Telangana Rising Global Summit: నేడు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం.. ఫ్యూచర్ సిటీలో అద్భుతమైన ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
Telangana Rising Global Summit 2025 | భారత్ ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Bharat Future City | హైదరాబాద్: తెలంగాణలో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి వివరించి, పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రెండు రోజుల పాటు నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత అద్భుతమైన ఏర్పాట్లను పూర్తి చేసింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు 44కు పైగా దేశాల నుంచి ఏకంగా 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవ్యాప్తంగా పేరెన్నికగల కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్లో పాల్గొంటుండగా, ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నారు.
సమ్మిట్ ప్రారంభించనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ లాంఛనంగా ఈ సమ్మిట్ను ప్రారంభిస్తారు. సుమారు రెండు వేల మంది దేశ, విదేశీ అతిథులు ఈ ప్రారంభ వేడుకకు హాజరవుతున్నారు. ఈ సమ్మిట్లో వివిధ కీలక అంశాలపై నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఈఓ జెరెమీ జుర్గెన్స్, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్-షా వంటి ప్రముఖులు ప్రసంగించనున్నారు.

మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఆయన తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రత్యేకతలను ఆహుతులకు వివరించనున్నారు. ఈ రెండు రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెషన్లు జరుగుతాయి, ఇందుకు వీలుగా సెమినార్ హాళ్లను అధికారులు సిద్ధం చేశారు.
Hon’ble Chief Minister Shri @revanth_anumula warmly welcomes all delegates participating in the #TelanganaRisingGlobalSummit2025, an event being held as the State undertakes major efforts to accelerate economic growth and strengthen its position globally.
— Telangana CMO (@TelanganaCMO) December 7, 2025
With development and… pic.twitter.com/zA3GEU7Z7I
సాంస్కృతిక ప్రదర్శనలు, టూరిజం ప్రచారం
సదస్సుకు వచ్చిన అంతర్జాతీయ, దేశీయ అతిథులు, పెట్టుబడిదారులకు తెలంగాణతో పాటు హైదరాబాద్ ప్రత్యేకతలు తెలిసేలా ప్రభుత్వం విస్తృత ప్రచార సామాగ్రిని సిద్ధం చేసింది. ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వేదిక వరకు వివిధ రూపాల్లో ప్రదర్శనలు ఉంటాయి. అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీతో ప్రత్యేకంగా ప్రచార ఏర్పాట్లు చేశారు. లైటింగ్ ప్రొజెక్షన్, 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్, ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డులో ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా విభిన్న ప్రదర్శనలు ఉంటాయి. చర్చలు పూర్తయిన తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీత కచేరి అతిథులను అలరించనుంది. అలాగే తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడీ, ఒగ్గు డొల్లు, పేరిణి నాట్యం, బోనాల ప్రదర్శనతో సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. మరోవైపు, దౌత్య బృందం నాగార్జున సాగర్ సమీపంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్ పార్కు అయిన బుద్ధవనం పర్యటనకు వెళ్లేలా టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ప్రత్యేక ఆతిథ్యం, హైదరాబాద్ బిర్యానీ
సదస్సు జరిగే రెండు రోజులూ హాజరైన అందరికీ పసందైన హైదరాబాదీ బిర్యానీతో పాటు, తెలంగాణ ప్రసిద్ధ వంటకాలతో భోజనాలను అందించేందుకు వంటశాలలు సిద్ధమయ్యాయి. అంతేకాకుండా, అతిథులకు తెలంగాణ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేలా, ప్రభుత్వం తరపున గ్లోబల్ సమ్మిట్ డెలిగేట్లకు ప్రత్యేక సావనీర్లతో కూడిన బహుమతిని అందించనున్నారు. ఈ సావనీర్లలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగో, పోచంపల్లి ఇక్కత్ శాలువా, చేర్యాల కళాకృతులు, హైదరాబాదీ అత్తర్, మరియు ముత్యాలతో కూడిన నగలను పొందుపరుస్తారు. దీంతో పాటు, తెలంగాణకే ప్రత్యేకమైన వంటలైన ఇప్ప పువ్వు లడ్డు, సకినాలు, చెక్కలు, బాదం కీ జాలి, నువ్వుల ఉండలు, మక్క పేలాలతో కూడిన మరో ప్రత్యేక బాస్కెట్ను కూడా అతిథులకు మంచి ఆతిథ్యాన్ని అందించనున్నారు.
ట్రెండింగ్ వార్తలు























