Sirpur Urea Lorry: సిర్ఫూర్లో బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్న యూరియా - ఒక లారీని పట్టుకున్న పోలీసులు - ఎవరి పని ?
Urea: సిర్పూర్ లో రైతులకు అందాల్సిన యూరియా పక్కదారి పట్టింది. ఒక లారీని పోలీసులు పట్టుకున్నారు. తెలియకుండా ఎన్నిలారీలు బ్లాక్ మార్కెట్ కు తరలిపోయాయో అని రైతులు ఆగ్రహిస్తున్నారు.

Sirpur Black Market Urea: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి ) మండలంలోని భూపాలపట్నం గ్రామంలో ప్రైవేట్ డీలర్ అర్ధరాత్రి యూరియా లోడ్ ను దింపేసి యూరియాను ఇతరులకు పంపిణీ చేస్తుండగా సిర్పూర్ పోలీసులు పట్టుకున్నారు. లారీని కాగజ్ నగర్ డీఎస్పీ కార్యాలయానికి లారీ తరలించారు. కాగజ్ నగర్ లోని కనకదుర్గ ట్రేడింగ్ కంపెనీ నుండి యూరియా కొనుగోలు చేసినట్లు ఇన్వాయిస్ ఉందంటున్న వ్యవసాయ అధికారులు. అర్థరాత్రి ఎందుకు పంపిణీ చేశారనే దానిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అర్ధరాత్రి యూరియా పంపిణీ చేస్తున్న సదరు డీలర్ పై తగు చర్యలు తీసుకుంటామని కాగజ్ నగర్ ఏడీఏ మనోహర్ తెలిపారు.
రైతులకు అందాల్సిన యూరియాపై స్థానిక బిజెపి ఎంపీ ఎమ్మెల్యేలు కేంద్రంపై ఒత్తిడి పెంచకుండా కాంగ్రెస్ ముఖ్యమంత్రినీ పొగడ్తలతో ముంచెత్తడం పరిపాటిగా మారిందని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం దోప్టాలలోని, రంకం గ్రామానికి చెందిన కుడిమెత మాధవరావ్ అనే రైతుని స్థానిక పోలీసులు ఇబ్బందులకు గురి చేయడంపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న స్పందిస్తూ వారి గ్రామానికి చేరుకొని కుడిమెత మాధవరావ్ తో పాటు గ్రామ రైతులను కలిసి పరామర్శించారు. యూరియా పంపిణీలో మాధవరావ్ పై జరిగిన దౌర్జన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. రైతులు అధైర్య పడవద్దని ధైర్యం కల్పించారు.
యూరియా పంపిణీలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై స్థానికులు జోగు రామన్నతో వెళ్లగట్టారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. యూరియా పంపిణీలో పోలీసులు టోకన్లు పంపిణీ చేయడం పై మండిపడ్డారు. వ్యవసాయ అధికారులతో పాటు పోలీసులు రైతు కుటుంబం నుండే వచ్చి విధులు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. రైతుల పట్ల మర్యాదగా నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యూరియా పంపిణీలో పోలీసుల వ్యవహారంపై జిల్లా ఎస్పీనీ కలిసి వివరిస్తామన్నారు. ఆదిలాబాద్ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న యూరియా పై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ కేంద్రంతో సంప్రదింపులు జరపకుండా కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పొగడ్తల్లో ముంచడం వీరికి పరిపాటిగా మారిందన్నారు. రైతుల పక్షాన మరోసారి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలతో పాటు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణలో పలు చోట్ల రైతులకు యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు. అయితే అసలు యూరియా మాత్రం కావాల్సినంతగా కేంద్రం నుంచి రావడ లేదు. వచ్చిన యూరియాను కూడా కొంత మంది అక్రమార్కులు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చోట్లా ఇలా లారీలు పట్టుబడటంతో.. రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.





















