![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Elections 2024: ఏపీ, తెలంగాణ సీఎస్ల కీలక భేటీ, ప్రశాంత ఎన్నికల కోసం కీలక నిర్ణయాలు
AP Elections 2024: హైదరాబాద్ లోని డా.బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కెఎస్. జవహర్ రెడ్డి, శాంతి కుమారి అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది.
![Elections 2024: ఏపీ, తెలంగాణ సీఎస్ల కీలక భేటీ, ప్రశాంత ఎన్నికల కోసం కీలక నిర్ణయాలు Telangana AP states Chief secretaries conducts reviews meet over Peacefull Elections in Telugu states Elections 2024: ఏపీ, తెలంగాణ సీఎస్ల కీలక భేటీ, ప్రశాంత ఎన్నికల కోసం కీలక నిర్ణయాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/15/f6ea67951155141deabe286dfd5f07321713194974304234_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana Elections 2024: ఏపీలో జరగనున్న అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు.. తెలంగాణలో రాబోయే సాధారణ ఎన్నికల కోసం కసరత్తు జరుగుతోంది. ఎన్నికలను పారదర్శకంగా, ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు మరింత సమన్వయంతో పని చేయాలని తెలుగు రాష్ట్రాలు నిర్ణయించాయి. ఈ మేరకు సోమవారం (ఏప్రిల్ 15) హైదరాబాద్ లోని డా.బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో అంతర్ రాష్ట్ర ఎన్నికల సంబంధిత అంశాలపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డా.కెఎస్. జవహర్ రెడ్డి, శాంతి కుమారిల అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ.. మే 13 న జరిగే పోలింగ్ ను సక్రమంగా నిర్వహించేందుకు ఇప్పటికే సరిహద్దు రాష్ట్రాల పరిధిలోని జిల్లా కలెక్టర్లు,వివిధ శాఖల ఉన్నతాధికారుల సమన్వయ సమావేశాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.అక్రమ మద్యం,ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వివిధ వస్తువుల రవాణా,మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలకు అడ్డుకట్ట వేశామని తెలిపారు. శాంతి భద్రతల పరిస్థితి కూడా పూర్తిగా అదుపులో ఉందని ఇదే రకమైన వాతావరణాన్ని పోలింగ్ పూర్తయ్యే వరకు మరింత పకడ్బందీగా కొనసాగేలా ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయి సమావేశం దోహద పడుతుందని పేర్కొన్నారు. గోవా,కర్ణాటక తదితర రాష్ట్రాల నుండి అక్రమ మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులు రాష్ట్రంలోకి అక్రమంగా రవాణా కాకుండా ఆయా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న చెక్-పోస్టులలో మరింత అప్రమత్తత అవసరమని అన్నారు.ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వం పోలీస్ శాఖ ద్వారా 36 అంతరాష్ట్ర చెక్-పోస్టులు, ఆటవీ శాఖకు సంబంధించి మూడు అంతరాష్ట్ర చెక్ పోస్టులు,ఎక్సయిజ్ శాఖ ద్వారా ఎనిమిది,224 ఎన్ఫోర్స్మెంట్ బృందాలు, వాణిజ్య పన్నుల ద్వారా 7 చెక్-పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటలపాటు పటిష్టమైన గస్తీని ఏర్పాటు చేశామని వివరించారు.తెలంగాణలో తీవ్రవాద ప్రాబల్యం లేదని, చత్తీస్గఢ్ నుండి మావోయిస్టుల కార్యకలాపాలు జరుగకుండా ఇరురాష్ట్రాల పోలీసులు,కేంద్ర పోలీస్ బలగాల మధ్య పటిష్టమైన సమన్వయంతో పని చేస్తున్నామని సిఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు.
ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ శాసన సభ, లోక్ సభ స్థానాలకు మే 13న ఒకేసారి ఎన్నికలు జరగనున్నందున ఎన్నికలను స్వేచ్ఛగా శాంతి యుతంగా నిర్వహించేందుకు తెలంగాణాతో కలిసి పూర్తి స్థాయి సమన్వయంతో కృషి చేస్తున్నామన్నారు.ఆంధ్రప్రదేశ్ లో అక్రమ మద్యం,గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నిరోధానికి ఆపరేషన్ పరివర్తన పేరిట చేపట్టిన స్పెషల్ డ్రైవ్ సత్ఫాలితాలను ఇచ్చిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తోఉన్న వివిధ రాష్ట్ర సరిహద్దుల్లో పలు శాఖల ద్వారా 129 పైగా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.ఓటర్లను ప్రలోబ పెట్టేందుకు అక్రమ మద్యం రవాణా,డబ్బు పంపిణీ,వివిధ వస్తువుల రవాణాను నియంత్రించేందుకు ఈ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ద్వారా పటిష్టమైన నిఘా చర్యలు చేపట్టామని తెలిపారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మంచి సమన్వయంతో పని చేస్తున్నాయని సిఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవి గుప్త, అడిషనల్ డీజీలు శివధర్ రెడ్డి, మహేష్ భగవత్, ఏపీ అడిషనల్ డీజీ డా.శంకబ్రత బాగ్చి, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.రజత్ భార్గవ, తెలంగాణ పీసీసీఎఫ్ ఆర్.ఎం.దొబ్రియెల్, ఏపీ పీసీసీఎఫ్ చిరంజీవి చౌదరి తదితర అధికారులు హాజరయ్యారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)