BRS Politics: బీఆర్ఎస్ టార్గెట్ ఎవరు? నోరు మెదపని గులాబీ బాస్, అయోమయంలో పార్టీ క్యాడర్
Telangana News | కేంద్రంలో ఉన్న బీజేపీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మధ్య బీఆర్ఎస్ నలిగిపోతున్నట్లు పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. బీజేపీని టార్గెట్ చేయకపోతే మూడో స్థానంలో బీఆర్ఎస్.

KCR Politics | రాజకీయాల్లో మౌనం కూడా ఓ భాషే అంటారు రాజకీయ విశ్లేషకులు. మౌనం చాాలా సమస్యలకు పరిష్కారం అంటారు. మౌనం అనేక భావాలకు ప్రతీక అని ఎవరికి నచ్చిన భావాన్ని వారు తీసుకోవచ్చని కూడా అంటారు. రాజకీయ మౌనం పాటిస్తూ.. అప్పుడప్పుడు పార్టీ క్యాడర్ కు సంకేతాలు పంపుతున్న గులాబీ బాస్ కేసీఆర్ తీరు ఆ పార్టీలో చర్చకు దారి తీస్తోంది. ఎందుకంటే గతంలో ద్విముఖ పోటీగా తెలంగాణ రాజకీయాలు ఉండేవి. అందులో నెంబర్ వన్ పార్టీగా బీఆర్ఎస్, ఆ తర్వాతి స్థానాల కోసం కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడ్డాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నెంబర్ గేమ్ మారింది. పోటీలోకి బీజేపీ వచ్చింది. బీఆర్ఎస్ ది రెండో స్థానమో లేక మూడో స్థానమో తెలియని పరిస్థితి ఉంది. సాంకేతికంగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలను బట్టి చూస్తే బీఆర్ఎస్ ది రెండో స్థానం. కాని ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలను బట్టి గులాబీ పార్టీ ఏ స్థానంలో ఉంది అన్న ప్రశ్న తలెత్తుతోంది.
తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాలు
పదేళ్ల అధికార రాజకీయాలు సాగించిన బీఆర్ఎస్ కు గత శాసన సభ ఎన్నికల్లో గట్టి దెబ్బ తగిలింది. ముచ్చటగా మూడో సారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ రికార్డ్ కొడదామనుకున్న కారు పార్టీకి కాంగ్రెస్ బ్రేకులు వేసి అధికార పీఠాన్ని తన్నుకుపోయింది. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు గెలవలేక చతికల పడింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 8 ఎంపీలు గెలిస్తే, బీజేపీ కూడా మిగతా 8 ఎంపీలను గెలుపించుకోగలిగింది. ఎం.ఐ.ఎం పార్టీ ఒక స్థానంలో గెలిచింది. పార్లమెంట్ లో గులాబీ ప్రాతినిధ్యమే లేకపోయిన పరిస్థితి. మరో వైపు బీజేపీ క్రమ క్రమంగా తన బలం పెంచుకుంటూ వస్తోంది. ఇటీవల జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరిగితే రెండు స్థానాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదని బీజేపీ గెలుచుకుంది. ఈ గెలుపు అటు కాంగ్రెస్ ను, ఇటు బీఆర్ఎస్ ను షాక్ కు గురిచేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను బీజేపీ గెలిపించుకుంది, పార్లమెంట్ ఎన్నికల్లో 8 మందిని గెలిపించుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరిని ఇలా బీజేపీ క్రమ క్రమంగా చాప కింద నీరులా తెలంగాణలో తన బలం పెంచుకుంటూ పోతోంది.
పోటీ ఎవరితో అన్న మీమాంసలో గులాబీ దళం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను బీజేపీ గెలుచుకోవడం ఇప్పుడు బీఆర్ఎస్ లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఎంపీ ఎన్నిల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సాయం చేసిందన్న చర్చ ఓ వైపు నడుస్తోంది. ఇది నిజమా కాదా అన్న అయోమయంలో గులాబీ క్యాడర్ ఉంది. ఒక వేళ అదే నిజం అయితే బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటి అన్న ప్రశ్నలను పార్టీలోని లీడర్లు వారితో పాటు క్యాడర్ సంధిస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ఏడాదిగా రాజకీయాలు చేస్తున్నాం, మరో వైపు బీజేపీ ప్రతీ ఎన్నికల్లో తన బలం పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. అటు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు బీఆర్ఎస్ గెల్చుకోలేకపోయింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు బరిలోకే దిగలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ రెండో స్థానంలో ఉండి బీఆర్ఎస్ మూడో స్థానం కోసం పోటీ పడాల్సి వస్తుందన్న నిరాశలో పార్టీ నేతలు, శ్రేణులు ఉన్నాయి. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీల మధ్య బీఆర్ఎస్ నలిగిపోతున్నట్లు పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
మౌనం పాటిస్తున్న గులాబీ బాస్
గత ఏడాదిగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోంది. బీజేపీని మాత్రం చూసీ చూడనట్లు గులాబీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఏడాది కాంగ్రెస్ పాలన తర్వాత ఆ పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ వ్యతిరేక పవనాలు బీఆర్ఎస్ వైపు కాకుండా బీజేపీకి లాభం చేకూరేలా ఉన్నాయన్న చర్చ సాగుతోంది. కాంగ్రెస్ వ్యతిరేకతను రాజకీయ లబ్ధిగా మార్చుకునే విషయంలో గులాబీ పార్టీ వెనకపడిందన్న అభిప్రాయం పార్టీ ముఖ్య నేతల వద్ద గులాబీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టకపోవడం పైన విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే కేసీఆర్ ముందుఈ విషయాలను ప్రస్తావించేందుకు ముఖ్య నేతలు ప్రస్తావించినా గులాబీ బాస్ మౌనం దాల్చినట్లు సమాచారం. ఇప్పటికైనా పార్టీ అధినేతగా క్యాడర్ కు బీజేపీ విషయంలో అనుసరించాల్సిన వ్యూహం బహిర్గతం చేయకపోతే రానున్న రోజుల్లో రాజకీయ ఇబ్బందులు తప్పవని ముఖ్యనేతలు సైతం అభిప్రాయపడుతున్నారు.
బీజేపీని దూకుడుగా ఎదుర్కోకపోతే మూడో స్థానంలో నిలవాల్సిన పరిస్థితి కారు పార్టీకి ఏర్పడుతుందని చెబుతున్నారు. అయితే ఏప్రిల్ 27 పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా వరంగల్ లో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ ద్వారా అయినా పార్టీకి టార్గెట్ పార్టీ ఏంటి, మళ్లీ అధికారంలోకి రావాలంటే ఎలాంటి వ్యూహంతో సాగాలన్న స్పష్టత గులాబీ బాస్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇలాగే బీజేపీ విషయంలో మౌనం పాటిస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆపార్టీకి అడ్డుకట్ట వేయడం కష్టమని ఇది రాజకీయంగా పెద్ద దెబ్బ అవుతుందని, ఆ తర్వాత గులాబీ పార్టీ నుండి కమలం పార్టీకి నేతలు వలస వెళ్లే అవకాశం లేకపోలేదని విశ్లేషిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

