IT raids on Mallareddy:మెడికల్, ఇంజినీరింగ్ సీట్ల కోసం కోట్ల వసూళ్ల ఆరోపణలు - మల్లారెడ్డి ఫ్యామిలీపై మరోసారి ఐటీ ఎటాక్
Mallareddy Colleges: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పై మరోసారి ఐటీ ఎటాక్ జరిగింది.ఆయనకు సంబంధించిన ఇళ్లు, కాలేజీల్లో సోదాలు జరుగుతున్నాయి.

IT attack on BRS MLA Mallareddy: మల్లారెడ్డి విద్యా సంస్థల ఓనర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లు, విద్యాసంస్థల్లో సోదాలు చేస్తున్నారు. ఇంజనీరింగ్,మెడికల్ సీట్ల కోసం విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేశారనే ఫిర్యాదులురావడంతో మల్లారెడ్డి కుమారుడు భద్ర రెడ్డి, ప్రీతి రెడ్డి ఇళ్లలో కొనసాగుతున్నాయి.
మల్లారెడ్డికి చెందిన ఇళ్లు కాలేజీల్లో సోదాలు
మల్లారెడ్డి యాజమాన్యంలోని మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలు , ఇతర విద్యాసంస్థల్లో కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల నుంచి అడ్మిషన్ల కోసం భారీ మొత్తంలో నగదు వసూలు చేసినట్లు ఫిర్యాదులు ఐటీ శాఖకు అందాయి. ఈ లావాదేవీలు ఆదాయపు పన్ను రికార్డులలో సరిగా నమోదు కాలేదని ఐటీ శాఖ గుర్తించింది.దీంతో కొంపల్లిలో మల్లారెడ్డి కుమారుడు చింతల భద్ర రెడ్డి ఇంటిపై ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాలు భారీ నగదు లావాదేవీలకు సంబంధించిన గోప్య సమాచారం ఆధారంగా ప్రారంభమయ్యాయి. భద్ర రెడ్డి, అతని భార్య ప్రీతి రెడ్డితో సహా కుటుంబ సభ్యులను అధికారులు ప్రశ్నించారు. ఇటీవలి ఆన్లైన్ , నగదు లావాదేవీల వివరాలను సేకరించారు.
కన్వీనర్ కోటా సీట్లను భారీ మొత్తాలకు అమ్ముకున్నారన్న ఫిర్యాదులు
హైదరాబాద్లోని కొంపల్లిలో భద్ర రెడ్డి నివాసంతో పాటు, సూరారంలోని మల్లారెడ్డి హాస్పిటల్స్ , మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు లెక్కల్లో లేని నగదును స్వాధీనం చేసుకుంది. సోదాల సమయంలో, అధికారులు సిబ్బంది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, ఇంటి లోపలే ఉండాలని సూచించారు. ఈ సోదాలు ఆర్థిక లావాదేవీలు, ముఖ్యంగా విద్యాసంస్థల ఫీజులు , సీట్ల కేటాయింపుకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నారు.
2022లో సుదీర్ఘంగా సోదాలు నిర్వహించిన ఈడీ
గతంలో కూడా మల్లారెడ్డి కుటుంబానికి చెందిన ఆస్తులపై ఐటీ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. 2022 నవంబర్లో కూడా మల్లారెడ్డి మరియు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో దాదాపు 8 కోట్ల రూపాయల లెక్కల్లో లేని నగదు , బంగారం స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లోవరుసగా నాలుగైదు రోజుల పాటు సోదాలు జరిగాయి.
అప్పట్లో మల్లారెడ్డి ఈ ఆరోపణలను ఖండించారు. తమ విద్యాసంస్థలు, హాస్పిటల్స్, మరియు ఆస్తులకు సంబంధించిన అన్ని వివరాలను ఐటీ అధికారులకు అందజేసినట్లు చెప్పారు. అన్ని అనుమతులతో తమ సంస్థలను నడుపుతున్నామని అక్రమంగా ఎలాంటి వసూళ్లు చేయడం లేదన్నారు.
ఐటీ దాడులు జరగలేదు !
మాజీ మంత్రి మల్లారెడ్డి,అతని కుమారుడు భద్రా రెడ్డి,కోడలు ప్రీతి రెడ్డి ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని వచ్చిన వార్తలు అవాస్తవమని మల్లారెడ్డి విశ్వ విద్యా పీఠ్ వైస్ చైర్మన్ ప్రీతి రెడ్డి స్పష్టత ఇచ్చారు 2022 లో కాళోజీ రావు యూనివర్సిటీ పీజీ సీట్ల విషయంలో తమ కళాశాల పై వేసిన కేసు విషయంలో వరంగల్ పోలీసులు వచ్చి విచారణ లో భాగంగా నోటీస్ ఇచ్చారు అని తెలిపారు. పొద్దున 6 గంటలకు పోలీసులు రావడంతో అందరూ ఐటీ అధికారులు వచ్చినట్లు ప్రచారం జరిగిందని…ఈ విషయంలో తమ యూనివర్సిటీ లో అడ్మిషన్స్ అన్ని సక్రమంగా జరిగాయని…ఎప్పడు కూడా విద్యార్థుల విషయంలో అవకతవకలు జరగకుండా చూడటంలో మల్లారెడ్డి యూనివర్సిటీ జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు.





















