Hyderabad Crime News: హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
నల్గొండలో చోరీలకు పాల్పడిన నిందితుడు భూష్మి శ్రీకాంత్పై హైదరాబాద్ ORR వద్ద తప్పించుకోబోతుండగా పోలీసులు కాల్పులు జరిపారు. గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు.

Hyderabad ORR | హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో మంగళవారం కాల్పులు కలకలం రేపాయి. నల్గొండ జిల్లా కేంద్రంతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ఒక నిందితుడు హైదరాబాద్లో ఉన్నట్లు నల్గొండ సీసీఎస్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల బృందం అతడిని పట్టుకునేందుకు మంగళవారం హైదరాబాద్కు చేరుకుంది.
ఆదిభట్ల పరిసరాల్లోని హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద నిందితుడిని పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో నిందితుడు వారిపై ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలోనే పోలీసులు ఆత్మరక్షణ కోసం అతడిపై కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో గాయపడిన నిందితుడిని ఆంధ్రప్రదేశ్కు చెందిన భూష్మి శ్రీకాంత్గా పోలీసులు గుర్తించారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం వనస్థలిపురంలోని ఆసుపత్రికి తరలించారు.
నిందితుడి నేర చరిత్ర
పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో నిందితుడిపై నాలుగేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ను హత్య చేసిన కేసులో ఇతడు ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. పదికి పైగా దొంగతనాల కేసులు ఉన్నట్లు తేలింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పోలీసుల పై కత్తితో దాడికి యత్నం.. ఆత్మరక్షణ కోసం పోలీసుల కాల్పులు
సోమవారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో శ్రీకాంత్ AP 39 VB 6640 నంబర్ గల డీసీఎం ఐషర్ వాహనంలో ఇబ్రహీంపట్నం నుంచి బొంగులూరు వైపు ఫస్ట్ సర్వీస్ రింగ్ రోడ్ మీదుగా వెళ్తున్నాడు. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సీసీఎస్ నల్గొండ పోలీసులు అనుమానంతో వాహనాన్ని ఆపి చెక్ చేయబోతే.. నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో పోలీసులపై దాడికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపగా, రెండు బుల్లెట్లు నిందితుడి కాళ్లకు తగిలాయని పోలీసులు తెలిపారు.
గాయపడిన శ్రీకాంత్ ను వెంటనే 108 అంబులెన్స్లో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి చేరుకున్న నల్గొండ సీసీఎస్ పోలీసులు నిందితుడిని నల్గొండకు తరలించినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించాక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిపై గతంలో ఉన్న ఆస్తి నేరాల కేసుల వివరాలు సేకరిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు























