Rythu Bharosa Scheme: రైతులకు గుడ్న్యూస్.. రెండో విడత రైతుభరోసా నిధుల విడుదలపై ప్రకటన
Second Phase of Rythu Bharosa | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 20న కాటారం సభ వేదికగా రెండో విడత రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నారు. దాదాపు 45 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.

Second Phase of Rythu Bharosa: CM Revanth Reddy to Release Funds on April 20
హైదరాబాద్: రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతు భరోసా నిధుల విడుదలపై అప్డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 20వ తేదీన రెండో విడత రైతుభరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని స్వయంగా ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 45,11,947 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో మొత్తం రూ.5,653 కోట్ల నిధులు జమ కానున్నాయని అధికారులు తెలిపారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే తొలి విడత రైతుభరోసా నిధులను విజయవంతంగా పంపిణీ చేసింది. మార్చి 22న సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన బహిరంగ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి విడత నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.3,590 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు రెండో విడత నిధుల విడుదలతో సాగు పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్న రైతులకు పెద్ద ఉపశమనం కలగనుంది.
త్వరలో రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ పూర్తి..
మార్చి 22న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, సన్న బియ్యానికి రూ.500 బోనస్ ఇచ్చిన ఘనత తమదేనని పేర్కొన్నారు. పెట్టుబడి సాయం కింద తొలి విడతగా 70 లక్షల మంది రైతులకు రూ.3,600 కోట్లు విడుదల చేశామని, ఈ నిధులు రేపటిలోగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. మిగిలిన రూ.5,400 కోట్లను రెండు విడతలుగా (ప్రతి 20 రోజులకు రూ.2,700 కోట్లు) జమ చేసి, మొత్తం 45 రోజుల్లోగా ఎకరానికి రూ.6,000 చొప్పున మొత్తం రూ.9,000 కోట్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఎన్నికల హామీ మేరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకే (DBT) నిధులు చేరుస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలోని లోపాలను సవరించి, అర్హులైన ప్రతి చిన్న, సన్నకారు మరియు కౌలు రైతుకు ఈ సాయం అందేలా పక్కా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం కోట్లాది మంది రైతులకు పెద్ద ఊరటనిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. నిధుల జమను పర్యవేక్షించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు.
గత ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వం రైతుల కోసం రెట్టింపు ఖర్చు చేస్తోందని గణాంకాలను వివరించారు. బీఆర్ఎస్ హయాంలో నెలకు సగటున రూ.2,533 కోట్లు ఖర్చు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు సగటున రూ.5,500 కోట్లు వెచ్చిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ ఉచిత విద్యుత్, రుణమాఫీ, రైతు బీమా, రైతు భరోసా వంటి పథకాలకు వెనకడుగు వేయకుండా ఇప్పటి వరకు రూ.1.30 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు.
తెలంగాణ వరి సాగులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, గత ఏడాది 2.58 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించామని సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించాలని కోరారు. ముఖ్యంగా మెదక్, నిజామాబాద్ రైతులు గతంలో పసుపు, చెరుకు బాగా పండించేవారని గుర్తు చేస్తూ.. ప్రస్తుతం రాష్ట్రంలో పామాయిల్ సాగు 3 లక్షల ఎకరాలకు చేరిందని, దీనిని 10 లక్షల ఎకరాలకు పెంచినా ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు.
ట్రెండింగ్ వార్తలు






















