులు నంబరింగ్ ఇస్తారు . మరునాడు అక్కడి మళ్ళీ వెళ్లి స్లిప్ చూపిస్తే వారు కట్టిన గెలను తిరిగి ప్రసాదంగా ఇస్తారు . ఆ గెలలను ఇంటికి తీసుకువచ్చి భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు . బందువులకు స్నేహితులకు కూడా పంచి పెడుతుంటారు. ఏటా చెట్ల తాండ్రలో భీష్మ ఏకాదశి రోజున ఈ పండుగ సంప్రదాయ బద్దంగా జరుగుతుంది. చెట్లతాండ్ర గ్రామస్తులే కాకుండా చుట్టు ప్రక్కల గ్రామాల వారు కూడా ఇదే ఆనవాయితీని పాటిస్తున్నారు.























