Karimngar Politics: కరీంనగర్ మేయర్ ఎన్నికలో బిగ్ ట్విస్ట్.. పోటీ నుండి బీఆర్ఎస్ దూరం! బీజేపీదే పీఠం
Karimngar corporation Mayor Election | కరీంనగర్ మేయర్ ఎన్నికలో బీఆర్ఎస్ ట్విస్ట్ ఇచ్చింది. పోటీ నుంచి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించడంతో బీజేపీకి ఆశలు చిగురించాయి.

కరీంనగర్: తెలంగాణలో నేడు జరుగుతున్న మున్సిపల్ చైర్మన్, మేయర్ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఏ పార్టీకి మెజార్టీ రాని హంగ్ మున్సిపాలిటీల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పీఠం దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కరీంనగర్ మున్సిపల్ పీఠం హాట్ టాపిక్ అవుతోంది. ఎలాగైనా తామే దక్కించుకుంటామని కాంగ్రెస్ అంటోంది. అయితే తమకే మద్దతు ఉందని బీజేపీ చెబుతోంది. ఈ క్రమంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. మేయర్ ఎన్నికల ప్రక్రియలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అనూహ్యంగా కూటమి నుండి బయటకు వస్తున్నట్లు ప్రకటించిన బీఆర్ఎస్, ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. బీఆర్ఎస్ తీసుకున్న ఈ నిర్ణయం బీజేపీకి పెద్ద ఊరటనిచ్చింది.
బీజేపీకి లైన్ క్లియర్
బీఆర్ఎస్ పోటీ నుండి తప్పుకోవడంతో భారతీయ జనతా పార్టీ (BJP)కి మేయర్ పీఠం దక్కించుకోవడానికి చాన్స్ దక్కింది. బీఆర్ఎస్ తటస్థంగా వ్యవహరిస్తూ ఓటింగ్ కు దూరం కావడంతో బీజేపీ అభ్యర్థి విజయం దాదాపు ఖాయమైనట్లు కనిపిస్తోంది.
ఎన్నికల నిబంధనల ప్రకారం
ప్రస్తుత నిబంధనల ప్రకారం, సభకు హాజరైన సభ్యులలో 51 శాతం ఓట్లు సాధించిన అభ్యర్థిని మేయర్గా ప్రకటిస్తారు. బీఆర్ఎస్ సభ్యులు గైర్హాజరైతే లేదా ఓటింగ్లో పాల్గొనకపోతే, సభలో ఉన్న బలాబలాల ఆధారంగా మేయర్ ఎంపిక జరుగుతుంది. ఈ క్రమంలో మెజారిటీ ఓట్లు సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది.
కరీంనగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లలో బీజేపీ 30 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీఆర్ఎస్ ఎన్నికకు దూరం కావడంతో బీజేపీకి సగానికి పైగా కార్పొరేటర్లు ఉన్నారు కనుక మేయర్ పీఠం దక్కించుకునే అవకాశం ఉంది. అయితే బీజేపీ కార్పొరేటర్లు, ఇండిపెండెంట్స్ ను తమవైపునకు తిప్పుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టిన నిరాశే ఎదురవుతోంది.
























