![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
SSC Exams: తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు - ఈసారి ఆరు పరీక్షలు మాత్రమే!
SSC Exams: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. పదకొండ పేపర్లకు బదులుగా ఈ ఏడు నుంచి 6 పేపర్ల విధానాన్ని అమల్లోకీ తీసుకవచ్చారు.
![SSC Exams: తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు - ఈసారి ఆరు పరీక్షలు మాత్రమే! SSC Exams Started in Telangana And Andhra Pradesh Check Details SSC Exams: తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు - ఈసారి ఆరు పరీక్షలు మాత్రమే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/03/b904f62cba073e147ddf34f12284b0371680503515119519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
SSC Exams: తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈరోజు పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.30 గంటలకు మొదలైన పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగనుంది. అయితే గతంలో పదో తరగతి విద్యార్థులకు మొత్తం పదకొండ పరీక్షలు ఉండేవి. కానీ ఈసారి 11 పేపర్ల విధానాన్ని తొలగించి 6 పేపర్ల విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. అంటే ఈసారి విద్యార్థులు కేవలం 6 పరీక్షలు మాత్రమే రాయబోతున్నారు. తెలంగాణలో మొత్తం 4 లక్షల 94 వేల 620 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ రాష్ట్రంలో మొత్తం 3,349 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హాల్ టికెట్ ఆధారంగా విద్యార్థులను ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణానికి అవకాశం కల్పించారు. ఉదయం 8.30 గంటల నుచే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు. పదో తరగతి పరీక్షల సెంటర్ల వద్దకు వచ్చిన విద్యార్థులు, మరో వైపు వారి తల్లిదండ్రులతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది.
ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కొనసాగనున్న ఈ పరీక్షలను ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు 3 గంట పాటు నిర్వహించనున్నారు. అయితే సైన్స్, కాంపోజిట్ పేపర్లకు మాత్రం 20 నిమిషాలు అదనపు సమయాన్నిస్తారు. ఇక పేపర్ లీకేజీని అరికట్టడంలో భాగంగా పరీక్షాకేంద్రాల్లో సెల్ఫోన్లపై నిషేధం విధించారు. ఈ ఏడాది 11,456 పాఠశాలలకు చెందిన విద్యార్థులకు పరీక్షలు రాయబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 144 సిట్టింగ్ స్కాడ్లను రంగంలోకి దింపారు.
ఈ విద్యా సంవత్సరంలో 6 పేపర్లకే పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షా కేంద్రాలు తెలుసుకోవడానికి ‘సెంటర్ లోకేషన్’ యాప్ను రూపొందించారు. విద్యార్థులు సివిల్ డ్రెస్సులోనే పరీక్షలకు హాజరుకావాలని అధికారులు పేర్కొన్నారు. పరీక్షలు సజావుగా సాగేందుకు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నారు. ఈ కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్, స్టేషనరీ దుకాణాలను మూసివేయించనున్నారు. విద్యార్థులు www.bseteleangana.bov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లను పరీక్షకు అనుమతించనున్నట్లు అధికారులు సూచించారు.
'పది' పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు, నిమిషం ఆలస్యమైనా 'నో' ఎంట్రీ - అయితే?
ఏపీలో ఏప్రిల్ 3 నుండి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రత్యేక కారణం ఉంటే తప్ప పదో తరగతి పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. హాల్టికెట్ ఆధారంగా విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అయితే ఈ సారి ఏడు ప్రాంతీయ భాషలలో రాయనున్నారు. విద్యార్థులు రాష్ట్ర భాషా వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ తెలుగు, ఇంగ్లిష్, కన్నడ, తమిళం, హిందీ, ఉర్దూ, ఒడియా భాషల్లో పరీక్షలు రాయనున్నారు. ఎండల తీవ్రతల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సెంటర్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాగేందుకు మంచి నీటితో పాటు మరిన్ని సదుపాయాలను కల్పించారు. విద్యార్థులు హాల్టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కూడా కల్పించారు. కాకపోతే విద్యార్థులు త్వరగా కేంద్రాల వద్దకు చేరుకుంటే మంచిదని సూచించారు. అప్పుడే ఎలాంటి టెన్షన్ లేకుండా పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)