Crime News: అమెరికా జైలులో తెలుగు వ్యక్తి ఆత్మహత్య.. ఆలస్యంగా విషయం వెలుగులోకి
ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడి, మరికొందరిని లైంగికంగా బెదిరించిన కేసులో అమెరికా జైలులో శిక్ష అనుభవిస్తున్న తెలుగు వ్యక్తి జైలులోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Telugu Man Suicide in US Prison: అమెరికాలో ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో అమెరికా జైలులో శిక్ష అనుభవిస్తున్న తెలుగు వ్యక్తి కుర్రెముల సాయికుమార్(31) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్లకు చెందిన సాయికుమార్ శిక్ష అనుభవిస్తూ జులై 26న జైలులోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
15 ఏళ్ల వయసున్న బాలుడిగా నటిస్తూ.. బాలికలపై అత్యాచారం
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లుట్లకు చెందిన కుర్రెముల ఉప్పలయ్య, శోభ దంపతుల పెద్ద కుమారుడు సాయికుమార్ దశాబ్దం క్రితం అమెరికాకు వలస వెళ్లాడు. ఒక్లహామా రాష్ట్రంలోని ఎడ్మండ్ అనే ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ భార్యతో కలిసి జీవించేవాడు. ఈ క్రమంలోనే తాను 15 ఏళ్ల వయసున్న బాలుడిగా నటిస్తూ.. స్థానికంగా ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు సాయికుమార్. అంతే కాదు, తనతో లైంగిక సంబంధానికి అంగీకరించని మరో 19 మంది బాలికల అసభ్య చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బెదిరించాడు.
35 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
ఈ మేరకు బాధితులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2023 అక్టోబర్లో పోలీసులు సాయికుమార్ను అరెస్ట్ చేసి, విచారణ ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, వీడియోల పరిశీలనలో బాలికలపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడినట్లు గుర్తించారు. దీంతో ఈ కేసులో దోషిగా తేలిన సాయికుమార్కు ఈ ఏడాది మార్చి 27న అమెరికా కోర్టు 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
జులై 26న జైలులోనే సూసైడ్
ఈ క్రమంలోనే జైలు శిక్ష అనుభవిస్తూ మానసిక వేదనకు గురైన సాయికుమార్ జులై 26న జైలులోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న సాయికుమార్ తండ్రి ఉప్పలయ్య, కుటుంబ సభ్యులు అమెరికాకు వెళ్లి అక్కడే అంత్యక్రియలు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది.





















