![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Telangana News: అద్దె బస్సుల యజమానులతో ఆర్టీసీ చర్చలు సఫలం - రేపటి నుంచి యథావిధిగా బస్సులు
TSRTC News: రాష్ట్రంలో అద్దె బస్సుల యజమానులతో ఆర్టీసీ చర్చలు సఫలమయ్యాయి. దీంతో శుక్రవారం నుంచి యథాతథంగా బస్సులు నడపనున్నట్లు ప్రకటించారు.
![Telangana News: అద్దె బస్సుల యజమానులతో ఆర్టీసీ చర్చలు సఫలం - రేపటి నుంచి యథావిధిగా బస్సులు tsrtc talks with hire buses owners successful and cessation of strike Telangana News: అద్దె బస్సుల యజమానులతో ఆర్టీసీ చర్చలు సఫలం - రేపటి నుంచి యథావిధిగా బస్సులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/04/69f830e00b8caddd458e7239d6a229a71704354075758876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tsrtc Talks Successful With Hire Bus Owners: రాష్ట్రంలో అద్దె బస్సుల యజమానులతో ఆర్టీసీ (TSRTC) చర్చలు సఫలమయ్యాయి. బస్ భవన్ లో (BUS Bhawan) గురువారం సంస్థ ఎండీ సజ్జనార్ (Sajjanar) తో అద్దె బస్సుల యజమానులు సమావేశమై చర్చించారు. అద్దె బస్సు ఓనర్లు కొన్ని సమస్యలు తమ దృష్టికి తెచ్చారని సజ్జనార్ తెలిపారు. వారం రోజుల్లో వాళ్ల సమస్య పరిష్కారానికి ఓ కమిటీ వేస్తామని చెప్పారు. దీనిపై అద్దె బస్సుల యజమానులు సానుకూలంగా స్పందించారు. రేపటి నుంచి యాథావిధిగా అద్దె బస్సులు నడుస్తాయని, సంక్రాంతికి కూడా ఉచిత బస్సు సర్వీసులు ఉంటాయని.. స్పెషల్ బస్సులు నడుపుతామని సజ్జనార్ స్పష్టం చేశారు.
ఇదీ జరిగింది
రాష్ట్రంలో 'మహాలక్ష్మి' పథకం కింద ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో, పల్లె వెలుగు బస్సుల్లో డిసెంబర్ 9 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బస్సుల్లో రద్దీ పెరిగింది. ప్రయాణికుల సంఖ్య రెండింతలు అయ్యింది. ముఖ్యంగా ఎక్స్ ప్రెస్ బస్సులు, గ్రామాలకు వెళ్లే చివరి బస్సుల్లో రద్దీ మరీ ఎక్కువగా ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లో బస్సుల కిటీకీల్లోంచి సైతం మహిళా ప్రయాణికులు ఎక్కుతున్నారు. ఫుట్ బోర్డుల వద్ద సైతం వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో అద్దె బస్సుల యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయంటూ వాపోయారు. కేఎంపీఎల్ కూడా రావడం లేదని, అందుకే సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించారు. బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులు వెళ్లడంతో టైర్లు వేడెక్కి పేలే అవకాశం ఉంది. కమాన్ కట్టలపై అధిక లోడు పడి విరిగే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్ఎంకు నోటీసులిచ్చారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి వినతి పత్రం సమర్పించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అయితే, గురువారం సంస్థ ఎండీ సజ్జనార్ వారిని పిలిపించి సమస్యలపై చర్చించారు. సమస్యలు పరిష్కరిస్తామన్న సజ్జనార్ హామీతో వారు సమ్మెకు వెళ్లాలన్న నిర్ణయాన్ని విరమించుకున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 2,700 అద్దె బస్సులు నడుస్తున్నాయి.
సంక్రాంతికి ప్రత్యేక బస్సులు
మరోవైపు, సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి 4,484 ప్రత్యేక బస్సులను నడిపేలా టీఎస్ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకూ హైదరాబాద్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 626 బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. భాగ్యనగరం నుంచి ఏపీకి రద్దీ దృష్ట్యా 1,450 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు.
రూ.10 కోట్ల జీరో టికెట్లు
అటు, రాష్ట్రంలో 'మహాలక్ష్మి' పథకం విజయవంతంగా అమలవుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ స్కీం కింద ఇప్పటివరకూ 6.50 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు సాగించినట్లు తెలుస్తుండగా, మంత్రులు అధికారులు, సిబ్బందిని అభినందించారు. టీఎస్ఆర్టీసీకి పూర్తి సహకారాలు అందిస్తామని, సిబ్బందికి రావాల్సిన బకాయిలు, సంస్థ అప్పులు, పీఎఫ్, ఇతర సెటిల్ మెంట్లకు సంబంధించిన నిధులపై సమీక్షించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రతి రోజూ 27 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని, దాదాపు రూ.10 కోట్ల విలువైన జీరో టికెట్లు మంజూరు చేస్తున్నామని అధికారులు వివరించారు. సంస్థను బలోపేతానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై ఆలోచిస్తున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. లాజిస్టిక్స్, కమర్షియల్, తదితర టికెటేతర ఆదాయంపైనా దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read: CM Jagan: కేసీఆర్ ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్ - ఆరోగ్య పరిస్థితిపై ఆరా
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)