KCR: సిట్ ఎదుట హాజరుకే కేసీఆర్ మొగ్గు - భారీ నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పిలుపు
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. విచారణకు భయపడుతున్నారన్న విమర్శలు రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

KCR to appear before SIT : తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉత్కంఠకు తెరపడింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించుకున్నారు. పార్టీ కీలక నేతలు , న్యాయ నిపుణులతో ఎర్రవల్లి ఫామ్హౌస్లో నిర్వహించిన సుదీర్ఘ చర్చల అనంతరం ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడా అవకాశం ఇవ్వకూడదని, చట్టాన్ని గౌరవిస్తూనే ప్రజాక్షేత్రంలో గట్టి సమాధానం చెప్పాలని గులాబీ దళం భావిస్తోంది. ఆదివారం సాయంత్రం 3 గంటలకు నందినగర్ నివాసంలో విచారణ జరగనుండటంతో, కేసీఆర్ ఆదివారం ఉదయమే ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు.
తెలంగాణ ఆత్మగౌరవ నినాదం- రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు
కేసీఆర్ విచారణను కేవలం ఒక దర్యాప్తుగా కాకుండా, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవంపై జరిగిన దాడిగానే బీఆర్ఎస్ అభివర్ణిస్తోంది. తెలంగాణ సాధించిన ఉద్యమ నేతను కావాలనే అవమానిస్తున్నారని మండిపడుతున్న పార్టీ శ్రేణులు, ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. మున్సిపల్ ఎన్నికల ముంగిట కావాలనే కుట్రపూరితంగా ఈ విచారణలు సాగిస్తున్నారని, రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ రాజకీయ కక్షసాధింపు అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
కేటీఆర్, హరీష్ రావు వాంగ్మూలాల ఆధారంగా విచారణ
సిట్ అధికారులు ఇప్పటికే ఈ కేసులో కీలకమైన సమాచారాన్ని సేకరించారు. గత కొన్ని రోజులుగా కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు, వారి నుంచి సేకరించిన వాంగ్మూలాలు, గతంలో ఐదుగురు పోలీస్ అధికారులు ఇచ్చిన వాగ్మూలాల ఆధారంగా కేసీఆర్ కోసం ప్రత్యేక ప్రశ్నావళిని సిద్ధం చేశారు. అసలు ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఇంటెలిజెన్స్ సమాచారం ఎవరెవరికి చేరింది అనే అంశాలపై అధికారుల ప్రశ్నలు ప్రధానంగా ఉండనున్నాయి. 65 ఏళ్లు పైబడిన వ్యక్తి కాబట్టి ఆయన నివాసంలోనే విచారించేందుకు అధికారులు 160 CrPC కింద నోటీసులు జారీ చేశారు.
ఇప్పుడు తెలంగాణలో అభివృద్ధి జరగాల్సింది పోయి, డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి.
— BRS Party (@BRSparty) January 31, 2026
కేసీఆర్ గారు పదిహేనేళ్లుగా ఎర్రవెల్లి నివాసంలో ఉంటున్నారు, ఆయన ఎక్కడ ఉంటారో ప్రజలందరికీ తెలుసు.
సిట్ అధికారులకు కేసీఆర్ గారి అడ్రస్ తెలియదా?
కాంగ్రెస్ మంత్రులు కూడా రెండు సందర్భాల్లో కేసీఆర్… pic.twitter.com/Oe6GEfT9jC
పోలీసుల భారీ బందోబస్తు
ఈ హై-ప్రొఫైల్ విచారణ , బీఆర్ఎస్ ఆందోళనలకు పిలుపునివ్వడంతో నందినగర్ చుట్టూ భద్రతా వలయాన్ని పోలీసులు ఏర్పాటు చేయనున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో, శాంతిభద్రతల దృష్ట్యా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి నందినగర్ వెళ్లే దారులన్నీ పోలీసుల ఆధీనంలోకి వెళ్లనున్నాయి. ఆదివారం జరగబోయే ఈ విచారణ ఫలితం తెలంగాణ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.























