Jagital: జగిత్యాల కాంగ్రెస్లో ఫలితాల తర్వాతా అదే పీటముడి - సంజయ్, జీవన్ రెడ్డి వర్గాలు కలిస్తేనే పీఠం !
Sanjay VS Jeevan Reddy: మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా జగిత్యాలలో సీన్ మారలేదు. జీవన్ రెడ్డి, సంజయ్ వర్గాలు రెండూ 18 కౌన్సిలర్ సీట్లను గెల్చుకున్నాయి.

Telangana Municipal Election Results 2026: జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపాయి. మొత్తం 50 వార్డులకుజరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 23 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, స్పష్టమైన మెజార్టీ 26 స్థానాలు అవసరం కావడంతో విజయానికి స్వల్ప దూరంలో నిలిచిపోయింది. అయితే, పార్టీ సాధించిన ఈ 23 స్థానాల్లోనూ అంతర్గత చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం నుండి 14 మంది, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గం నుండి 9 మంది కౌన్సిలర్లు విజయం సాధించడంతో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది.
రెండు వర్గాల నుంచి స్వతంత్రులు గెలుపు
ఈ ఎన్నికల్లో 15 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలవడం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. విచిత్రమేమిటంటే, ఈ స్వతంత్రులలో కూడా గ్రూపు రాజకీయాలు స్పష్టంగా ఉన్నాయి. గెలిచిన 15 మంది స్వతంత్రులలో 9 మంది జీవన్ రెడ్డి వర్గానికిచెందిన వారు కాగా, 4 గురు ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చెందిన వారు. మిగిలిన స్థానాల్లో బీఆర్ఎస్ 6, బీజేపీ 4, ఎంఐఎం 2 చోట్ల విజయం సాధించాయి. ఈ లెక్కల ప్రకారం చూస్తే, కాంగ్రెస్ అధికారిక అభ్యర్థులు, మద్దతుదారులైన స్వతంత్రులను కలిపితే పార్టీకి తిరుగులేని మెజార్టీ ఉంది, కానీ వర్గపోరు ఆ మెజార్టీని ప్రశ్నార్థకం చేస్తోంది.
మున్సిపల్ పీఠం కోసం మళ్లీ రెండు వర్గాల పోరు
ప్రస్తుత పరిస్థితుల్లో మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారింది. జీవన్ రెడ్డి వర్గానికి చెందిన కౌన్సిలర్లు మొత్తం పద్దెనిమిది మంది ఉన్నారు. వీరిలో 9 మంది కాంగ్రెస్ పార్టీ తరపున.. 9 మంది స్వతంత్రులుగా గెలిచారు. ఎమ్మెల్యే ఎమ్మెల్యే సంజయ్ వర్గం కూడా పద్దెనిమిది మంది ఉన్నారు. వీరిలో 14 మంది కాంగ్రెస్ , నలుగురు స్వతంత్రులు ఉన్నారు. తమ వర్గం వారికే చైర్మన్ పదవి దక్కాలని ఇద్దరు నేతలు పట్టుబట్టే అవకాశం ఉండటంతో జగిత్యాల రాజకీయం హీటెక్కింది. ఇప్పటికే పార్టీ జెండాను మోసిన వారికే చైర్మన్ పీఠం ఇవ్వాలని జీవన్ రెడ్డి గళమెత్తారు.
ఇద్దరి పోరాట రాజకీయం కంటిన్యూస్
ఈ వర్గ పోరాటం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని కాంగ్రెస్ అధిష్టానం ఆందోళన చెందుతోంది. ఒకవేళ ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి రాకపోతే, చైర్మన్ ఎన్నిక సమయంలో అది రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉంది. సొంత పార్టీ నేతల మధ్య సమన్వయం కుదర్చడం ఇప్పుడు పీసీసీ పెద్దలకు ఒక సవాలుగా మారింది. స్వతంత్రుల మద్దతు ఎటువైపు ఉంటే వారికే చైర్మన్ పీఠం దక్కే అవకాశం ఉండటంతో, రాబోయే రోజుల్లో జగిత్యాల పురపాలక సంఘంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.























