Revanth Reddy: కులగణనలో తెలంగాణ రోల్ మోడల్ - ముస్లింలను సాకుగా చూపి అడ్డం పడుతున్న బీజేపీ - రేవంత్ కీలక వ్యాఖ్యలు
Caste census: కులగణనలో దేశానికి ఆదర్శంగా ఉన్నామని రేవంత్ రెడ్డి అన్నారు. 2029 లోక్సభ ఎన్నికలు ఓబీసీ రిజర్వేషన్లకు లిట్మస్ టెస్ట్గా నిలుస్తాయని అన్నారు.

Caste census Issue: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో తెలంగాణలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు సెప్టెంబరు నెలాఖరులోగా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని సూచించిందని గుర్తు చేశారు. నెలాఖరులోగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించిందన్నారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
కేంద్రానిదే ఆలస్యం
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ శాసనసభ పూర్తిస్థాయిలో చర్చించి ఆమోదించిన రెండు బిల్లులను ఆమోదించడంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు బిల్లుల ఆమోదానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేలను గురువారం ఉదయం కలిసి వివరిస్తామని తెలిపారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ ప్రభుత్వం చేసిన రెండు బిల్లుల ఆమోదానికి పట్టుపడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ శాసనసభలో బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ, ఎంఐఎం మద్దతు పలికాయని సీఎం గుర్తుచేశారు. బీసీలకు రిజర్వేషన్లను అడ్డుకునేందుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ ముస్లింలను సాకుగా చూపుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న మహారాష్ట్రలోనూ ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని... బీజేపీ నేతలకు దమ్ముంటే ఆ రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించాలని సీఎం సవాల్ విసిరారు. గుజరాత్లో ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని... ఇక ముందు అమలు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, బీజేపీ నేతలు అందుకు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అని సీఎం ప్రశ్నించారు.
అసెంబ్లీలోనే ఆమోదించాం !
తెలంగాణలో సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్యా, రాజకీయ మరియు కుల సర్వే ప్రక్రియను 2024, ఫిబ్రవరి 4న మొదలు పెట్టి 2025, ఫిబ్రవరి 4వ తేదీ నాటికి పూర్తి చేసి శాసనసభలోనూ ఆమోదించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకే తెలంగాణలో ఫిబ్రవరి 4ను సామాజిక న్యాయ దినోత్సవంగా (సోషల్ జస్టిస్ డే) జరుపుతున్నామని తెలిపారు. సర్వే వివరాలను స్వతంత్ర నిపుణుల సలహా కమిటీకి ఇచ్చామని, వారు దానిపై చర్చించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారని ముఖ్యమంత్రి తెలిపారు. ఆ నివేదికను మంత్రివర్గంలో చర్చించి శాసనసభలో ప్రవేశపెడతామని వెల్లడించారు. సర్వే చేసినప్పటికీ వ్యక్తిగత వివరాలు వెల్లడించకూదని... అది వ్యక్తిగత డేటా ప్రైవసీ యాక్ట్కు విరుద్ధమని సీఎం ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
2029 లోక్సభ ఎన్నికలు ఓబీసీ రిజర్వేషన్లకు లిట్మస్ టెస్ట్
కుల గణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికి రోల్మోడల్గా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కుల గణన చేపట్టమని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించిన బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేపట్టాక తమను అనుసరిస్తూ కుల గణనకు గెజిట్ విడుదల చేసిందన్నారు.. తెలంగాణ వేసిన రోడ్ మ్యాప్ను దేశవ్యాప్తంగా కుల గణన సేకరణకు కేంద్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని సీఎం సూచించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ తాము అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని తెలంగాణలో ప్రకటించారని, ఆయన ప్రకటించినట్లుగానే తెలంగాణలో అధికారంలోకి రాగానే కుల గణన చేపట్టామని తెలిపారు. రాబోయే 2029 లోక్సభ ఎన్నికలు ఓబీసీ రిజర్వేషన్లకు లిట్మస్ టెస్ట్గా నిలుస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతు బిల్లుల రద్దు విషయంలోనూ తొలుత మొండికేసిన బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు వంచి రద్దు చేయించామని... కుల గణన విషయంలో తమ మార్గంలో నడిచేలా చేశామని సీఎం తెలిపారు. ఈడబ్ల్యూఎస్ కు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతోనే 50 శాతం రిజర్వేషన్ల పరిమితి అంశం పక్కకు పోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.




















