BRS Latest News: బీఆర్ఎస్కిది పోరాటనామ సంవత్సరం - వరంగల్ సభకు దండులా కదలి రావాలి: కేటీఆర్
BRS Latest News :బీఆర్ఎస్కి ఇది పోరాటనామ సంవత్సరమని కేటీఆర్ ప్రకటించారు. ఈ పోరాటాలకు ఏప్రిల్ 27న తొలి అడుగు పడుతుందని సూర్యపేటలో అన్నారు.

BRS Latest News : బీఆర్ఎస్ సిల్వర్జూబ్లీ వేడుకలు విజయవంతం చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణవ్యాప్తంగా టూర్ ప్లాన్ చేశారు కేటీఆర్. మొదట సూర్యపేట నుంచి ప్రారంభించారు. అక్కడ జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్... అధికారం పోయినా ప్రజల్లో మాత్రం టన్నుల కొద్ది అభిమానం అలాగే ఉందన్నారు. ప్రతీ తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యంగా గులాబీ జెండాయే అన్నారు. ఈ సంవత్సరం అంతా బీఆర్ఎస్ పోరాటనామ సంవత్సరమే ప్రకటించారు. పోరాటాలకు ఏప్రిల్ 27న తొలి అడుగు పడబోతుందన్నారు.
తెలంగాణవ్యాప్తంగా పంటలు ఎండిపోవడానికి కాలం తెచ్చిన కరవు కంటే కాంగ్రెస్ తెచ్చిన కరవే కారణమన్నారు కేటీఆర్. కేసీఆర్ మీద ద్వేషంతో మేడిగడ్డ చిన్న పర్రెను రిపేరు చేయించకుండా గోదావరి నీళ్లు ఆంధ్రాకు వదిలేస్తున్నారని అన్నారు. ఎస్ఎల్ బీసీ ప్రమాదం జరిగితే ఒక మంత్రి పోయి చేపల కూర వండించుకొని తిన్నాడని విమర్శించారు. ప్రతీ గ్రామం నుంచి వరంగల్ సభకు కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. గులాబీ జెండా కప్పుకున్న ప్రతి బిడ్డ వరంగల్ రావాలన్నారు.
"కాంగ్రెస్ కంచర గాడిదలను చూసిన తర్వాతనే ప్రజలకు కేసీఆర్ గొప్పతనం తెలిసింది. కర్కశంగా పాలిస్తున్న కాంగ్రెస్ నుంచి విముక్తి కల్పించేందుకు మళ్లీ బిఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. దశాబ్దాలపాటు తెలుగు వాళ్ళను మదరాసీలు అని పిలిచేది. దాన్ని మార్చిన నాయకుడు NTR. దేశంలో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారని చెప్పిన నాయకుడు. ఈ దేశంలో తెలంగాణకు ఒక ప్రత్యేక అస్తిత్వం ఉందనీ, తెలంగాణ అనే పౌరుషాల గడ్డ ఉందని ఎలుగెత్తి చాటిన నాయకుడు కేసీఆర్."
"భారతదేశ స్వాతంత్ర చరిత్రలో 25 ఏళ్లు విజయవంతంగా కొనసాగుతున్న అతికొద్ది పార్టీల్లో బిఆర్ఎస్ ఒకటి. కెసిఆర్ మోకాలు ఎత్తుకు కూడా సరిపోనీ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. వాన పాములు నాగుపాముల లెక్క బుసలు కొడుతున్నాయి. తమ స్థాయి మరచి గ్రామ సింహాలు కూడా కేసీఆర్ మీద మాట్లాడుతున్నాయి."
" కెసిఆర్ లేకపోతే గులాబీ జెండా లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థుల పోరాటాలకు కేసీఆర్ నాయకత్వం తోడై విజయం సాధించాం. 25 ఏళ్ల పార్టీ చరిత్రలో మొదటి 14 ఏళ్ల ఉద్యమ పార్టీగా విశ్వరూపాన్ని చూపించాం. ప్రజాస్వామ్యబద్దంగా డిమాండ్లు నెరవేర్చుకోవచ్చని దేశ ప్రజలకు నిరూపించిన పార్టీ బిఆర్ఎస్. అధికారంలోకి వస్తే పేదల కోసం ఎలా పనిచేయవచ్చో పదేండ్లపాటు చూపిస్తూ తెలంగాణను నెంబర్వన్ చేసిన నాయకత్వం కేసీఆర్ది."
" ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో ప్రజల పక్షాన ఎలుగెత్తి పోరాడుతున్న ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్. ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం ఈ గులాబీ జెండా. మాకు ఉద్యమం కొత్త కాదు అధికారం కొత్త కాదు ప్రతిపక్ష పాత్ర కొత్త కాదు. తిరిగి అధికారంలోకి రావాలని కోరుకోవడం మాకోసం కాదు ప్రజల కోసం. చరిత్రలో ఒక అనివార్యమైన సందర్భంలో బీఆర్ఎస్ పుట్టింది. తెలంగాణ బాగు కోసం మాత్రమే మళ్ళీ అధికారం కోరుకుంటున్నాం. కర్కశంగా పాలిస్తున్న కాంగ్రెస్ పీడ నుంచి తెలంగాణ ప్రజలను కాపాడేందుకే మళ్లీ బిఆర్ఎస్ అధికారంలోకి రావాలి. ఫీనిక్స్ పక్షిలాగా బిఆర్ఎస్ క్యాడర్ కదం తొక్కుతున్నారు. ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడకుండా పోరాడుతున్న గులాబీ సైన్యానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా."
"చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి పర్సనాలిటీ పెంచుకోవడం మీద కంటే పర్సంటేజీలు పెంచుకోవడం మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఢిల్లీకి మూటలు పంపి పదవిని కాపాడుకునే ధ్యాస తప్ప రేవంత్కు వేరే ఉద్దేసం ఏం లేదు."
"అసూయ, ద్వేషం, ఆశ ఈ మూడు అంశాలే బిఆర్ఎస్ ఓటమికి కారణం. యూట్యూబ్ను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయిన సన్నాసి రేవంత్ రెడ్డి ఇవాళ అదే యూట్యూబ్ జర్నలిస్టులను బట్టలూడదీసి కొడతా అంటున్నాడు. 100కు 100% రుణమాఫీ చేశామని నిరూపిస్తే మా పదవులను వదిలిపెడతామని చెప్తే ఇప్పటిదాకా ఆ సవాల్ కాంగ్రెస్ నాయకులు ఎవరు స్వీకరించలేదు. రైతులకు రావాల్సిన 37 వేల కోట్ల రూపాయలు ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఖర్గే ఖాతాల్లో టింగు టింగుమనీ పడుతున్నాయి."
"కాంగ్రెస్ సన్నాసులను నమ్మితే రైతుబంధుకి రామ్రామ్ అయితదని ముందే చెప్పిండు కేసీఆర్. నీళ్ల మంత్రి, నల్లగొండలోని ఉన్నా చుక్కనీరు తేలేకపోతున్నారు. ఎస్ ఎల్ బి సి ప్రమాదం జరిగితే ఒక మంత్రి పోయి చేపల కూర చేపించుకొని తిన్నాడు. అధికారం మాత్రమే పోయింది ప్రజల్లో అభిమానం మాత్రం అలాగే ఉంది. చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది గాడిదని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది. అట్లనే కాంగ్రెస్ కంచర గాడిదలను చూసిన తర్వాతనే ప్రజలకు కేసీఆర్ గొప్పతనం తెలిసి వచ్చింది."
" కెసిఆర్ ఉన్నప్పుడు వచ్చిన నీళ్లు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎందుకు రావడం లేదని అడిగితే ఏ ఒక్క కాంగ్రెస్ నేత సమాధానం చెప్పడం లేదు. కెసిఆర్ కట్టిన కాలేశ్వరం నుంచి నీళ్ళు రాకపోతే మరిప్పుడు కాంగ్రెస్ కట్టిన ఎస్సారెస్పీ నుంచి నీళ్లు ఎందుకు రావడం లేదు. కెసిఆర్ మీద ద్వేషంతో మేడిగడ్డ చిన్న పర్రెను రిపేర్ చేయకుండా గోదావరి నీళ్లు ఆంధ్రకు వదిలేస్తున్నారు."
"ఇవాళ తెలంగాణవ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయి. అంటే కాలం తెచ్చిన కరవు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరవే కారణం. రేవంత్ రెడ్డి పాపమే రైతన్నకు శాపంలా మారింది. కృష్ణానదిలో 36% నీళ్లను కేసీఆర్ ప్రభుత్వం వాడుకుంది. కానీ ఈ కాంగ్రెస్ సన్నాసుల ప్రభుత్వం 24% నీళ్లను కూడా వాడుకోలేదు. నీళ్లు వాడుకునే తెలివి లేదు. నీటిని పొదుపు చేసుకునే తెలివి లేదు. చెరువులను నింపే తెలివి లేదు. భూగర్భ జలాలను పెంచే తెలివి లేదు."
" కాంగ్రెస్ వైఫల్యాలను బిజెపి ప్రశ్నించదు. బడే భాయ్ మోడీ చోటే బాయ్ రేవంత్ మధ్య ఆ అండర్స్టాండింగ్ ఉంది. తెలంగాణకు గొంతుగా బిఆర్ఎస్ ఉండొద్దని కాంగ్రెస్ బిజెపి ఉమ్మడి లక్ష్యం. కెసిఆర్ తెలంగాణ పక్షం కాంగ్రెస్ బిజెపి ఢిల్లీ పక్షం. రేవంత్ రెడ్డి అవినీతిని ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోవడం లేదు."
"ఒక్కొక్క గ్రామం నుంచి బండ్లు కట్టుకుని వరంగల్ సభకు సూర్యాపేట, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రజలు తరలి రావాలి. కాంగ్రెస్ బిజెపి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాల్సిన సందర్భం ఏప్రిల్ 27. మరొక్కసారి గులాబీ సైన్యం కదం తొక్కాలి."
"శాసనసభ అందరిదీ అన్న జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తే, గాంధీభవన్ లెక్క సభను నడుపుతున్నారని అన్న అక్బరుద్దీన్ ఓవైసీ మీద చర్యలు తీసుకోలేదు. మజ్లిస్ మీద చర్య తీసుకునే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా?"
ప్రతి గ్రామం నుంచి వరంగల్ సభకు కార్యకర్తలు తరలి రావాలి. గులాబీ జెండా కప్పుకున్న ప్రతి బిడ్డ వరంగల్ రావాలి. వరంగల్ సభ తర్వాత మే నెలలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుంది. కొత్త కమిటీలను పటిష్టంగా నిర్మించుకుందాం. గ్రామస్థాయి వార్డు స్థాయి , బూత్ స్థాయి ,రాష్ట్ర కమిటీ దాకా అద్భుతంగా కమిటీలను ఏర్పాటు చేసుకుందాం."
" కష్టకాలంలో పార్టీనే నమ్ముకొని ఉన్న వారికే పెద్దపీట వేస్తాం. వారికే అవకాశాలు ఇస్తాం. చిన్న పెద్ద అనే తేడా పార్టీలో లేదు. పార్టీ ఆఫీసులను చైతన్య కేంద్రంగా మార్చుకొని కార్యకర్తలకు అద్భుతంగా శిక్షణ ఇస్తాం. "
" చివరి సంవత్సరంలో ఏదో ఒక పథకం ఇచ్చినట్టు చేస్తే ప్రజలు తమనే మళ్లీ గెలిపిస్తారన్న నమ్మకంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఈ విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా గులాబీ కార్యకర్తలే చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే కెసిఆర్ లాగా ప్రతీ కార్యకర్త కథానాయకుడులాగా విజృంభించాలి. ఏప్రిల్ 27 నాడు దానికి తొలి అడుగు పడాలి. ఈ సంవత్సరం అంతా టిఆర్ఎస్ పోరాటనామ సంవత్సరం."
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

