తెలంగాణ రైల్వే రూపురేఖలు మారుతున్నాయా? కొత్త ప్రాజెక్టులు, వందే భారత్ విస్తరణతో రవాణా రంగంలో విప్లవం!
రైల్వే వ్యవస్థలో వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టడం ఓ విప్లవాత్మక మార్పుగా అభివర్ణించవచ్చు. ప్రయాణికుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. ఈ రైళ్లలో ప్రయాణించడానికి ప్యాసెంజర్స్ చాలా ఇష్టపడుతున్నారు.

ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు రవాణా రంగం కీలకం. అందులో రైల్వే కనెక్టివిటీ ఎంతో ప్రాముఖ్యమైన రవాణా సౌకర్యం. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఈ దిశగా ముందుగు సాగుతోందనే చెప్పాలి. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. అయితే, నిధుల కేటాయింపు సరిగా జరగడం లేదని, నిర్మాణ పనులు నత్తనడక సాగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న రైల్వే లైన్లు, త్వరలో పూర్తి కానున్నవి, ప్రతిపాదన దశలో ఉన్నవి, సామర్థ్యం పెంచుతూ తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ రవాణా రంగ చిత్రపటాన్ని మార్చే అవకాశం ఉంది. అవేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
ఉపాధి కల్పనకు కేంద్రంగా కాజీపేటలో కోచ్ ల తయారీ కర్మాగారం
వరంగల్ జిల్లాలో రూ. 500 కోట్లతో నిర్మిస్తున్న అత్యాధునిక రైల్వే కోచ్ల తయారీ కర్మాగారం తెలంగాణలోని యువతకు ఉపాధి కల్పించే దిశగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కర్మాగారాన్ని ఇటీవల సందర్శించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మెగా అత్యాధునిక కర్మాగారంగా అభివర్ణించారు. దీనికి సంబంధించిన సివిల్ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబర్ 25 నాటికి పూర్తవుతాయని, ఉత్పత్తి 2026లో ప్రారంభమవుతుందని చెప్పారు. ఇందులో వందే భారత్ రైలు కోచ్లు, రైలు ఇంజన్లు, సరకు రవాణా వ్యాగన్లు ఉత్పత్తి చేస్తారు. భవిష్యత్తులో మెట్రో రైల్ కోచ్లు కూడా తయారు చేయవచ్చని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రానున్న రోజుల్లో కాజీపేట రైల్వే కోచ్ కర్మాగారం స్థానిక యువతకు ఉపాధి కేంద్రంగా మారవచ్చు.
ప్రయాణికుల డిమాండ్ మేరకు వందే భారత్ రైళ్ల సామర్థ్యం పెంపు
భారతీయ రైల్వే వ్యవస్థలో వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టడం ఓ విప్లవాత్మక మార్పుగా అభివర్ణించవచ్చు. ప్రయాణికుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. ఈ రైళ్లలో ప్రయాణించడానికి ప్యాసెంజర్స్ చాలా ఇష్టపడుతున్నారు. వారి డిమాండ్ మేరకు రైల్వే శాఖ వందే భారత్ రైళ్ల సామర్థ్యాన్ని పెంచడానికి నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం వందే భారత్ రైలు 16 బోగీలతో నడిచేది. దీన్ని ఇప్పుడు 20 బోగీలకు పెంచారు. కాచిగూడ - యశ్వంత్ పూర్ (బెంగళూరు) వందే భారత్ రైలు 8 కోచ్లతో ప్రయాణించేది. దీన్ని ఇప్పుడు 16 కోచ్లకు పెంచారు. దీంతో పాటు, సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందే భారత్ రైలును ఏలూరు, సామర్లకోటలో స్టాపేజీలను మరో ఆరు నెలలపాటు పొడిగించే నిర్ణయం రైల్వే శాఖ తీసుకుంది. దీంతో ఈ ప్రాంత ప్రజల రాకపోకలకు ఇది ఎంతో ప్రయోజనకారి అవుతోంది. ప్రజల నుంచి వచ్చిన అనూహ్య స్పందన, స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన డిమాండ్లు, ఈ స్టేషన్లలో గణనీయంగా పెరిగిన టికెట్ల ఆదాయం కారణంగా రైల్వే శాఖ ఈ రెండు స్టేషన్లలో అదనపు స్టాపేజీలను ఆరు నెలలు పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ఏలూరు, సామర్లకోట నుంచి హైదరాబాద్ లేదా విశాఖపట్నం వెళ్లాలనుకునే ప్రయాణికులు నేరుగా వందే భారత్ రైలు ద్వారా తక్కువ సమయంలో గమ్య స్థానం చేరే అవకాశం ఉంది.
తెలంగాణలో కొత్త రైలు సేవలతో రూపు మార్చుకోనున్న రవాణా రంగం
తెలంగాణలో కొత్త రైల్వే సేవలను ప్రారంభించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. హైదరాబాద్ - జోధ్పూర్ మధ్య కొత్తగా రోజు వారీ రైలు సౌకర్యాన్ని జులై 19 వ తేదీన ప్రారంభించారు. ఈ రైలు సేవ కల్పించాలని చాలా కాలం నుంచి హైదరాబాద్లోని రాజస్థానీ కమ్యూనిటీ కోరుతోంది. దీంతో పాటు, ఘట్ కేసర్- యాదాద్రిగుట్ట ఎం.ఎం.టి.ఎస్. విస్తరణకు అడుగులు పడుతున్నాయి. 2016లో మంజూరయిన ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం వంద కోట్లు కేటాయించారు. ఇక కొత్త రైల్వే ప్రాజెక్టుల ప్రతిపాదనల విషయానికి వస్తే ఔటర్ రింగ్ రోడ్ రైల్ ముఖ్యమైన ప్రాజెక్టుగా చెప్పవచ్చు. తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్కు సమాంతరంగా 392 కిలోమీటర్ల ప్రతిపాదించిన ఈ రైల్వే ప్రాజెక్టుకు రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వే కూడా మంజూరయింది. రూ. 12,408 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టు హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పడం విశేషం. ఇక హైదరాబాద్ - అమరావతి కొత్త రైలు మార్గంకు సంబంధించి భూసేకరణ పనులు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం నుంచి గుంటూరు జిల్లాలోని నంబూరు వరకు ఈ మార్గాన్ని నిర్మిస్తారు. రూ. 2245 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. భూసేకరణ పనుల్లో కొంత జాప్యం ఉందన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ భూమిని రైల్వే శాఖకు అప్పజెప్పగానే నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని రైల్వే శాఖ చెబుతోంది.
రైల్వే శాఖను తెలంగాణ కోరుతున్న రైల్వే ప్రాజెక్టులు ఇవే
అయితే, మరిన్ని రైల్వే ప్రాజెక్టులు కావాలని తెలంగాణ రాష్ట్రం కేంద్ర రైల్వే శాఖ ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచింది. ఇటీవలే రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి ఈ కొత్త ప్రాజెక్టు ప్రతిపాదనలు ఆయనకు అందజేశారు. తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాలను కలిపే రైల్వే లైన్లను ప్రాధాన్యతగా భావించి మంజూరు చేయాలని కోరారు. ఆ ప్రతిపాదనలు ఇవే:
వికారాబాద్-కృష్ణా (122 కి.మీ): అంచనా వ్యయం రూ. 2,677 కోట్లు.
కల్వకుర్తి-మాచర్ల (100 కి.మీ): అంచనా వ్యయం రూ. 2,000 కోట్లు.
డోర్నకల్-గద్వాల (296 కి.మీ): అంచనా వ్యయం రూ. 6,512 కోట్లు.
డోర్నకల్-మిర్యాలగూడ (97 కి.మీ): అంచనా వ్యయం రూ. 2,184 కోట్లు.
వీటితోపాటు, రైల్వే కార్యకలాపాలను మెరుగుపరచడానికి కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేస్తోంది. దీని వల్ల తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుందన్న అభిప్రాయాన్ని ఇటీవలే కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం గమనార్హం. దీంతో పాటు, హైదరాబాద్ డ్రై పోర్ట్ - బందర్ పోర్ట్ రైల్ కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ కోరుతోంది. దీని వల్ల తెలంగాణ నుంచి ఎగుమతులు పెంచడంలో కీలకమని చెబుతోంది. ఇలా తెలంగాణలో నిర్మాణం పూర్తవనున్నవి, ప్రతిపాదన దశలో ఉన్నవి అన్నీ పూర్తయితే తెలంగాణ రైల్వే ముఖచిత్రం పూర్తిగా మారే అవకాశం ఉందని రవాణా రంగ, ఆర్థిక నిపుణుల భావన. రైల్వే కనెక్టివిటీ పెంచడం, రైల్వే కర్మాగారాల ఏర్పాటు, పోర్టు కనెక్టివిటీ, రైల్వే మౌలిక సదుపాయాల కల్పన కారణంగా తెలంగాణ రైల్వే నెట్ వర్క్ దేశంలో గుర్తించే స్థాయిలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






















